కరోనా ఇంకా ఘోరంగా తయారైంది: ఆలస్యం చేయొద్దంటూ ప్రజలకు విజయ్ దేవరకొండ పిలుపు
హైదరాబాద్: దేశంలో సెకండ్ వేవ్లో కరోనా మహమ్మారి మరింతగా విజృంభిస్తోంది. దేశ వ్యాప్తంగా రోజుకు 4 లక్షలకుపైగా కరోనా కేసులు, 3వేలకుపైగా మరణాలు సంభవిస్తున్నాయి. మహారాష్ట్ర, కేరళ, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, తదితర రాష్ట్రాల్లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ, సినీ ప్రముఖులు ప్రజలకు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని, కరోనా నిబంధనలను పాటించాలని పిలుపునిస్తున్నారు.
పరిస్థితి ఘోరంగా తయారైంది..
ఈ క్రమంలో టాలీవుడ్ యువ హీరో విజయదేవరకొండ తెలంగాణ ప్రభుత్వం తరపున ప్రజలకు కరోనా పట్ల పలు కీలక సూచనలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్టు చేశారు. కోవిడ్ సెకండ్ వేవ్ ఇండియాను చాలా ఇబ్బంది పెడుతోంది. 2020లో మనం అందరం ఎంతో కష్టపడ్డాం. బయటపడ్డాం.. అనుకునేలోపే పరిస్థితి ఇంకా ఘోరంగా తయారయ్యిందని విజయ్ దేవరకొండ ఆవేదన వ్యక్తం చేశారు.
వెంటనే చికిత్స తీసుకోవాలి..
గత కొద్ది రోజులుగా లక్షలాది మంది కరోనా బారినపడుతున్నారు. కరోనా వేగంగా వ్యాపిస్తోంది. కానీ, మనం అందరం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ పరిస్థితిని అధిగమించవచ్చన్నారు. మనకు ఎలాంటి కోవిడ్ లక్షణాలు కనిపించినా వెంటనే చికిత్స తీసుకుంటే ఏ ఇబ్బంది ఉండదని విజయ్ సూచించారు.
అది ఖచ్చితంగా కరోనా అయి ఉంటది..
మీకు దగ్గు, జ్వరం, తలనొప్పులు ఉన్నాయంటే ఖచ్చితంగా కరోనా అయి ఉంటది. వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లి చికిత్స తీసుకోండి. కరోనా టెస్ట్ చేయించుకుని, రిజల్ట్ వచ్చేదాకా ఎదురుచూడకుండా.. ఏ లక్షణాలు కనిపించినా వెంటనే కరోనా నిబంధనలు పాటిస్తూ.. చికిత్స తీసుకోవాలన్నారు. టైమ్ అన్నిటికంటే ముఖ్యమైనదని అన్నారు.
Recommended Video
జాగ్రత్తగా ఉండండి అంటూ విజయ్ దేవరకొండ..
తెలంగాణ ప్రభుత్వం ప్రతీ ఆరోగ్య కేంద్రం, ఏరియా ఆస్పత్రుల్లో, బస్తి దవాఖానాల్లో, కోవిడ్ అవుట్ పేషెంట్ డాక్టర్లను నియమించారని, కరోనా బాధితులు వారితో మాట్లాడవచ్చని అన్నారు. మీరు ఏ గవర్నమెంట్ ఆస్పత్రికి వెళ్లినా కొన్ని మందులను ఒక కిట్ రూపంలో ఇస్తారు. అవి వాడితే సరిపోతుంది. జాగ్రత్తగా ఉండండి.. అంటూ రాష్ట్ర ప్రజలకు అవగాహన కల్పించారు విజయ్ దేవరకొండ.