లోక్ సభకు పోటీ చేసిన టాప్ త్రీ సంపన్న అభ్యర్థుల్లో ఇద్దరు తెలంగాణా వారే ..వారెవరంటే
Recommended Video
ఏడు విడతలుగా సాగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అన్ని పార్టీలతో కలిపి 8049 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులపై ఆసక్తికర సర్వేలు జరుగుతున్నాయి . నిన్నటికి నిన్న ఇండియా టుడే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులలో విద్యా వంతులు ఎవరు అన్నదానిపై సర్వే నిర్వహిస్తే తాజాగా నేషనల్ ఎలక్షన్ వాచ్ , అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రీఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థలు లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులలో అత్యంత సంపన్నులు ఎవరు అన్నదానిపై సర్వే నిర్వహించింది.

లోక్ సభ అభ్యర్థులుగా పోటీ చేసిన వారిలో సంపన్నుల జాబితాపై సర్వే
ఎంపీ అభ్యర్థులుగా బరిలో ఉన్న వారి అఫిడవిట్లను ఆధారంగా చేసుకొని నిర్వహించిన సర్వేలో దేశంలోని లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసిన అత్యంత ధనికుడైన అభ్యర్థి బిహార్ కు చెందిన ఇండిపెండెంట్ అభ్యర్థి గా గుర్తించారు. బిహార్ కు చెందిన ఆర్కే శర్మ రూ. 1107 కోట్లు తన అఫిడవిట్లో పేర్కొని అత్యంత ధనిక అభ్యర్థిగా తేలారు. ఇక.. రెండు.. మూడు స్థానాలు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వారు కావటం విశేషం. రెండో స్థానంలో చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి నిలిచారు. రూ.895 కోట్లు తన అఫిడవిట్లో పేర్కొన్నారు.. మూడో స్థానంలో కొండాపై పోటీ చేసిన టీఆర్ ఎస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి నిలవటం ఆసక్తికర అంశంగా చెప్పక తప్పదని తెలుస్తుంది.

టాప్ త్రీలో ఇద్దరు తెలంగాణా రాష్ట్రానికి చెందినవారే ..
దేశం మొత్తంమీద అత్యంత ధనిక అభ్యర్థుల్లో టాప్ త్రీ చూస్తే వారిలో ఇద్దరు తెలంగాణ రాష్ట్రంలో బరిలో ఉన్న వారు. వారు కూడా చేవెళ్ళ లోక్ సభ స్థానం నుండి పోటీ చేసిన అభ్యర్థులే. కాగా.. మొత్తం అభ్యర్థుల్లో కోటీశ్వరుల ఎంతమంది అన్న శాతం లెక్కల్లో మాత్రం తెలంగాణ చివరి స్థానంలో నిలిచింది. పార్టీల వారీగా చూస్తే.. బీజేపీ అభ్యర్థుల సగటు ఆస్తి రూ.13.37 కోట్లుగా ఉంటే.. కాంగ్రెస్ అభ్యర్థుల ఆస్తి సగటున రూ.19.92 కోట్లు.. బీఎస్పీ సగటు రూ.3.86 కోట్లు.. సీపీఎం సగటు రూ.1.28 కోట్లు.. ఇండిపెండెంట్ల సగటు రూ.1.25 కోట్లుగా ఉంది.రాష్ట్రాల వారీగా చూసినప్పుడు అభ్యర్థుల్లో కోటీశ్వరులు అత్యధికులు అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన వారు కావటం విశేషం. ఈ రాష్ట్రంలో బరిలో ఉన్న అభ్యర్థుల్లో 83 శాతం మంది కోటీశ్వరులే. తర్వాతి స్థానంలో మేఘాలయ 78 శాతం.. మిజోరం 67 శాతం.. నాగాలాండ్.. డామన్ అండ్ డయ్యూ.. లక్షద్వీప్.. గోవాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో 50 శాతం కోటీశ్వరులే. జమ్ముకశ్మీర్ లో 48 శాతం ఉండగా.. హిమాచల్ ప్రదేశ్ లో 47 శాతం.. ఆంధ్రప్రదేశ్ లో 42 శాతం అభ్యర్థులు కోటీశ్వరులుగా తేలారు.

గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో రెండు శాతం పెరిగిన కోటీశ్వరులు
లోక్ సభకు పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో కోటీశ్వరుల సంఖ్య ప్రతీ ఎన్నికలకూ అంతకంతకూ పెరుగుతోంది. 2009లో బరిలో నిలిచిన అభ్యర్థుల్లో కోటీశ్వరులు 16 శాతం ఉంటే.. 2014 నాటికి అది 27 శాతానికి పెరిగింది. తాజా ఎన్నికల్లో అది మరో రెండు శాతం పెరిగి 29 శాతానికి చేరింది. ఏది ఏమైనప్పటికీ లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో పోటీ చేసిన అభ్యర్థుల అఫిడవిట్లను ఆధారంగా చేసుకొని నిర్వహిస్తున్న సర్వేలు పలు ఆసక్తికర అంశాలను వెల్లడిస్తున్నాయి.












Click it and Unblock the Notifications