మాకు తెలియదా: కోదండ హెచ్చరిక, 'జగన్, బాబు కుట్ర మాటేమిటి'
హైదరాబాద్: తన పైన విమర్శలు చేస్తున్న తెరాస నేతలకు తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత మనం ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయడం లేదని వ్యాఖ్యానించారు.
20 ఏల్లు తెలంగాణ కోసం కొట్లాడిన తమకు తెలంగాణను ఎలా అభివృద్ధి చేయాలో తెలియదా అని ప్రశ్నించారు. తెలంగాణ అవసరాలు ఏమిటో, తెలంగాణలో ఉన్న వనరులు ఏమిటో, తెలంగాణలో ఏ పనులు చేపడితే అభివృద్ధి ప్రజలకు చేరుతుందో తమకు తెలుసన్నారు.
ప్రభుత్వం చేపట్టనున్న కార్యక్రమాలను ఇంకో మూడేళ్లు చూద్దామని ఆయన ప్రజలకు సూచించారు. అప్పటికికూడా అభివృద్ధి పనులు సరైన దిశలో సాగకపోతే ఏం చేయాలో తమకు తెలుసని వ్యాఖ్యానించారు. తద్వారా ఎన్నికలలో తెరాసకు ప్రజలు బుద్ధి చెబుతారని అభిప్రాయపడ్డారు.

తమకు దురాశ లేదన్నారు. సగటు తెలంగాణ పౌరుడు అభివృద్ధి చెందితే తమకు అదే చాలన్నారు. దాని కోసమే తాము ఇన్నాళ్లూ కష్టపడ్డామని చెప్పారు. అది సిద్ధించకపోతే సంఘటితమయ్యేందుకు తాము సిధ్దంగా ఉన్నామని హెచ్చరించారు.
చంద్రబాబు, జగన్ కుట్రలపై కోదండ మాట్లాడాలి: నిరంజన్ రెడ్డి
కోదండరాం పైన తెలంగాణ ప్రణాళికా సంఘం చైర్మన్ నిరంజన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు, జగన్ కుట్రలపై కోదండరాం గొంతు విప్పాలన్నారు. తెలంగాణ పాలన రెండేళ్లు గడవక ముందే కోదండరాం అసహనం ప్రదర్శించడం మంచిది కాదన్నారు. అసలు కోదండరాం అంత అసహనంతో ఎందుకున్నారో తమకు అర్థంకావట్లేదన్నారు.
జేఏసీ ఏర్పాటు చేసింది కోదండరామేనా అంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ ప్రశ్నించారు. అసలు జేఏసీకి కోదండరాంకు సంబంధమే లేదని ఆయన అభిప్రాయపడ్డారు. జేఏసీని కేసీఆరే ఏర్పాటు చేశారన్నారు. తెలంగాణను బాగు చేసేందుకు పదేళ్లు పడుతుందని కోదండరాం ఆనాడు అన్న విషయాన్ని ఆయన మరోసారి గుర్తు చేశారు. ఇంతలోనే కోదండరాం విమర్శలు చేయడం సరికాదన్నారు.












Click it and Unblock the Notifications