Revanth Reddy: 12 మంది ఎమ్మెల్యేలకు షాకిచ్చిన రేవంత్ రెడ్డి.. ఈ ఆట మొదలైనట్టేనా..!
తెలంగాణ కాంగ్రెస్ వేగం పెంచింది. ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చారు. బీఆర్ఎస్ లోకి వెళ్లిన వెళ్లిన ఎమ్మెల్యేలతో ఫైట్ చేయాలని నిర్ణయించారు. పార్టీ మారిన ఈ 12 మందిపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
కాంట్రాక్టులు, డబ్బులు
పార్టీ మారిన ఎమ్మెల్యేలు కాంట్రాక్టులు, డబ్బులు అందుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరిపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే కొనుగోలు కేసుపై విచారణ జరుగుతున్న సందర్భంలో పార్టీ మారిని వీరిపై ఫిర్యాదు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఒక వేళ ఈ ఫిర్యాదుపై పోలీసులు విచారణ చేయకుంటే కోర్టు వెళ్లే యోచనలో ఉంది కాంగ్రెస్.
సీబీఐ
కాంగ్రెస్ ఫిర్యాదు ప్రకారం విచారణ చేస్తే సంచలన విషయాలు బయటకొచ్చే అవకాశం ఉన్నట్లు పలువురు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్యే కొనుగోలు కేసును సీబీఐకి అప్పగించారు. ఈ కేసును కూడా సీబీఐ విచారణ చేస్తే పరిస్థితి వేరేలా ఉంటుందని హస్తం నేతలు చెబుతున్నారు.
సబితా ఇంద్రా రెడ్డి
పార్టీ మారిన ఎమ్మెల్యేల్లో మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రా రెడ్డి ఉన్నారు. పార్టీ మారిన సబితా ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు, పాలేరు ఎమ్మెల్యే ఉపేందర్ రెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియా నాయక్, అసిఫాబాద్ ఎమ్మెల్యే అత్రం సక్కు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ రెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరారు.
పైలట్ రోహిత్ రెడ్డి
తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బాధితులుగా ఉన్నారు. ఈ కేసులో ఇప్పటికే రోహిత్ రెడ్డి ఈడీ విచారణను ఎదుర్కొన్నారు.