అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు: ప్రియాంక గాంధీ పర్యటన వాయిదా, మళ్లీ ఎప్పుడంటే?
హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా తెలంగాణ పర్యటన మరోసారి వాయిదా పడింది. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శనివారం (జులై 29న) తెలంగాణ పర్యటనను ఆయన రద్దు చేసుకున్నారు. అమిత్ షా తెలంగాణ పర్యటన ఎప్పుడు ఉంటుందనేది త్వరలోనే ప్రకటిస్తామని బీజేపీ వెల్లడించింది.
తెలంగాణలో పార్టీ విస్తరణ పనుల్లో భాగంగా అమిత్ షా పర్యటనకు బీజేపీ నాయకులు ప్రణాళికలు సిద్ధం చేశారు. వివిధ రంగాల్లోని ప్రముఖులను కలవడంతోపాటు పార్టీలోకి పలువురు నేతలకు చేర్చుకునేందుకు వ్యూహం రచించారు. అయితే, తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటిచారు బీజేపీ రాష్ట్ర నాయకులు. వర్షాలు తగ్గుముఖం పట్టిన తర్వాత తిరిగి అగ్రనేతలను రాష్ట్రానికి రప్పించనున్నట్లుగా తెలుస్తోంది.

మరోవైపు, బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ నియోజకవర్గం గజ్వేల్ ఇటీవల జరిగిన అలర్లలో జైలుకెళ్లిన బాధితులను కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్రెడ్డి పరామర్శించారు. శివాజీ విగ్రహాన్ని అవమానించిన వారిని అడ్డుకుంటే తమ పార్టీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెట్టారని కిషన్రెడ్డి మండిపడ్డారు. మజ్లిస్ పార్టీ అండ ఉంటే తిరిగి అధికారంలోకి వస్తామనే ఆలోచనలో బీఆర్ఎస్ ఉందని ఆరోపించారు. పోలీసు కేసులతో తమను భయపెట్టాలని చూస్తే తాము బెదిరిపోమని అన్నారు. కిషన్రెడ్డి వెంట దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా బాధితులను పరామర్శించారు.
ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటన వాయిదా
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీ వాద్రా తెలంగాణ పర్యటన కూడా వాయిదా పడింది. ఇప్పటికే కొల్లాపూర్లో భారీ బహిరంగసభ కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు. అంతేగాక, కాంగ్రెస్ పార్టీలో జూపల్లి కృష్ణారావు ఈ సభలోనే చేరనున్నారు. జులై 30వ తేదీన ప్రియాంకా గాంధీ వచ్చేందుకు ఆమె కూడా అంగీకరించారు. అయితే భారీ వర్షాల కారణంగా ఈ సభను వాయిదా వేయక తప్పలేదు.
ఆగస్టు 5వ తేదీన ప్రియాంక సభను నిర్వహించాలని నిర్ణయంచారు. ప్రియాంకా గాంధీ కొల్లాపూర్ సభ వాయిదా పడటం ఇది రెండోసారి. గతంలో గతంలో ఇరవయ్యో తేదీన సభను నిర్వహించాలనుకున్నారు. కానీ ప్రియాంకా గాంధీ బిజీగా ఉండటంతో వాయిదా పడింది. ఈ సారి ప్రియాంకా గాంధీ సమయం ఇచ్చినా వర్షాల కారణంగా వాయిదా వేయక తప్పలేదు.
కొల్లాపూర్ సభలో బలప్రదర్శన చేసేందుకు జూపల్లి కృష్ణారావు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ సభలోనే మహిళల అభ్యున్నతి కోసం ప్రియాంక గాంధీ మహిళా డిక్లరేషన్ ప్రకటించేందుకు ఏర్పాట్లు చేశారు. కొల్లాపూర్ సభలో పెద్ద ఎత్తున చేరికలకు కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్రెడ్డి, ఆయన తనయుడు రాజేష్రెడ్డి, గద్వాల జడ్పీ చైర్పర్సన్ సరిత తదితర అనేక మంది నేతలు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు.












Click it and Unblock the Notifications