కోదండరాం పార్టీలో కూడా టికెట్లు అమ్ముకుంటున్నారు: జ్యోత్స్న ఆరోపణ
తెచ్చుకున్న తెలంగాణకు టీఆర్ఎస్ సర్కార్ తూట్లు పొడుస్తోందంటూ కేసీఆర్ ప్రభుత్వంపై ధ్వజమెత్తి తెలంగాణ జనసమితి పార్టీని ఏర్పాటు చేశారు ప్రొఫుసర్ కోదండరాం. ఇక ఆపార్టీలో అప్పుడే లుకలుకలు ప్రారంభమయ్యాయి. పార్టీ ప్రజల్లోకి పూర్తి స్థాయిలోకి వెళ్లకముందే ఆ పార్టీ నేతల్లో అప్పుడే బేధాభిప్రాయాలు తలెత్తాయి. మహిళలకు పార్టీలో సముచిత స్థానం లేదని ఆ పార్టీ మహిళానేత జ్యోత్స్న సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ టికెట్లను అప్పుడే బేరానికి పెట్టారని ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్టీలో మహిళలకు గౌరవం లేదని ఆరోపిస్తూ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు జ్యోత్స్న ప్రకటించారు.
2019లో మా పార్టీయే 'కింగ్' అన్న కోదండరాం
తెలంగాణ జనసమితి పార్టీలో పార్టీ సీనియర్ నేత కపిల్వాయి దిలీప్ కుమార్ పార్టీలో టికెట్లు అమ్ముకుంటున్నారని ఆయనే వెనకుండి కథను మొత్తం నడిపిస్తున్నారని పార్టీ మహిళా నేత జ్యోత్స్న తీవ్ర ఆరోపణలు చేశారు. సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడిన జ్యోత్స్న... టీజేఎస్ పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మంచి ఉద్దేశంతో ప్రొఫెసర్ కోదండరాం పార్టీ స్థాపిస్తే కొందరు ఆ పార్టీని నాశనం చేసేందుకు తయారయ్యారని ఆమె చెప్పారు.
టీజేఎస్ కూడా ఇతర రాజకీయపార్టీల్లాగే బిజినెస్ సెంటర్లా మారిపోయిందని జ్యోత్స్న ఆరోపించారు. పార్టీలో వసూల్ రాజాలు కూడా చాలామందే ఉన్నారని చెప్పిన జ్యోత్స్న...దిలీప్ కుమార్ డబ్బులు వసూల్ చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు తనపై సత్యం అనే వ్యక్తిని దాడి చేసేందుకు దింపారని జ్యోత్స్న చెప్పారు. విశాల్ అనే వ్యక్తి తనకు తన భర్తకు ఫోన్ చేసి చంపుతామని బెదిరిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
కేవలం అంబర్ పేట్ టికెట్ తనకు ఇవ్వలేదనే పార్టీకి రాజీనామా చేసి జ్యోత్స్న పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తోందంటూ పత్రికల్లో రాయిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఏదైనా అడిగితే కారు బంగ్లా ఇస్తారా అని ప్రశ్నిస్తున్నారన్నారు. పార్టీలో దిలీప్ కుమార్కు ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థం కావడం లేదని ఆమె అన్నారు.
మహిళలను కించపరుస్తూ అవమానిస్తున్నారని జ్యోత్స్న ఆవేదన వ్యక్తం చేశారు. కోదండరాం ఉద్దేశాలతో పార్టీ నడవడం లేదని మనీమిషన్గా నడుస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దిలీప్ కుమార్కు తానే స్వయంగా రూ.2లక్షలు ఇచ్చానని చెప్పిన జ్యోత్స్న ఇప్పుడు ఆ డబ్బులు అడుగుతుంటే పార్టీ ఫండ్ కింద తీసుకున్నాననే సమాధానం చెబుతున్నారని ఆమె అన్నారు.