తెలుగువారి కోసం చట్టం: టాలీవుడ్పై కోదండరాం, వ్యభిచార గృహాలుగా స్టూడియోలు.. శ్రీరెడ్డి
హైదరాబాద్: సినిమా పరిశ్రమలో లైంగిక దోపిడీ జరుగుతోందని, ఇక్కడి దళారుల నుంచి నటీనటులను కాపాడాలని తెలంగాణ జన సమితి (టీజేఎస్) నేత కోదండరాం డిమాండ్ చేశారు. సినిమా పరిశ్రమలోని కాస్టింగ్ కౌచ, కో ఆర్డినేటర్ల విధానాన్ని రద్దు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
చెన్నైలో ఉన్న చిత్ర పరిశ్రమ హైదరాబాదుకు వచ్చిందని, ప్రభుత్వ సహకారంతో ఇక్కడకు వచ్చి స్థిరపడిందని, కాబట్టి స్థానిక తెలుగువారికి ఉద్యోగ అవకాశాలు, మహిళా నటులకు అవకాశం కల్పించే బాధ్యతను ప్రభుత్వం చట్టం చేయాలని డిమాండ్ చేశారు.
ఎల్బీ నగర్ ఎమ్మెల్యే, బీసీ నేత ఆర్ కృష్ణయ్య కూడా సినిమా పరిశ్రమపై మాట్లాడారు. జూనియర్ ఆర్టిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుంటే నటీనటుల ఆధీనంలో ఉన్న వేలాది ఎకరాల్లో గుడిసెలు వేయిస్తామని హెచ్చరించారు.
ఆ ఛానల్ బెదిరింపు: నటి సునీత వీడియోని పోస్ట్ చేసిన 'జనసేన' వింగ్ శతఘ్ని మిసైల్
సినీ నటి శ్రీరెడ్డి మాట్లాడుతూ.. వ్యభిచార గృహాలుగా మార్చేసిన స్టూడియోలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. పీఓడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలో అమానవీయ హింస జరుగుతుంటే, తెలుగు రాష్ట్రాల సీఎంలు తమకేమి పట్టనట్లు వ్యవహరించడం తగదన్నారు.
తెలంగాణ జన సమితి ఆవిర్భావ సభకు అనుమతివ్వాలి
సరూర్నగర్ స్టేడియంలో ఈ నెల 29న జరగనున్న తెలంగాణ జన సమితి ఆవిర్భావ సభకు అనుమతి ఇవ్వాలని పోలీసులకు హైకోర్టు తెలిపింది. అందుకు తమకు అభ్యంతరం లేదని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. తెలంగాణ జన సమితి సమర్పించనున్న దరఖాస్తును పరిగణనలోకి తీసుకొని సభకు అనుమతిస్తూ మూడు రోజుల్లో ఉత్తర్వులు జారీ చేయాలని ఎల్బీనగర్ డీసీపీని హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించారు.
సభకు సంబంధించిన అన్ని వివరాలను పోలీసులకు సమర్పించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా నిర్వాహకులు సహకరించాలని జడ్జి సూచించారు. సరూర్నగర్ స్టేడియంలో ఈ నెల 29న ఆవిర్భావ సభ నిర్వహించుకోవడానికి పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని సవాలు చేస్తూ టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అంబటి శ్రీనివాస్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు.
ఈ వ్యాజ్యం సోమవారం హైకోర్టులో మరోసారి విచారణకు వచ్చింది. పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎస్జీపీ) శరత్ కుమార్ వాదనలు వినిపించారు. 29న సభ నిర్వహించుకునేందుకు అభ్యంతరం లేదన్నారు. ఆ స్టేడియం సామర్థ్యం ఐదు వేల వరకు మాత్రమేనన్నారు. 40, 50 వేల మంది హాజరైతే నిర్వహణ కష్టంగా మారుతుందన్నారు. సభకు వచ్చే వారి భద్రత దృష్ట్యా ప్రతి వ్యక్తిని తనిఖీ చేసి అనుమతిస్తామన్నారు.
ఆ వాదనలపై పిటీషనర్ తరఫు న్యాయవాది రచనారెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. స్టేడియం సామర్థ్యం లక్షల్లో ఉందని తెలిపారు. ఇరువైపు వాదనలు విన్న న్యాయమూర్తి.. స్టేడియం సామర్థ్యం విషయాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలిస్తారని చెప్పారు. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. పిటీషనర్ సమర్పించబోయే దరఖాస్తును దృష్టిలో ఉంచుకొని సభ నిర్వహణకు అనుమతివ్వాలని ఆదేశించారు.