నయీంతో మంత్రి అచ్చెన్నాయుడు లింకు: సవాల్ విసిరిన నట్టి, బాలకృష్ణను లాగారు
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీంతో ఏపీ మంత్రి అచ్చెన్నాయుడుకు లింకులున్నాయని, తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని నిర్మాత నట్టికుమార్ అన్నారు. మంగళవారం ఓ టీవీ ఛానెల్తో మాట్లాడిన ఆయన మీడియా సాక్షిగా మంత్రి అచ్చెన్నాయుడు చర్చకు వస్తే, తాను చేసిన ఆరోపణలను నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు.
సైకిల్ స్టాండ్ ఓనర్గా కెరీర్ ప్రారంభించిన జగ్గిరెడ్డి ఈ రోజు ఎలా ఎదిగాడని ప్రశ్నించారు. ఏపీలో నయీం సెటిల్ మెంట్లన్నీ జగ్గిరెడ్డి చూసేవాడని ఆయన చెప్పారు. పీలా గోవిందు నివాసం నుంచి జగ్గిరెడ్డి ఈ లావాదేవీలు నిర్వహించేవాడని ఆయన తెలిపారు. ఈ జగ్గిరెడ్డి వెనుక మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నారని ఆయన ఆరోపించారు.
దీనికి సంబంధించి తన వద్ద సాక్ష్యాలు ఉన్నాయని, తాను నిరూపిస్తే అచ్చెన్నాయుడు రాజకీయ సన్యాసం చేస్తారా? అని ఆయన సవాల్ విసిరారు. ఏపీలో చంద్రబాబు పెట్టుబడులు పెట్టాలని పిలుపునిస్తుంటే వాటిని నమ్మి తన సొంత జిల్లా శ్రీకాకుళంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకెళ్లానని ఆయన అన్నారు.
'నయీమ్తో అచ్చెన్నాయుడికి సంబంధాలు: సినీ నిర్మాతలతో కూడా'
నయీంకు చెందిన మనుషులు కొందరు తనపై దౌర్జన్యానికి కూడా దిగారని పేర్కొన్నారు. ఒక రోజు విమానంలో అచ్చెన్నాయుడుతో ఇలా చేయడం న్యాయం కాదని విన్నవించుకున్నా ఫలితం లేకపోయిందన్నారు. పోలీసుల దగ్గరకు వెళ్తే ఈ విషయంలో మంత్రి అచ్చెన్నాయుడు ప్రమేయం ఉందని మ్యాటర్ సెటిల్ చేసుకోవాల్సిందిగా చెప్పారని అన్నారు.
బాలకృష్ణను కలిసి పరిస్థితి చెప్పుకునేందుకు నాలుగు సార్లు ప్రయత్నించానని అయినా ఉపయోగం లేకపోయిందని ఆవేదన చెందారు. సీఎం చంద్రబాబు కూడా కలిసేందుకు ప్రయత్నించానని, తనకు అవకాశం ఇవ్వలేదన్నారు. తాను ఇప్పుడు బయటకు వచ్చి ఇవన్నీ చెప్పడానికి కారణం ఉందన్నారు.
ఎలాగో తనను చంపేస్తారని, మీడియా ముందుకు రాకపోయి ఉంటే ఇప్పటికే తనను చంపేసేవారని ఆయన అన్నారు. మరో పది రోజులకైనా తనను చంపేస్తారని అన్నారు. చావుకు తాను భయపడడం లేదన్నారు. కానీ సినీ పరిశ్రమల కొందరు నాశనం చేస్తన్నారంటూ నిర్మాతలు సి. కల్యాణ్, బండ్ల గణేష్, అశోక్ కుమార్, బూరుగుపల్లి శివరామకృష్ణ, సచిన్ జోషిపై ఆరోపణలు చేశారు.
నయీం గ్యాంగ్ నుంచి ప్రమాదం ఉందని పోలీసుల ద్వారా తెలుసుకున్న తెలంగాణ సీఎం కేసీఆర్ వెంటనే అల్వాల్లో తన ఇంటికి భద్రత కల్పించారని చెప్పారు. కానీ విశాఖపట్నంలో ఆరుగురి ముఠాతో కూడిన బృందం సోమవారం సాయంత్రం వచ్చి తన ప్లాట్ను వీడియో తీసుకుని వెళ్లారని, విశాఖలో తనను చంపినా పట్టించుకునే నాధుడే లేడని అన్నారు.
తాను అడక్కపోయినా భద్రత కల్పించిన కేసీఆర్కు కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. అచ్చెన్నాయుడుకి నయీం గ్యాంగ్తో సంబంధాలున్న మాట వాస్తవమని చెప్పిన నట్టికుమార్ ఆయన ఎక్కడెక్కడ ఎంతెంత పెట్టుబడులు ఎలా పెట్టారో చర్చకు రాగలరా? అని ఆయన ప్రశ్నించారు.
తనది తప్పుంటే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని ఆయన అన్నారు. మంత్రి అచ్చెన్నాయుడి అనుచరుడైన జగ్గిరెడ్డి తనను చాలా సార్లు హెచ్చరించాడని, పెద్దవాళ్లతో గొడవలెందుకని తనతో అనేవాడని ఆయన చెప్పారు. ఇప్పటికిప్పుడు క్షణం వైజాగ్ హార్బర్, పోర్టుల నుంచి వెళ్లే క్యారియర్లపై నిఘా వేస్తే సుమారు వెయ్యి కోట్లు దొరికే అవకాశం ఉందని అన్నారు.