జనజీవన స్రవంతిలోకి జంపన్న దంపతులు: 6రాష్ట్రాల్లో రూ.కోటి రివార్డులు
హైదరాబాద్: మావోయిస్టు కీలక నాయకులైన జంపన్న దంపతులు జనజీవన స్రవంతిలో కలిసిపోయారు. కాగా, లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత జీనుగ నర్సింహారెడ్డి అలియాస్ జంపన్న, భార్య రజిత దంపతులను డీజీపీ మహేందర్రెడ్డి సోమవారం మధ్యాహ్నం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. వీరిపై ఆరు రాష్ట్రాల్లో దాదాపు రూ. కోటి రివార్డులు ఉన్నాయి.
జంపన్న దంపతులను మీడియా ఎదుట ప్రవేశపెట్టిన డీజీపీ వివరాలు వెల్లడించారు. 1984లో పీల్స్ల్స్గ్రూప్లో దళ సభ్యుడిగా చేరిన జంపన్న ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని అగ్రనేతగా ఎదిగారని డీజీపీ తెలిపారు. ఆయనపై మొత్తంగా 100 కేసులు.. తెలంగాణలో సుమారు 50కి పైగా కేసులున్నాయన్నారు.
జంపన్న చేరిక అందుకే..
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మావోయిస్టుల్లో మార్పు రావడం లేదని.. అందుకే సైద్ధాంతిక విబేధాలతో తాను మావోయిస్టు దళం నుంచి బయటకు వచ్చి లొంగిపోతున్నట్లు జంపన్న చెప్పినట్లు డీజీపీ వెల్లడించారు. జంపన్నపై రూ.25లక్షలు, రజితపై రూ.5 లక్షల రివార్డు ఉందని.. నిబంధనల ప్రకారం ఆ మొత్తాన్ని వారికి అందజేస్తామన్నారు. దేశవ్యాప్తంగా మావోయిస్టు గ్రూపుల్లో తెలంగాణకు చెందిన 135 మంది పనిచేస్తున్నారని డీజీపీ తెలిపారు. వారంతా జనజీవన స్రవంతిలో కలిసిపోతే ప్రభుత్వం నుంచి సాయం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.
33ఏళ్ల క్రితం మావోయిస్టు పార్టీలోకి
మహబూబాబాద్లోని తొర్రూర్ మండలం చెర్లపాలెం గ్రామానికి చెందిన నర్సింహారెడ్డి పాలిటెక్నిక్ చదువుతున్న వయస్సులో 1984 పీపుల్స్వార్ (పీడబ్ల్యూ) కార్యక్రమాలకు ఆకర్షితులయ్యారు. అదే ఏడాది ఏటూరునాగారంలో నిర్వహించిన పీపుల్స్ కార్యక్రమంలో కీలకపాత్ర పోషించిన అతడు... ఆ తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లా డు. తొలుత మహదేవ్పూర్ ఏరియా కమిటీలో పనిచేశాడు. అనతికాలంలోనే ఏటూరు నాగారం - మహదేవ్పూర్ కమిటీల కార్యదర్శిగా, ఉత్తర తెలంగాణ జోనల్ కమిటీ కార్యదర్శిగా నియమితుడయ్యాడు.
దాడుల్లో కీలకంగా..
సుమారు 25ఏళ్ల కిందటే కేంద్ర కమిటీలో చేరి, ప్రస్తుతం మిలిటరీ విభాగం చీఫ్గా పనిచేస్తున్నాడని తెలిసింది. మావోయిస్టు అగ్రనాయకులకు సంబంధించిన భద్రత, శిక్షణ, కార్యక్రమాల రూపకల్పన వంటి అంశాల్లో దిట్ట అయిన జంపన్న.. కేంద్ర కమిటీలో కీలక నేతగా కొనసాగారు. జంపన్న ప్రస్తుత భూపాలపల్లి జిల్లాలోని రెండు పోలీస్ స్టేషన్లపై దాడులు చేసి ఆయుధాలు దొంగలించిన ఘటనలో కీలక పాత్ర పోషించారని డీజీపీ తెలిపారు. గతంలో పోలీసు జీపును పేల్చి పలువురు పోలీసుల ప్రాణాలు తీసిన ఘటనలోనూ జంపన్న హస్తం ఉందని తెలిపారు.
లొంగుబాటుకు మార్గం సుగమం
ఏడాదిగా మావోయిస్టు కేంద్ర కమిటీలో విభేదాలు వచ్చినట్టు తెలిసింది. విద్యాలయాలు, రోడ్డుమార్గాలు, వంతెనలను ధ్వంసం చేయడం వంటి కార్యక్రమాలను జంపన్న వ్యతిరేకించాడని సమాచారం. మావోయిస్టు మార్గదర్శకాల మేరకు.. ఎవరైనా పార్టీని వీడాలనుకుంటే ఏడాది ముందే విషయాన్ని అగ్రనాయకుల దృష్టికి తీసుకెళ్లాలి. వారు సమ్మతిస్తే ఆరునెలల ముందే నెట్వర్క్ కట్చేసి, కార్యకలాపాలకు దూరంగా ఉంచుతారని సమాచారం. రెండేళ్లుగా జంపన్న మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నట్టు సమాచారం. జంపన్న విషయంలో ఆరునెలల కిందటే అగ్రనాయకత్వం నిర్ణయం తీసుకున్న విషయాన్ని గుర్తించిన రాష్ట్ర పోలీసులు, ఆయన కదలికలపై నిఘా పెట్టినట్టు తెలిసింది. మూడునెలలుగా పోలీసులు చేస్తున్న కృషితో జంపన్న దంపతుల లొంగుబాటుకు మార్గం సుగమం అయినట్లు సమాచారం. కాగా, కీలక నేతగా ఉన్న జంపన్న దంపతులు పార్టీని వీడటం మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బగా చెప్పుకోవచ్చు.