తెలంగాణలో మరో మూడు డిగ్రీ కాలేజీలకు అటానమస్ హోదా: ఆ జిల్లాలో కొత్త మండలం ఏర్పాటు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మరో మూడు ప్రభుత్వ కళాశాలలకు అటానమస్ స్టేటస్(స్వయం ప్రతిపత్తి హోదా) లభించింది. ఆయా కాలేజీలు న్యాక్-ఏ గ్రేడ్ను దక్కించుకోవడంతో యూజీసీ అటానమస్ హోదాను కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, నల్గొండ ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ, నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కాలేజీలకు అటానమస్ హోదా దక్కింది.
గత సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలోని 11 డిగ్రీ కాలేజీలకు అటానమస్ హోదాను పొందాయి. కొత్తగా మూడు కాలేజీలతో అటానమస్ హోదా దక్కించుకున్న కాలేజీల సంఖ్య మొత్తం 14 చేరింది. అటానమస్ హోదా విషయంలో యూజీసీ కొంతకాలం కిందట పలు మార్పులు చేసింది.

వర్సిటీలతో సంబంధం లేకుండా నేరుగా యూజీసీకి దరఖాస్తు చేసేలా పోర్టల్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. కాలేజీని ఏర్పాటు చేసి పది సంవత్సరాలై ఉండి.. న్యాక్-ఏ గ్రేడ్ పొందితే ఆయా కాలేజీకి అటానమస్ హోదాను కల్పిస్తోంది. తొలుత పదేళ్ల పాటు అటానమస్ హోదా ఇస్తుండగా.. 15 ఏళ్ల పాటు అటానమస్ హోదా కలిగి ఉంటే శాశ్వత అటానమస్ హోదాను ఇవ్వనున్నారు.
న్యాక్-ఏ గ్రేడ్ లేని కాలేజీల్లో కనీసం మూడు బ్రాంచీలకు ఎన్బీఏ అక్రిడిటేషన్ ఉన్నా ఈ హోదా ఇస్తారు. రాష్ట్రంలోని అటానమస్ హోదా కలిగిన కోఠి మహిళా డిగ్రీ కాలేజీని రెండేళ్ల క్రితం వర్సిటీగా అప్గ్రేడ్ చేసిన విషయం తెలిసిందే. ఈ కాలేజీల్లోని డిగ్రీ సీట్లను దోస్త్ ద్వారా, పీజీ సీట్లను సీపీగెట్ ద్వారా భర్తీ చేస్తుండగా.. ఆయా సీట్ల భర్తీకి నిర్వహించే కౌన్సెలింగ్ సమయంలో సంబంధిత కాలేజీలు పొందిన న్యాక్ గ్రేడ్ వివరాలను అదనంగా చేరుస్తారు.
జగిత్యాల జిల్లాలో కొత్త మండలం ఏర్పాటు
జగిత్యాల జిల్లాలో మరో కొత్త మండలం ఏర్పాటైంది. బండలింగాపూర్ గ్రామం మండల ఏర్పాటుకు ప్రభుత్వం సోమవారం ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసింది. మెట్పల్లిలోని పది గ్రామాలతో బండలింగాపూర్ మండలంగా ప్రతిపాదించింది. 15 రోజుల్లో అభ్యంతరాలు, వినతులకు ప్రభుత్వం గడువు ఇచ్చింది. ప్రస్తుతం జగిత్యాల జిల్లాలో 18 ఉండగా.. 380 గ్రామాలున్నాయి. మరో వైపు సంగారెడ్డి నుంచి కామారెడ్డి జిల్లాకు బాబుల్గాం గ్రామాన్ని బదలాయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.












Click it and Unblock the Notifications