ఒంటి కాలుతోనే 2 కి.మీ దూరంలోని పాఠశాలకు బాలిక: చలించిన కేటీఆర్, డాక్టర్ మెహతా సాయం
హైదరాబాద్: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సోసల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటారు. సాయం చేయాలని వచ్చే దాదాపు అన్ని అభ్యర్థనలకు స్పందిస్తూ.. వారి సమస్యకు పరిష్కారం చూపుతారు. తాజాగా, సోషల్ మీడియాలో ఓ అమ్మాయి ఒంటి కాలుతో నడుస్తూ ఇబ్బంది పడుతున్న వీడియో ఒకటి వైరల్ అయ్యింది. ఏఎన్ఐ పోస్టు చేసిన ఈ వీడియోపై కేటీఆర్ స్పందించారు.
Recommended Video
ఒంటికాలుతోనే పాఠశాలకు బాలిక: చలించిన కేటీఆర్
బీహార్ సివాన్ జిల్లాకు చెందిన ఓ బాలిక ఒకే కాలుతో రెండు కిలోమీటర్ల దూరంలోని పాఠశాలకు వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోను చూసిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చలించిపోయారు. ఏఎన్ఐ వార్తా సంస్థ ట్విటర్లో చేసిన పోస్ట్ను చూసి.... ఆ చిన్నారి వివరాలను పంపాలని కోరారు కేటీఆర్.
బాలిక వివరాలు చెబితే సాయం చేస్తానంటూ కేటీఆర్
తన వంతుగా సాయం చేస్తానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.'సివాన్ జిల్లాకు చెందిన ప్రియాన్షు కుమారి దివ్యాంగురాలు. డాక్టర్ కావాలనేది ఆమె కల. రెండు కిలో మీటర్ల దూరంలోని పాఠశాలకు... ప్రతిరోజూ ఒకే కాలుతో నడుస్తూ వెళ్తోంది. తన బాల్యం నుంచి ఇలాగే వెళ్లాల్సి వస్తోందని ప్రియాన్షు ఆవేదన వ్యక్తంచేసింది.ప్రభుత్వం తనకు కృతిమ కాలు అందించాలని వేడుకుంది.
కేటీఆర్ ట్వీట్కు స్పందించిన ఏఎన్ఐ ప్రతినిధి
కాగా, చిన్నారి సమస్యను ఏఎన్ఐ ట్వీట్ చేయగా... తన వంతుగా సాయం అందిస్తానని...వివరాలు అందించాలని కేటీఆర్ కోరారు. దీనికి ఏఎన్ఐ ప్రతినిధి స్పందిస్తూ.. ఆ బాలికకు సంబంధించిన వివరాలు అందిస్తామని తెలిపారు.
బాలికకు జైపూర్ ఫూట్ ఫిక్స్ చేస్తామంటూ డాక్టర్ సుధీర్ మెహతా
మరోవైపు, ఆ బాలికకు సాయం అందించేందుకు ముందుకు వచ్చారు డాక్టర్ సుధీర్ మెహతా. తాము బాలిక కుటుంబాన్ని సంప్రదించామని, పాట్నాలోని తమ కేంద్రానికి వస్తే జైపూర్ ఫూట్ అమర్చుతామని చెప్పారు. ఇందుకు అవసరమైన సాయం తాము అందిస్తామని చెప్పారు. రేపటిలోగా బాలిక ప్రియాన్షు కుమారికి జైపూర్ ఫూట్ అమర్చుతామని, ఆమె ఆ తర్వాత నుంచి పరుగెత్తుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.