సింగరేణి బొగ్గు గని ప్రమాదంలో విషాదం.. ముగ్గురు మృతి
పెద్దపల్లి జిల్లా రామగుండం డివిజన్లోని సింగరేణి అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టులో బొగ్గు గని పైకప్పు కూలిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. బొగ్గుగని పై కప్పు కూలిన ఘటనలో శిథిలాల కింద చిక్కుకున్న ముగ్గురు మృతదేహాలను రెస్క్యూ టీం ఈ రోజు బయటకు తీసింది. మూడు రోజుల క్రితం చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ ఎట్టకేలకు ముగిసింది. కానీ బొగ్గు గనుల పైకప్పు కూలిన ప్రమాదంలో ముగ్గురు విగతజీవులుగా బయటకు రావడం సింగరేణి కార్మిక లోకానికి విషాదంగా మిగిలింది. మూడు రోజుల పాటు రెస్క్యూ టీమ్ తీవ్రంగా ప్రయత్నం చేసినా వారిని ప్రాణాలతో కాపాడలేకపోయింది.
సింగరేణి బొగ్గు గని ప్రమాదంలో అసిస్టెంట్ మేనేజర్ తేజ, సేఫ్టీ ఆఫీసర్ అడ్రస్ జయరాజ్, కార్మికులు శ్రీకాంత్ మృతి చెందినట్లుగా అధికారులు వెల్లడించారు. ఈరోజు ముగ్గురు మృతదేహాలను రెస్క్యూ టీం బయటకు తీసింది. ఈ ప్రమాదంలో చిక్కుకున్న ఏడుగురిలో నలుగురు క్షేమంగా ఉన్నట్లు గా సమాచారం. బొగ్గు గని శిధిలాలలో చిక్కుకున్న ముగ్గురిని కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవటంతో అధికారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టులో బొగ్గుగని 86వ లెవెల్ వద్ద రూఫ్ బోల్ట్ పనులు చేస్తుండగా పైకప్పు కూలిన ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాద ఘటనలో ముగ్గురిని సోమవారమే బయటకు తీసుకు రాగా, మరొకరిని మంగళవారం రెస్క్యూ టీం కాపాడింది. ఈ రోజు ఉదయం మిగతా ముగ్గురిని బయటకు తీశారు. మిగతా ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో వారి కుటుంబ సభ్యులు, కార్మికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఇప్పటికే బొగ్గుగని ప్రమాద ఘటనపై సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి, బాధిత కార్మిక కుటుంబాలకు అండగా ఉండాలని సూచించగా, టీపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అధికారుల నిర్లక్ష్యం వల్లే బొగ్గుగని పైకప్పు కూలింది ఘటన చోటు చేసుకుందని, ఈ ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే సురక్షితంగా తిరిగి వస్తారు అనుకున్న తమ వారు విగతజీవులుగా రావడంతో బాధిత కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా రోదిస్తున్నారు.