తెలంగాణాలో పోడు పోరు .. అటవీ అధికారులను చెట్టుకు కట్టేసి కొట్టిన గిరిజనులు
తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ పోడు భూములు పోరాటం కొనసాగుతోంది. తాము పోడు చేసుకుంటున్న భూములకు అటవీ అధికారులు ఎలా వస్తారంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గిరిజనులు అటవీ అధికారులపై దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది.
షాకింగ్ : కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నా వరంగల్ జిల్లాలో ఏకంగా ఏడుగురికి కరోనా పాజిటివ్ !!
బీట్ కానిస్టేబుల్స్ ను చెట్టుకు కట్టేసి కొట్టిన గిరిజనులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం చింతగుప్ప గ్రామంలో అటవీ అధికారులపై గ్రామస్తులు దాడి చేశారు. తాము ఎంతో కాలంగా పోడు చేసుకుంటున్న భూమిలోకి అటవీ అధికారులు ఎలా వస్తారంటూ దాడికి దిగారు .దుమ్ముగూడెం మండలం చింతగుప్ప గ్రామంలో అటవీ భూముల్లోకి వచ్చిన బీట్ కానిస్టేబుల్స్ ను చెట్టుకు కట్టేసి గిరిజనులు దాడి చేశారు. అధికారుల ఆదేశాల మేరకు అటవీ ప్రాంతంలో ఫెన్సింగ్ చేయడానికి వెళ్లిన బీట్ కానిస్టేబుల్స్ ను అక్కడ ఉన్న గిరిజనులు అడ్డుకున్నారు.
పోడు భూములలో కందకాలు తీసేందుకు ప్రయత్నం చేసిన బీట్ కానిస్టేబుల్స్ పై దాడి
పోడు భూములలో కందకాలు తీసేందుకు ప్రయత్నించిన క్రమంలో వారితో గిరిజనులు గొడవకు దిగారు. తాము పోడు చేసుకుంటున్న భూముల్లో ఫెన్సింగ్ ఏర్పాటు చేయవద్దని వారిపై మండిపడ్డారు. తమ భూములు తమకు కాకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని, తాము ఒప్పుకునేది లేదని హెచ్చరించారు. అటవీ అధికారులతో గొడవకు దిగిన గ్రామస్తులు వారిని చెట్టుకు కట్టేసి కర్రలతో కొట్టారు. ఇంకోసారి తమ భూముల వైపు వస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
గిరిజనులపై పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన అటవీ సిబ్బంది
ముగ్గురు అటవీ సిబ్బందిని చెట్టుకు కట్టేసి కొట్టిన గిరిజనులు కాసేపు వారిని నిర్బంధించి అనంతరం వారిని వదిలి వేశారు. దీంతో తమపై దాడికి దిగిన గిరిజన గ్రామస్తులపై ఫారెస్ట్ శాఖకు సంబంధించిన బీట్ కానిస్టేబుళ్ళు దుమ్ముగూడెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇప్పటికే పలుచోట్ల ఫారెస్ట్ అధికారులు అటవీ భూముల్లో ఫెన్సింగ్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో వారిని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అడ్డుకుంటున్న పరిస్థితి ఉంది.
అటవీ సిబ్బందికి ఆయుధాలు ఇవ్వటానికి సుప్రీం గ్రీన్ సిగ్నల్ .. ఇకపై ఆయుధాలతో అటవీ సిబ్బంది
ఇదిలా ఉంటే అడవుల సంరక్షణ కోసం అటవీ సేనకు ఆయుధాలు ఇవ్వాలని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది.జంగిల్ బచావో జంగిల్ బడావో నినాదంతో అడవులను రక్షించాలని నిర్ణయించిన క్రమంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం సైతం అటవీ భూములను సంరక్షించడానికి, నరికివేతకు గురికాకుండా అడవులను కాపాడడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో అటవీ అధికారులు అడవుల కాపాడేందుకు రంగంలోకి దిగుతున్నారు. ఇక వీరికి గిరిజనుల అడ్డగింత తో రక్షణ లేని కారణంగా ఆయుధాలను ఇవ్వాలని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో అటవీ సేన ఇకనుండి ఆయుధాలతో రంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తోంది.
తెలంగాణాలో పోడు పోరు .. అటవీ అధికారులను చెట్టుకు కట్టేసి కొట్టిన గిరిజనులు #forestofficials #Tribes #Constables pic.twitter.com/Od9KjBqPP4
— oneindiatelugu (@oneindiatelugu) April 12, 2021