టీఆర్ఎస్లో చేరనున్న టాలీవుడ్ డైరెక్టర్ తండ్రి!: 29న ముహూర్తం ఫిక్స్..
టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తండ్రి పైడిపల్లి రవీందర్ రావు టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు మే29న ఆయన గులాబీ గూటికి చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు.
ఖానాపూర్: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత ఇక్కడి ప్రతిపక్షాల ఉనికిని అధికార పార్టీ చావుదెబ్బ కొట్టింది. తిరిగి కోలుకోలేని రీతిలో టీఆర్ఎస్ విపక్షాలను మట్టికరిపించింది. మధ్యలో నారాయణఖేడ్ ఉపఎన్నిక, వరంగల్ ఉపఎన్నికల ద్వారా జనం తమ వెంటే ఉన్నారని నిరూపించుకుంది.
మొత్తంగా తొలి మూడేళ్లు ఆ పార్టీకి ఎదురులేకుండా పోయిందనేది వాస్తవం. అయితే ఇప్పుడిప్పుడే ఆ పార్టీపై జనంలో గూడుకట్టుకున్న వ్యతిరేకత బయటపడుతున్నట్లుగా స్పష్టమవుతోంది. ఇలాంటి తరుణంలో మళ్లీ టీఆర్ఎస్ లోకి వలసలు మొదలవడం వ్యతిరేకతను కనుమరుగుచేసే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలోనే తాజాగా టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తండ్రి పైడిపల్లి రవీందర్ రావు టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు మే29న ఆయన గులాబీ గూటికి చేరేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ఇందుకోసం ఆయన తన టీపీసీసీ కార్యదర్శి పదవికి కూడా రాజీనామా చేశారు. గతంలో రవీందర్ రావు ఏపీపీఎస్సీ సభ్యుడిగాను పనిచేశారు.
బంగారు తెలంగాణ నిర్మాణంలో సీఎం కేసీఆర్ కు తనవంతు సహకారం అందించాలనే ఉద్దేశంతోనే పార్టీలో చేరుతున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేసీఆర్ నిరంతరం శ్రమిస్తున్నారని కొనియాడారు.