టీఆర్ఎస్ నాయకుడి దారుణ హత్య.. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఆస్పత్రిలో మృతి..
నిజామాబాద్ జిల్లా నవీపేటలో టీఆర్ఎస్ నాయకుడు కొంచ రమణారెడ్డి దారుణ హత్యకు గురయ్యాడు. శుక్రవారం ఉదయం 10.30గం. ప్రాంతంలో రమణారెడ్డి తన ఇంటి ఆవణలో ఫోన్ మాట్లాడుతుండగా.. దుండగులు మారణాయుధాలతో అతనిపై దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ రమణారెడ్డిని పోలీసులు ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఘటనకు సంబంధించి ప్రత్యక్ష సాక్షులు పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
అసలేం జరిగింది..
రమణారెడ్డి ఇంటి ఆవరణలో ఫోన్ మాట్లాడుతుండగా.. గుర్తు తెలియని వ్యక్తులు గేటు తీసుకుని లోపలికి వచ్చారు. గొడ్డలితో ఒక్కసారిగా అతనిపై దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ అతను అక్కడే కుప్పకూలాడు. కాసేపటికి బయట నుంచి తిరిగొచ్చిన రెండో కుమార్తె భర్తను రక్తపు మడుగులో చూసి షాక్ తిన్నది. బోరున విలపించడంతో చుట్టుపక్కలవారు గుమిగూడారు.
ఆస్పత్రిలో మృతి..
స్థానికులు పోలీసులకు సమాచారం ఇశ్వడంతో నిజామాబాద్ ఏసీపీ శ్రీనివాస్కుమార్, ట్రైనీ ఐపీఎస్(నవీపేట ఎస్హెచ్వో) కిరణ్ ప్రభాకర్ ఘటన స్థలానికి చేరుకున్నారు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న రమణారెడ్డిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు కీలక ఆధారాలు సేకరించారు. రమణారెడ్డి ఇంటి ఆవరణలోనే పడేసిన గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. రమణారెడ్డిని హత్య చేసిన హంతకులు ప్రహరీ గోడ దూకి పారిపోయారని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. నిందితులను పట్టుకునేందుకు క్లూస్ టీమ్,డాగ్ స్క్వాడ్ను రంగంలోకి దింపారు.
అవే కారణమా..
రమణారెడ్డి స్వస్థలం కమలాపూర్. కానీ పదేళ్ల క్రితం నవీపేటలో ఇళ్లు కట్టుకుని అక్కడే ఉంటున్నాడు. అతనికి భార్య ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే భర్త తనను అనుమానిస్తున్నాడన్న కారణంతో ఎనిమిదేళ్ల క్రితం నుంచే భార్య అతనికి దూరంగా ఉంటోంది. పిల్లలు కూడా ఆమె వద్దే ఉంటున్నారు. ఈ క్రమంలో భార్యాభర్తలు విడాకుల కోసం కోర్టును కూడా ఆశ్రయించారు. అదే సమయంలో కొన్నాళ్లుగా ఆస్తి గొడవలు కూడా జరుగుతున్నాయి. రమణారెడ్డి హత్యకు ఇవేమైనా దారితీశాయా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.