విద్యార్థి లోకం-కోదండరాం: అందుకే కేసీఆర్ భయం?, యాత్రను అడ్డుకోవడం వెనుక..
కోదండరాం పట్ల విద్యార్థుల్లో సదాభిప్రాయం నాటుకుపోయింది. ఆయన సమావేశాలకు వచ్చేవాళ్లలో విద్యార్థులే ఎక్కువ భాగం. ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో ప్రభుత్వ అసమర్థతపై తీవ్ర అసంతృప్తితో ఉన్న విద్యార్థులు సహజంగాన
హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్కు సమవుజ్జీగా నిలబడే నాయకుడు దరిదాపుల్లో లేడని టీఆర్ఎస్ గర్వంగా చెప్పుకోవడం చాలాసార్లు విన్నదే. అధికార పార్టీని ఎదుర్కోవడంలో టీడీపీ, కాంగ్రెస్, బీజేపీలు విఫలమవుతున్న తీరు చూస్తే ఇది నిజమే అనిపించకమానదు.
రాజకీయ పార్టీలతో వచ్చిన ముప్పేమి లేదని చెబుతున్న ఆ పార్టీ.. ఒక్క కోదండరాం విషయంలో మాత్రం అభద్రతా భావానికి లోనవుతున్నట్లు కనిపిస్తోంది. అందుకే అడుగడుగునా ఆయనను కట్టడి చేసే ప్రయత్నం చేస్తోంది.
అటు మీడియా కూడా కోదండరాం కార్యాచరణకు పెద్దగా ఫోకస్ కల్పించకపోవడంతో కేసీఆర్ సర్కార్ ను ఎదుర్కోవడం కోదండరాంకు శక్తికి మించిన పనే అవుతోంది.

ఎందుకంత భయం:
కోదండరాం పట్ల విద్యార్థుల్లో సదాభిప్రాయం నాటుకుపోయింది. ఆయన సమావేశాలకు వచ్చేవాళ్లలో విద్యార్థులే ఎక్కువ భాగం. ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో ప్రభుత్వ అసమర్థతపై తీవ్ర అసంతృప్తితో ఉన్న విద్యార్థులు సహజంగానే కోదండరాం వైపు మళ్లారు. తెలంగాణ ఉద్యమాన్ని తమ భుజాలపై నడిపించిన విద్యార్థులు.. ఇప్పుడు కోదండరాంతో కలిస్తే ఏం జరుగుతుందోనన్న భయం టీఆర్ఎస్ ను వెంటాడుతున్నట్లు తెలుస్తోంది.

విద్యార్థుల్లో వ్యతిరేకత:
డీఎస్సీ నోటిఫికేషన్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం అత్యంత దారుణంగా విఫలమైంది. ఏళ్లు గడుస్తున్నా.. ఇదిగో.. అదిగో.. అంటూ తాత్సారం చేసిందే తప్ప చిత్తశుద్దితో వ్యవహరిస్తున్నట్లు కనిపించడం లేదు. ఇప్పటికీ అదే తంతు కొనసాగుతోంది. పైగా.. మొన్నీమధ్య మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. డీఎస్సీ రాకపోతే ప్రపంచం మునిగిపోతదా?.. అంటూ చేసిన వ్యాఖ్యలు విద్యార్థులకు మరింత మంట పుట్టించాయి.
ఉద్యోగాల కోసం తాము పడుతున్న కష్టాలను అంత చులకనగా తీసిపారేయడం వారికి మింగుడుపడటం లేదు. ఈ పరిణామాలతో ప్రభుత్వంపై తిరగబడుతున్న కోదండరాంకు విద్యార్థులు మద్దతుగా నిలుస్తున్నట్లు కనిపిస్తోంది.

ఎక్కడ మరింత దగ్గరవుతాడోననే?:
వరంగల్ లో అమరుల స్ఫూర్తి యాత్రను అడ్డుకోవడం మానవ హక్కుల ఉల్లంఘనే అంటున్నారు కోదండరాం. యాత్ర గురించి ముందుగానే హోంమంత్రిని కలిసి మరీ ఆయన అనుమతి కోరారు. అయినప్పటికీ శాంతిభద్రతల పేరుతో యాత్రను పోలీసులు అణచివేశారు.
కాగా, ఇప్పటివరకు కోదండరాం ఆరు దశల్లో అమర వీరుల స్పూర్తి యాత్రను చేపట్టారు. ఆ యాత్రల్లో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. మరి వరంగల్ యాత్రను మాత్రం శాంతిభద్రతల పేరు చెప్పి ఎందుకు అడ్డుకున్నారన్నది ప్రభుత్వానికే తెలియాలి. కోదండరాంను ఇలాగే వదిలిపెడితే.. ప్రజలకు మరింత దగ్గరయ్యే అవకాశం ఉన్నందునే ప్రభుత్వం ఇక ఆయన పట్ల కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు అర్థమవుతోంది.

వ్యతిరేకత బయటపడవద్దని:
కోదండరాం యాత్రలకు అనుమతులిస్తే ప్రభుత్వం పట్ల జనంలో వ్యతిరేకత పెరిగే అవకాశం ఉందని టీఆర్ఎస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల నాటికి అది కాస్త ముదిరితే పార్టీకి ప్రతికూలంగా మారే అవకాశం ఉండటంతో.. ఇప్పటి నుంచే కోదండరాం కదలికలను నియంత్రించాలని ఆ పార్టీ ఆలోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.












Click it and Unblock the Notifications