హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు-మెట్రో స్పెషల్ సర్వీసులు : గణేష్ నిమజ్జనం-మళ్లింపులు ఇలా..!!
గణేష్ నిమజ్జనోత్సవానికి భాగ్యనగరం సిద్దం అవుతోంది. ప్రతీ ఏటా పండుగలా జరిగే ఈ ఉత్సవం ఈ సారి సైతం కోలాహలంగా నిర్వహించేందుకు నిర్వాహకులు..ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. నగరానికి చెందిన మంత్రి తలసాని అటు పోలీలు..ఇటు జీహెచ్ఎంసీ అధికారులతో నిమజ్జన ఏర్పాట్ల పైన సమీక్షలు చేస్తున్నారు. సాధారణ ప్రజలకు ఇబ్బంది లేకుండా తీసుకోవాల్సిన చర్యల పైన సూచనలు చేస్తున్నారు. ముందుగానే ట్రాఫిక్ ఆంక్షల గురించి ప్రజలకు సమాచారం ఇవ్వాలని ఆదేశించారు. బాలాపూర్ నుంచి ట్యాంక్ బండ్ వరకు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
మెట్రో రైలం..ఎంఎంటీఎస్ సేవలు
సుమారు 19 వేల మంది వివిధ స్థాయిలలో పోలీసు సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. నిమజ్జన ప్రాంతాల్లో ప్రతి క్రేన్ వద్ద ఒక పోలీసు అధికారిని నియమించడంతో పాటు ప్రతి విగ్రహం వెంట నిమజ్జన యాత్రలో ఒక పోలీసు అధికారి ఉంటారు. నిమజ్జనం దృష్ట్యా వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ను మళ్లించనున్నారు. సిటీ బస్సులు నిలిపి వేస్తుండటంతో ఎంఎంటీస్ -మెట్రో సర్వీసుల సంఖ్య పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా..ట్యాంక్బండ్కు తరలి వచ్చే భక్తుల రద్దీ దృష్ట్యా లింగంపల్లి- సికింద్రాబాద్, ఫలక్నుమా-సికింద్రాబాద్, లింగంపల్లి-నాంపల్లి రూట్లో ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లను నడుపనున్నారు.
ప్రతీ మూడు నిమిషాలకు ఒక రైలు
ఆదివారం రాత్రి 11 గంటల వరకు ప్రతి 3 నిమిషాలకు ఒకటి చొప్పున మెట్రో రైళ్లను అన్ని రూట్లలో నడుపనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇక, నిమజ్జనం రూట్లలో కాకుండా ఇతర మార్గాల ద్వారా ప్రయాణీకులను చేర వేసేందుకు ప్రత్యేక బస్సులను నడపనున్నారు. అందులో భాగంగా.. ఆదివారం ఉదయం నుంచి నిమజ్జన వేడుకలు పూర్తయ్యే వరకు 565 ప్రత్యేక బస్సులను నడిపేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. బషీరాబాగ్ - కాచిగూడ, బషీర్బాగ్-రాంనగర్, ఓల్డ్ ఎమ్మెల్యేక్వార్టర్స్-దిల్సుఖ్నగనర్, ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్-ఎల్బీనగర్, ఓల్డ్ ఎమ్మెల్యేక్వార్టర్స్ - వనస్థలిపురం, మిధాని రూట్లలో బస్సులు రాకపోకలు సాగించనున్నాయి.
