దేశాన్ని పాలించేది ఇలాగేనా: కేసీఆర్ ఆన్ ఫైర్: రాష్ట్రపతి ప్రసంగం బాయ్కాట్
హైదరాబాద్: టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై కయ్యానికి కాలుదువ్వారు. సమరానికి సై అన్నారు. వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొననున్న ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్.. కమలాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. ఆ పార్టీని ఇప్పటి నుంచే ఎండగట్టే ప్రయత్నాలకు దిగారు. కేంద్ర ప్రభుత్వం తీరును దేశం మొత్తానికీ తెలియజేసేలా సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి రోజు నుంచే..
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల తొలి రోజు నుంచే గులాబీ బాస్.. యాక్షన్ మోడ్లోకి దిగినట్టు కనిపిస్తోంది. బడ్జెట్ సమావేశాలను పురస్కరించుకుని తొలి రోజు పార్లమెంట్ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసే ప్రసంగాన్ని బాయ్కాట్ చేయాలని నిర్ణయించుకున్నారు. దీనిద్వారా- తెలంగాణ పట్ల మోడీ ప్రభుత్వం అనుసరిస్తోన్నట్లుగా భావిస్తోన్న వ్యతిరేక వైఖరి, ద్వంద్వ నీతిని దేశం మొత్తానికీ తెలిసేలా చేసినట్టవుతుందనేది ఆయన ఉద్దేశం.
ప్ర్రతి అంశంపైనా కేంద్రాన్ని నిలదీసేలా..
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా టీఆర్ఎస్ ప్రతి అంశంపైనా బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీసేలా వ్యవహరించనుంది. బడ్జెట్ కేటాయింపులు మొదలుకుని- ధాన్యం కొనుగోళ్లు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఐఎఎస్, ఐపీఎస్ వంటి కేంద్ర సర్వీసుల నిబంధనల్లో సవరణలు చేయడం, రాష్ట్రాల హక్కులను కాలరాసేలా వ్యవహరించడం, వేల కోట్ల రూపాయల మేర ఉన్న జీఎస్టీ బకాయిల విడుదలలో జాప్యం, నీతి ఆయోగ్ సిఫారసు చేసినా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు నిధులను మంజూరు చేయకపోవడం వంటి అంశాలన్నింటిపైనా పోరాడనుంది.
ప్రజాస్వామ్య దేశాన్ని పాలించేది ఇలాగేనా?.
పార్లమెంటరీ పార్టీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో కేసీఆర్- ఆయా అంశాలన్నింటినీ ప్రస్తావించారు. లోక్సభ, రాజ్యసభ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని పరిపాలించడం బీజేపీ నాయకులకు తెలియట్లేదని విమర్శించారు. బడ్జెట్లో రాష్ట్రానికి ఎలాంటి కేటాయింపులు ఉండట్లేదని, ఎన్డీఏ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ ఇదే పరిస్థితి తలెత్తుతోందని గుర్తు చేశారు.ఇలాంటి కేంద్రప్రభుత్వం ఉండటం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
ఎన్నో డిమాండ్లు..
రాష్ట్రంలో భారీ నీటి ప్రాజెక్టుకు జాతీయ హోదాను ఇవ్వాలని కోరుతున్నా కేంద్రం పట్టించుకోవట్లేదని, ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూల్ 9,10లోని ప్రభుత్వ సంస్థల విభజన ఇంకా పూర్తి కావాల్సి ఉందని అన్నారు. వీటిని ఇంకెప్పుడు నెరవేరుస్తుందని కేసీఆర్ ప్రశ్నించారు. శాసనసభ స్థానాల పునర్విభజన ప్రక్రియ, వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఏటా ఇవ్వాల్సిన నిధులు.. పెండింగ్లోనే ఉన్నాయని అన్నారు. కేంద్రం వైఖరి దేశం మొత్తానకీ తెలియజేసేలా పార్లమెంటు లోపలా.. బయటా గట్టిగా పోరాడాలని ఆయన పార్టీ ఎంపీలకు సూచించారు.
Recommended Video
ఆరు గంటల పాటు
సుమారు ఆరు గంటల పాటు పార్లమెంటరీ పార్టీ భేటీ సాగింది. బీజేపీని ఇక ఎంతమాత్రం ఉపేక్షించాల్సిన అవసరం లేదని స్పష్టం కేసీఆర్ స్పష్టం చేశారు. సభలో నిర్వహించే ధర్నాలతో పార్లమెంట్ స్తంభించిపోవాలని సూచించారు. భావసారూప్యం గల ఇతర పార్టీలను కూడా కలుపుకెళ్లాలని పేర్కొన్నారు.
తమ పోరాటానికి మద్దతు ఇవ్వడానికి పలు పార్టీలు సంసిద్ధతను వ్యక్తం చేశాయని చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో కేంద్రంతో రాజీపడే ప్రసక్తే ఉండబోదని తేల్చి చెప్పారు. కేంద్రానికి వ్యతిరేకంగా చేసే ప్రతి పోరాటం కూడా- కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇప్పటిదాకా చేసిందేమీ లేదనే విషయాన్ని అన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు తెలియజేసేలా ఉండాలని అన్నారు.