టిట్ ఫర్ టాట్.. TRSకి BJP షాక్.. MP నామాకు చెందిన మధుకాన్ ఆస్తుల జప్తు
రాంచీ ఎక్స్ ప్రెస్ హైవే కేసుకు సంబంధించి TRS ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన మధుకాన్ గ్రూప్ కంపెనీల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. రాంచీ-జంషెడ్ పూర్ రహదారి పేరుతో మధుకాన్ గ్రూప్ బ్యాంకుల నుంచి రూ.10.30 కోట్ల రుణం తీసుకుంది. అయితే ఈ రుణాన్ని దారిమళ్లించినట్లు ED అభియోగం మోపింది. ప్రత్యేకంగా 6 డొల్ల కంపెనీలను ఏర్పాటు చేయడంద్వారా ఈ నిధులను మళ్లించివుంటారని ED అధికారులు గుర్తించారు. నామా నాగేశ్వరరావు, నామా సీతయ్య అధీనంలో ఈ కంపెనీలున్నాయని అధికారులు తెలిపారు. మొత్తం రూ.96.21 కోట్ల విలువైన మధుకాన్ ఆస్తులను ED జప్తు చేసింది. విశాఖపట్నం, ప్రకాశం, బెంగాల్, హైదరాబాద్, కృష్ణా జిల్లాల్లోని రూ.88.85 కోట్ల విలువైన భూములు, మధుకాన్ షేర్లు, ఇతర చరాస్తులు కలిపి మరో రూ.7.36 కోట్ల విలువైనవి జప్తు చేశారు.
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరగడానికి రెండురోజుల ముందే బీజేపీకి చెందిన నలుగురు కార్పొరేటర్లను తెలంగాణ రాష్ట్ర సమితిలో చేర్చుకొని ఆ పార్టీకి టీఆర్ఎస్ షాకిచ్చింది. అవసరమైతే తాము ఎమ్మెల్యేలనే చేర్చుకోగలమంటూ బీజేపీ సవాల్ చేసింది. రాజకీయంగా ఇదిలా ఉండగా జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగే రోజే టీఆర్ ఎస్ ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావుకు చెందిన మధుకాన్ గ్రూప్ నకు చెందిన దాదాపు 97 కోట్లరూపాయల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేసింది. ఒకరకంగా బీజేపీ టీఆర్ఎస్కు ఇలా షాకిచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈ రెండు పార్టీలు తెలంగాణలో ఈసారి అధికారం సాధించేందుకు ఢీ అంటే ఢీ అంటున్నాయి. అందులో భాగంగానే జాతీయ కార్యవర్గ సమావేశాలను బీజేపీ ఈసారి హైదరాబాద్లో జరుపుతోంది. రాష్ట్రమంతటా బీజేపీ గాలివీచేలా ఈ సమావేశాలు దోహదపడతాయని మోడీ, అమిత్ షా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కార్పొరేటర్లను చేర్చుకోవడం, ఎంపీ ఆస్తులను జప్తుచేయడం లాంటివన్నీ సహజంగానే జరుగుతుంటాయని, రాజకీయాల్లో ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు ఇటువంటి వ్యూహాలు సర్వసాధారణమని విశ్లేషకులు అంటున్నారు.