ప్రత్యేక బస్సులు ఎంపిక చేసిన మార్గాల్లో
అదే విధంగా.. ఉప్పల్- ఇందిరాపార్కు, మల్కాజిగిరి-ఇందిరాపార్కు, ఇందిరాపార్కు నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, జామై ఉస్మానియా వరకు నడవనున్నాయి. లక్డీకాపూల్ నుంచి టోలీచౌకి,ఖైరతాబాద్ నుంచి బీహెచ్ఈఎల్వరకు, లకిడికాఫూల్ నుంచి కొండాపూర్, యూసుఫ్గూడ, రాజేంద్రనగర్ రూట్లలో ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయి. వీటితో పాటుగా..ఆల్ఇండియా రేడియో నుంచి కోఠీ, ఖైరతాబాద్ నుంచి జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, కూకట్పల్లి,బోరబండ, బాచుపల్లి,లింగంపల్లి, పటాన్చెరు. తదితర ప్రాంతాలకు బస్సులు రాకపోకలు సాగించనున్నాయి. ఇక, నిమజ్జన మార్గాల్లో మళ్లింపు.. నిలిపివేత దిశగా అధికారులు నిర్ణయం తీసుకున్నారు.
ట్రాఫిక్ నిబంధనలతో రోడ్లు క్లోజ్
అందులో భాగంగా..పాతబస్తీ నుంచి హుస్సేన్సాగర్ వరకు కొనసాగనున్న నిమజ్జన శోభాయాత్ర దృష్ట్యా పాతబస్తీ మీదుగా రాకపోకలు సాగించే బస్సులను అఫ్జల్గంజ్ వరకే పరిమితం చేస్తారు. సికింద్రాబాద్ నుంచి ట్యాంక్బండ్ మీదుగా వెళ్లే బస్సులు ఇందిరాపార్కు వరకు పరిమితమవుతాయి. ఉప్పల్ నుంచి మెహదీపట్నం వైపు వెళ్లే బస్సులు కూడా ఇందిరాపార్కుకే పరిమితమవుతాయి. ప్రత్యేక బస్సులన్నింటికీ 'గణేశ్ నిమజ్జనం స్పెషల్' అనే డెస్టినేషన్ బోర్డులను ఏర్పాటు చేస్తారు. అర్ధరాత్రి తరువాత కూడా ఈ బస్సులు తిరుగుతాయి. కోర్టు ఆదేశాలతో ఈ సారి అధికారులు ప్రత్యేక చర్యలు ప్రారంభించారు.
ఫైర్..గజ ఈతగాళ్లు రెడీ
హుస్సేన్సాగర్లోని విగ్రహాలు, పూజాసామాగ్రి తదితర వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించడంతోపాటు జీహెచ్ఎంసీ పారిశుధ్యవిభాగంతో సమన్వయంతో తరలిస్తుంది. ఈ పనుల కోసం వెయ్యిమంది సిబ్బంది విధుల్లో ఉంటారు. 01 ప్రాంతాల్లో తాగునీటి సదుపాయానికి జలమండలి ఏర్పాట్లు చేపట్టింది. గణేశ్ శోభాయాత్ర మార్గంలో 38 ఫైర్ వాహనాలు ఉంచుతారు. సరూర్నగర్, కాప్రా, ప్రగతినగర్ చెరువుల వద్ద బోట్లు అందుబాటులో ఉన్నాయి.
గ్రేటర్...పోలీసు సిబ్బంది సిద్దం
టూరిజం శాఖ ఆధ్వర్యంలో హుస్సేన్సాగర్ ట్యాంక్బండ్ వైపు 3 బోట్లు, నెక్లెస్రోడ్ వైపు 2 బోట్లు అందుబాటులో. వీటితోపాటు 4 స్పీడ్బోట్లు. 10 మంది గజ ఈతగాళ్లు అందుబాటులో ఉంటారు. విద్యుత్ విభాగం ఆధ్వర్యంలో హుస్సేన్సాగర్ చుట్లూ 48 ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు. సరూర్నగర్ చెరువు వద్ద 5 ట్రాన్స్ఫార్మర్లు. వీటితో సహా వివిధ ప్రాంతాల్లో మొత్తం 101 ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు చేసారు. జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు రూ. 1.52 కోట్లతో 41284 తాత్కాలిక లైటింగ్ ఏర్పాట్లు పూర్తయ్యాయి.