ఎవర్నీ వదలొద్దు: నయీం డైరీలో ఉన్న పేర్లను బయట పెట్టాలన్న కోదండరాం
హైదరాబాద్: గ్యాంగ్స్టర్ నయీం డైరీలో ఉన్న పేర్లన్నీ బయట పెట్టాలని తెలంగాణ జెఎసి చైర్మన్ కోదండరాం డిమాండ్ చేశారు. నయీం కేసు గురించి ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ నయాం కేసుతో సంబంధం ఉన్న అందరిపై కేసులు నమోదు చేయాలని అన్నారు.
బలవంతపు వసూళ్లు, భూదందాలకు పాల్పడిన నయీం గ్యాంగ్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్పై కూడా తమ ప్రభావాన్ని చూపేలా వ్యవహరించారని ఆయన అన్నారు. నయీం గ్యాంగ్ చేసిన పనులన్నీ కూడా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే విధంగా ఉన్నాయని అన్నారు.
నయీం కేసులో ఎవరైనా, ఏ స్థాయిలో ఉన్నా, ఎంతటి వారైనా వదిలిపెట్టకుండా అందరిపై కేసులు నమోదు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కూడా ఆ దిశగా అడుగులు వేసి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. తన ఫోన్ను ట్యాపింగ్ చేసినా, నిఘా పెట్టిన చట్ట విరుద్ధమని అన్నారు.
నేరస్తులతో రాజకీయనేతలు సన్నిహితంగా వ్యవహరించడం సరికాదని ఆయన అన్నారు. టీజేఏసీపై నిఘా పెట్టడం కంటే ఇలాంటి వారిపై నిఘా పెట్టడం మంచిదని వ్యాఖ్యానించారు. జేఏసీ కార్యకలాపాలన్నీ బహిరంగమేనని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు.
చట్టబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ఇలా చేయడం చట్ట వ్యతిరేకమని అన్నారు. 123 జీవో కింద భూసేకరణ చేస్తున్నారని తమ దృష్టికి వచ్చిందని కోదండరాం అన్నారు. 123 జోవో కింద భూసేకరణ చట్ట విరుద్ధమని ఆయన అన్నారు. ఈ మేరకు కోదండరాం నేతృత్వంలోని జెఎసి నేతలు సీఎస్ రాజీవ్ శర్మను కలిశారు.
ఇక నయీం కేసుని ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా తీసుకుంది. నయీం కేసులో ఎంతటి పెద్దవాళ్లనైనా వదిలిపెట్టబోమని హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి స్పష్టం చేశారు. కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోందని ఆయన పేర్కొన్నారు. నయీం కేసుపై నాగిరెడ్డి నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసినట్లు ఆయన గుర్తు చేశారు.