కరోనా : తెలంగాణ లేటెస్ట్ బులెటిన్.. కొత్తగా 16 పాజిటివ్ కేసులు
తెలంగాణలో కొత్తగా మరో 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 487కు చేరుకుందనివైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందులో అత్యధికంగా 179 కేసులు హైదరాబాద్లోనే నమోదైనట్టు తెలిపింది. నిజామాబాద్లో 49,రంగారెడ్డి 27,వరంగల్ అర్బన్ 23,మేడ్చల్ 21 ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ మేరకు తెలంగాణ ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
ఇప్పటివరకు రాష్ట్రంలో వైరస్ కమ్యూనిటీ ట్రాన్స్మిషన్ జరగలేదని తాజాగా మరోసారి స్పష్టం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 101 హాట్ స్పాట్ సెంటర్స్ను గుర్తించినట్టు వెల్లడించింది. ప్రతీరోజూ ఉదయం 9గం. నుంచి 11గం. మధ్య చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నట్టు పేర్కొంది.రాష్ట్రంలోని 6 డయాగ్నోస్టిక్స్ ల్యాబ్స్ నిరంతరం పనిచేస్తున్నాయని.. మర్కజ్ ఫ్యామిలీ కాంటాక్ట్స్,సెకండరీ కాంటాక్ట్స్ను గుర్తించి.. పరీక్షలు నిర్వహించి.. చికిత్స అందించడం జరుగుతోందని తెలిపింది. పాజిటివ్ కేసులు వచ్చిన అన్ని జిల్లాల్లో కంటైన్మెంట్ చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది.
ఎవరికైనా జలుబు,పొడి దగ్గు,శ్వాస సమస్య వంటి కరోనా అనుమానిత లక్షణాలు ఉంటే వెంటనే సమీపంలోని ప్రభుత్వ హెల్త్ కేర్ సెంటర్లో రిపోర్ట్ చేయాలని ఆరోగ్య శాఖ మరోసారి ప్రజలకు విజ్ఞప్తి చేసింది. కరోనాపై ఏదైనా సమాచారం కోసం 104 నెంబర్లో సంప్రదించాలని పేర్కొంది. ప్రభుత్వం కరోనా నియంత్రణకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని.. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని వెల్లడించింది. సోషల్ డిస్టెన్స్,లాక్ డౌన్ నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది.