జనగామ నుంచే కోదండరాం పోటీ ఎందుకు, సర్వే ఎలా ఉంది?: వేరేచోటుకు పొన్నాల
జనగామ: మహాకూటమి పొత్తులో భాగంగా తెలంగాణ జన సమితికి (టీజేఎస్) 8 సీట్లను కాంగ్రెస్ పార్టీ కేటాయించింది. ఈ పార్టీ అధ్యక్షులు కోదండరాం జనగామ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. జనగామ, మెదక్, మల్కాజిగిరి, దుబ్బాక, సిద్దిపేట, రామగుండం, వర్ధన్నపేట, మిర్యాలగూడ నియోజకవర్గాలను ఈ పార్టీకి కేటాయించారని తెలుస్తోంది.
మళ్లీ చెప్తున్నా! వారితో మాట్లాడుతా, సీట్లు అడగకండి: టీటీడీపీ నేతలతో చంద్రబాబు
Recommended Video
మహబూబ్ నగర్, వరంగల్ తూర్పు స్థానాలను కూడా కోదండరాం డిమాండ్ చేస్తున్నారు. కాగా, తమకు కేటాయించిన సీట్లలో భాగంగా రామగుండం, జనగామలలో ఓ స్థానం నుంచి పోటీ చేయాలని కోదండ భావిస్తున్నారు. అన్నింటిని బేరీజు వేసుకొని జనగామ నుంచే పోటీ చేయాలని ఆయన భావిస్తున్నారని తెలుస్తోంది.
పొన్నాల లక్ష్మయ్య మరో స్థానానికి
పొత్తులో భాగంగా జనగామ నియోజకవర్గాన్ని కాంగ్రెస్ పార్టీ టీజేఎస్కు ఇచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కీలక నేత పొన్నాల లక్ష్మయ్య ఉన్నారు. ఈ సీటును వదులుకునేందుకు ఆయన సిద్ధం కాలేదు. అయితే ఏఐసీసీ జోక్యంతో పొన్నాలను మరో నియోజకవర్గానికి మార్చి, ఈ సీటును టీజేఎస్కు కేటాయించారని తెలుస్తోంది. ఇప్పుడు పొన్నాల వరంగల్ పశ్చిమ నుంచి పోటీ చేయనున్నారని తెలుస్తోంది.
పోటీ చేసేది వీరే
సమాచారం మేరకు టీజేఎస్లో కోదండరాం జనగామ నుంచి పోటీ చేయనున్నారు. మెదక్ బరిలో జనార్దన్ రెడ్డి, దుబ్బాక నుంచి రాజ్ కుమార్, సిద్దిపేట నుంచి భవాని, మల్కాజిగిరి నుంచి కపిలవాయి దిలీప్ కుమార్, మహబూబ్నగర్ నుంచి రాజేందర్ రెడ్డి, మేడ్చల్ నుంచి హరివర్ధన్ రెడ్డి పేర్లు ఖరారు చేశారని తెలుస్తోంది. వర్ధన్నపేట అభ్యర్థి ఖరారు కావాల్సి ఉంది. వరంగల్ తూర్పు స్థానం కోసం టీజేఎస్ పట్టుబడింది. ఇక్కడి నుంచి ఇన్నయ్యను బరిలోకి దింపాలని భావిస్తున్నారు. కానీ సీట్ల సర్దుబాటులో భాగంగా ఆ స్థానాన్ని టీడీపీకి ఇచ్చారు. ఇక్కడి నుంచి టీడీపీ నేత రేవూరి ప్రకాశ్ రెడ్డి పోటీ చేస్తారు.
సర్వేలో టీజీఎస్కు ఆదరణ
కోదండరాం జనగామ నుంచి పోటీ చేయడానికి పలు కారణాలు ఉన్నాయని చెబుతున్నారు. జనగామను జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని ఆయన ఉద్యమంలో పాల్గొన్నారు. ఇక్కడ ఆయన బంధువులు కూడా చాలామంది ఉన్నారు. ఈ స్థానం నుంచి పోటీ చేస్తే గెలుపు సులువు అవుతుందని భావిస్తున్నారు. దీనికి తోడు టీజేఎస్ సర్వేలో కూడా జనగామలో టీజేఎస్కు బాగా ఆదరణ ఉందని తేలిందని తెలుస్తోంది.
ఇవి కోరుకుంటే దక్కలేదు
కోదండరాం మొదటి నుంచి 12కు పైగా సీట్లు అడుగుతున్నారు. కానీ చివరకు 8 సీట్లు దక్కాయి. మిర్యాలగూడ, ఎల్లారెడ్డి, నిజామాబాద్ అర్బన్, అసీఫాబాద్, ఖానాపూర్, చెన్నూరు, స్టేషన్ ఘనపూర్, షాద్ నగర్, ఆలేరు నియోజకవర్గాలను కూడా వారు అఢిగారు. స్టేషన్ ఘనపూర్లో స్వేహపూర్వక పోటీ తప్పకపోవచ్చు.