విచ్చలవిడిగా రేపులు, మర్డర్లు, డ్రగ్స్ ధందా: రేవంత్ రెడ్డి టాప్ గేర్: అమిత్ షా అపాయింట్మెంట్
హైదరాబాద్: రాష్ట్రంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సారథ్యంలో అధికారంలో ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వంపై తన రాజకీయ పోరాటాన్ని మరింత తీవ్రతరం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే దళిత బంధు పథకంపై ఉద్యమిస్తోన్న కాంగ్రెస్.. తన గేరును మార్చింది. శాంతి భద్రతల అంశాన్ని అందుకుంది. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితులు అధ్వాన్నంగా తయారయ్యాయని ఆరోపిస్తోంది. హైదరాబాద్లో డ్రగ్స్ ధందాకు అడ్డాగా మారిందని, అత్యాచారాలు, హత్యలు విచ్చలవిడిగా సాగుతున్నాయని విమర్శిస్తోంది.
అమిత్ షాతో భేటీకి..
ఈ విషయాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఆయన అపాయింట్మెంట్ కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి- ఈ మధ్యాహ్నం అమిత్ షాకు లేఖ రాశారు. అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై కూడిన వినతిపత్రాన్ని ఇస్తామని, దీనికోసం కొంత సమయాన్ని తమకు కేటాయించాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
YS Sharmila: చిన్నారి చైత్ర పేరంట్స్కు షర్మిల పరామర్శ (ఫోటోలు)
నిర్మల్లో సభ
విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని అమిత్ షా ఈ నెల 17వ తేదీన తెలంగాణకు రానున్న విషయం తెలిసిందే. భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకులు నిర్వహించ తలపెట్టిన తెలంగాణ విమోచన దినోత్సవం కార్యక్రమానికి అమిత్ షా హాజరు కానున్నారు. ఈ సందర్భంగా- వెయ్యిమంది తెలంగాణ విమోచన యోధులను ఉరి తీసిన నిర్మల్లోని వెయ్యి ఉరీల మర్రి వద్ద బీజేపీ రాష్ట్రశాఖ నాయకులు భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు.
17న ఆ సభకు ముఖ్య అతిథిగా అమిత్ షా
ఈ కార్యక్రమానికి అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరవుతారని పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడు బండి సంజయ్ ఇదవరకే వెల్లడించారు. ఇందులో పాల్గొనడానికి వచ్చిన సమయంలో తమకు అపాయింట్మెంట్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి అమిత్ షాను కోరారు. ఈ మేరకు ఆయనకు ఓ లేఖ రాశారు. రాష్ట్రంలో కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను తీసుకుంటోందని, ప్రజల అకాంక్షలకు భిన్నంగా పరిపాలన సాగిస్తోందని విమర్శించారు.
హైదరాబాద్ డ్రగ్స్ హబ్గా..
ప్రత్యేకించి- హైదరాబాద్ డ్రగ్స్ ధందాకు హబ్గా మారిందని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇష్టారాజ్యంగా డ్రగ్స్ అమ్మకాలు సాగుతున్నాయని ఆరోపించారు. హైదరాబాద్లో అన్ని రకాల డ్రగ్స్ అందుబాటులో ఉంటోన్నాయని మండిపడ్డారు. వందలాది మంది యువతీ యువకులు డ్రగ్స్కు బానిసగా మారిపోయారని రేవంత్ రెడ్డి ఈ లేఖలో ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్లో దారుణమైన నేరాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.
సామాజిక అశాంతికి..
హత్యలు, అత్యాచారాలు ఇష్టారాజ్యంగా సాగుతున్నాయని అన్నారు. ఇంతా జరుగుతున్నా ప్రభుత్వం పట్టింపు లేకుండా వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. ఈ పరిణామాలన్నీ తెలంగాణలో సామాజిక అస్థిరత్వానికి, అశాంతికి దారి తీస్తోందంటూ రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాలన్నింటినీ వివరిస్తూ వినతిపత్రాన్ని అందజేస్తామని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు. తమను కలవడానికి అనుమతి ఇవ్వాలని రేవంత్ రెడ్డి.. అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు.
నిర్మల్లో బహిరంగ సభ..
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని బీజేపీ నాయకులు ఈ నెల 17వ తేదీన నిర్మల్లో బహిరంగ సభను నిర్వహించ తలపెట్టిన విషయం తెలిసింది. దీనికి ముఖ్యఅతిథిగా హాజరు కావాలంటూ వారు అమిత్ షాకు విజ్ఙప్తి చేశారు. ఆయన వస్తారని పార్టీ నాయకులు చెబుతున్నారు. సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ విమోచన దినోత్సవంగా ప్రకటించాలనేది బీజేపీ రాష్ట్రశాఖ నాయకుల డిమాండ్. నాలుగు కోట్ల మంది తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం సాకారమైన రోజును అధికారికంగా నిర్వహించకపోవడం బాధాకరమని వారు చెబుతున్నారు.