ఆ ముగ్గురి సిరియా ప్లాన్: ఎక్కడ ప్లాన్ చేశారు, ఎలా వెళ్లారు?
హైదరాబాద్: ఐఎస్ఐఎస్లో చేరడానికి ప్రయాణమై నాగపూర్లో చిక్కిన ముగ్గురు హైదరాబాద్ యువకులు సిరియా వెళ్లడానికి పకడ్బందీ పథక రచన చేసుకున్నట్లు తెలుస్తోంది. తమ సిరియా ప్రయాణానికి నల్లగొండలో పథక రచన చేశారని పోలీసులు ఎఫ్ఐఆర్లో తెలిపారు. ఎఫ్ఐఆర్ కాపీ ద్వారా వారికి సంబంధించిన మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అబ్దుల్లా బాసిత్, ఫరూక్ హుస్సేన్, మాజ్ హసన్లో ఈ నెల 24వ తేదీన హైదరాబాదులోని మెహిదీపట్నం నుంచి బైక్లపై ఆదిలాబాద్కు ప్రయాణమయ్యారు. అక్కడి నుంచి వారు ట్యాక్సీలో నాగపూర్ చేరుకున్నారు. నాగపూర్ నుంచి విమానంలో శ్రీనగర్ చేరుకోవాలని ప్లాన్ వేసుకున్నారు. 31 వేలకు పైగా డబ్బులు చెల్లించి వారు ఈ టికెట్లు కొనుగోలు చేశారు.
వారు 90 వేల రూపాయల నగదు తీసుకుని వెళ్లారని చెబుతున్నారు. నాగపూర్లో ఇండిగో విమానం ఎక్కడానికి వచ్చి వారు పోలీసులకు చిక్కారు. వారికి అబ్దుల్ బాసిత్ మామ సలావుద్దీన్ రోల్ మోడల్ అని చెబుతున్నారు.
తెలంగాణలో 60 మందికి పైగా ఐఎస్ఎస్ సానుభూతిపరులున్నారని అంచనా వేస్తున్నారు. వారితో ఈ ముగ్గురు ఏమైనా సంభాషణలు జరిపారా అనే విషయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆ ముగ్గురిని పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుని విచారించే అవకాశం ఉంది. ఆ ముగ్గురు సానుభూతిపరులను పది రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టును కోరారు. ఈ మేరకు వారు మంగళవారం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.