టీఆర్ఎస్కు షాక్: ప్రియాంక సమక్షంలో కాంగ్రెస్లో చేరిన నల్లాల ఓదెలు దంపతులు, సుమన్ ఎఫెక్ట్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు చాలా కాలం ఉన్నప్పటికీ రాజకీయ సందడి ఇప్పటికే మొదలైంది. జాతీయ పార్టీల కీలక నేతల వరుస పర్యటనలతో రాజకీయం మరింత వేడెక్కింది. దీంతో రాజకీయ పార్టీల నేతలు ఇతర పార్టీల్లోకి వలస వెళ్ళేందుకు సిద్ధమవుతున్నారు. తాజాగా, అధికార పార్టీకి చెందిన ఓ నేత ప్రతిపక్ష పార్టీలో చేరేందుకు సిద్ధమైనట్లు తెలిసింది.
టీఆర్ఎస్ పార్టీకి నల్లాల ఓదెలు దంపతులు గుడ్బై
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాయకుడు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు టీఆర్ఎస్ పార్టీకి గుడ్బై చెప్పారు. గురువారం మధ్యాహ్నం నల్లాల ఓదెలు దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఢిల్లీకి వెళ్లిన నల్లాల ఓదెలు దంపతులు.. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు.
ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్లోకి నల్లాల ఓదెలు దంపతులు
ఆ తర్వాత ఓదెలు దంపతులకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. 2009, 2014 ఎన్నికల్లో నల్లాల ఓదెలు టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. తెలంగాణ ఉద్య మ సమయంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి 2010లో జరిగిన ఉప ఎన్నికలోనూ ఆయన గెలుపొందారు.
మంచిర్యాల జడ్పీ చైర్ పర్సన్గా కొనసాగుతున్న నల్లాల భాగ్యలక్ష్మి
2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందిన నల్లాల ఓదెలు.. ప్రభుత్వ విప్గానూ పనిచేశారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో నల్లాల ఓదెలుకు చెన్నూరు అసెంబ్లీ నుంచి పోటీ చేసేందుకు టీఆర్ఎస్ నుంచి టికెట్ రాలేదు. ప్రస్తుతం నల్లాల ఓదెలు సతీమణి భాగ్యలక్ష్మి మంచిర్యాల జడ్పీ ఛైర్ పర్సన్గా కొనసాగుతున్నారు. ఆమె పదవి కాలం దాదాపు మరో రెండున్నరేళ్లు ఉంది.
బాల్క సుమన్తో విబేధాల వల్లే నల్లాల ఓదెలు కాంగ్రెస్లోకి!
కాగా, గత అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూరు నుంచి టీఆర్ఎస్ తరపున బాల్క సుమన్ పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బాల్క సుమన్, నల్లాల ఓదెలు మధ్య విభేదాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు నేతల మధ్య ఆధిపత్య పోరు పెరగడంతో నల్లాల ఓదెలు పార్టీని వీడాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇటీవల కుటుంబసభ్యులు, సన్నిహితులు, అనుచరులతో సమావేశాలు నిర్వహించారు. చివరకు టీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఉద్యమకాలం నుంచి పనిచేస్తున్న నేత టీఆర్ఎస్ను వీడటం ఆ పార్టీకి కొంత నష్టం కలిగించే విషయమనే చెప్పారు.