Revanth Reddy: రూ.2 లక్షల రైతు రుణమాఫీ, భూమి లేని రైతుకు రూ.15 వేలు..
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర జనగామ జిల్లా దేవరుప్పులలో కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా మహిళా రైతులతో ఆయన మాట్లాడారు. పొలంలోకి దిగి మహిళలతో కలిసి నాటేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ. 2లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. భూమి లేని రైతులకు రూ.15 వేలు, రూ.500 కే గ్యాస్ సిలిండర్, ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షలు ఇస్తామని చెప్పారు.

సీతారాముల ఆలయం
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని వారిని విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు భద్రాచలంలోని శ్రీ సీతారాముల ఆలయాన్ని రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. రాక్షస పాలన అంతం చేస్తామని, రాముడి పాలనే తన లక్ష్యమని ట్వీట్ చేశారు. శ్రీరామ చంద్రుడి ఆశీర్వాదంతో జన శంఖారావమై వస్తున్నానని తెలిపారు. "ఆ మట్టిలో కాలుమోపిన క్షణం నా మూలాలు గుర్తొచ్చాయి. ఢిల్లీకి రాజైనా తల్లికి బిడ్డే కదా... నేను ఈ మట్టి మనుషుల బిడ్డనే. ఈ మట్టి వాసనల మధ్య పెరిగిన తెలంగాణ బిడ్డనే. నికార్సైన రైతు బిడ్డనే. రైతు కష్టం తెలిసినోడినే... జై కిసాన్" అంటూ ట్వీట్ చేశారు.

101 కిలోమీటర్లు
రాష్ట్రంలోని అన్ని వర్గాలకు సేవలందించేందుకు సిద్ధంగా ఉన్నామని రేవంత్ చెప్పారు. గోదావరి వరద బాధితులకు ఇళ్లు కట్టిస్తామని కల్పిత హామీలు ఇచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ మోసం చేశారని రేవంత్ ఆరోపించారు. తన పర్యటనలో వరద బాధితులను పరామర్శించి తనవంతు సాయం అందించారు రేవంత్. కాగా రేవంత్ రెడ్డి పాదయాత్ర మంగళవారానికి 101 కిలోమీటర్లు పూర్తయింది. ఉమ్మడి ఖమ్మంలో జిల్లాలో రేవంత్ రెడ్డి ప్రజాధారణ కనిపించింది. ఆయన సభలకు జనలు భారీగా తరలొచ్చారు.

60 సీట్లు
మరోవైపు మంగళవారం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో దుమారం సృష్టిస్తుంది. వెంకట్ రెడ్డి బుధవారం కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్ రావు థాక్రేతో భేటీ అయ్యారు. నిన్న కోమటిరెడ్డి చేసిన కామెంట్స్ పై థాక్రే వివరణ తీసుకోనున్నట్టు సమాచారం. భవిష్యత్ లో బీఆర్ఎస్ కాంగ్రెస్ తో కలవక తప్పదని కోమటిరెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాదని చెప్పారు. ఏ పార్టీ కూడా 60 సీట్లు గెలవలేదని.. హంగ్ తప్పదని జోస్యం చెప్పారు. దీంతో కేసీఆర్ కాంగ్రెస్ తో కలవక తప్పదన్నారు.

అద్దంకి దయాకర్
వెంకట్ రెడ్డి వ్యాఖ్యలపై పీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం చేసేలా ఉన్నాయని తప్పుబట్టారు. వెంకట్ రెడ్డి వ్యాఖ్యలను పార్టీ హైకమాండ్ సీరియస్ గా తీసుకోవాలని కోరారు. వెంకట్ రెడ్డి వ్యాఖ్యలు పార్టీ కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బ తీసేలా ఉన్నాయని అన్నారు. అటు మాజీ ఎంపీ మల్లు రవి కూడా వెంకట్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఎన్నికల వేళ ఇలాంటి వ్యాఖ్యలు కార్యకర్తల మనోభావాలను దెబ్బతీస్తాయని చెప్పారు. పోత్తులు అవసరం లేదని.. కాంగ్రెస్ ఒంటరిగానే గెలుస్తుందని తెలిపారు.












Click it and Unblock the Notifications