టీఆర్ఎస్ మేనిఫెస్టో విడుదల: పాతవి అమలు చేస్తూనే ఇవీ! నిరుద్యోగ భృతి నుంచి ఇంటికి రూ.5 లక్షల వరకు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదివారం తెరాస మేనిఫెస్టోను విడుదల చేశారు. సికింద్రాబాద్లోని పరేడ్ మైదానంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో విడుదల చేశారు. ఇదే సమయంలో గ్రేటర్ హైదరాబాదులో పోటీ చేస్తున్న అభ్యర్థులను పరిచయం చేశారు.
ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... హైదరాబాద్ను గత పాలకులు కమర్షియల్ దృష్టితో చూశారన్నారు. ప్రజలకు నివాసయోగ్యమైన నగరంగా చూడలేదన్నారు. అన్ని రంగాల్లోను నగరాన్ని సర్వనాశనం చేశారన్నారు. కోటి జనాభా ఉంటే అధికారిక మార్కెట్లు ఏడు మాత్రమే ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటే మంచి నిర్ణయం తీసుకోవాలని ఓటర్లకు సూచించారు. గెలవాల్సింది అభ్యర్థులు కాదని ప్రజల అభీష్టమన్నారు.
తెలంగాణను విఫల రాష్ట్రంగా మార్చే కుట్రలు చేశారని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చాక ఎన్నో అవరోధాలు అధిగమిస్తూ ముందుకు వెళ్తున్నామని పేర్కొన్నారు. సంక్షేమంలో కేసీఆర్ పాలన స్వర్ణయుగమని పేర్కొన్నారు. వ్యవసాయ రంగం కుదుటపడిందని చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా ముందుకు సాగుతోందన్నారు.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజమవుతోందని, విద్యా విధానంలో ఎన్నో మార్పులు చేశామని, ఆరోగ్య తెలంగాణగా మార్చుతున్నామని, ఉద్యోగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని, కొత్త జిల్లాలు... డివిజన్లు.. ఇలా ఎన్నో అద్భుత సంస్కరణలు చేపట్టామని, పారిశ్రామికాభివృద్ధికి ప్రోత్సాహకాలు ఇస్తున్నామని పేర్కొన్నారు. అలాగే లా అండ్ ఆర్డర్ బాగుందని తెలిపారు.
కేసీఆర్ పాలనలో చేపట్టిన ఎన్నో పథకాలకు ఐక్యరాజ్య సమితి మొదలు నీతి ఆయోగ్ వరకు ప్రశంసలు వచ్చాయన్నారు. 2014లో మేనిఫెస్టోలో చెప్పని అంశాలు కూడా అమలు చేశామన్నారు. ఇలాంటి పథకాలు దేశంలో మరెక్కడా లేవన్నారు. సంపదను పెంచుతూ ప్రజలకు పంచుతున్నామని తెలిపారు. మళ్లీ తాము అధికారంలోకి వస్తే ప్రస్తుత పథకాలను అన్నింటిని కొనసాగిస్తామని, చెబుతూ తాజా మేనిఫెస్టోలో పలు అంశాలను పొందుపర్చారు.
ఆసరా పింఛన్ రూ.1000 నుంచి రూ.2016కు, వికలాంగులకు రూ.1500 నుంచి రూ.3016కు, బీడీ కార్మికులకు కటాఫ్ డేట్ను 2018 వరకు పొడిగించడం చేస్తామని పేర్కొన్నారు.
వృద్ధాప్య పించన్ అర్హత 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గిస్తామని తెలిపారు.
నిరుద్యోగ యువతకు రూ.3016 నిరుద్యోగభృతి ఇస్తామన్నారు.
ప్రస్తుత పద్ధతిలో డబుల్ బెడ్రూం ఇళ్లను కొనసాగిస్తూనే, సొంత ఇళ్ళ నిర్మాణానికి అర్హులకు రూ.5 లక్షల నుంచి రూ.6 లక్షలు ఇస్తామన్నారు.
రైతు బంధుకు ఏడాదికి రూ.8వేల నుంచి రూ.10వేలు.
రైతులకు రూ.లక్ష వరకు రుణమాఫీ.
చట్టసభల్లో బీసీలకు 33 శాతం, మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇస్తామని పేర్కొన్నారు.
ఎస్టీలకు, మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ల చొప్పున కేంద్రంతో పోరాటం.
ఏస్సీ వర్గీకరణపై కేంద్రం ఆమోదం కోసం పోరాటం.
అగ్రకులాల్లోని పేదల అభ్యున్నతికి పథకాలు ప్రవేశపెడతామని పేర్కొన్నారు.
కంటి వెలుగు తరహా ఇంట్లోని వారందరికీ ఇతర ఆరోగ్య పరీక్షలకోసం వైద్య శిబిరాలు ఏర్పాటు. ప్రతి వ్యక్తి హెల్త్ ప్రొఫైల్ రికార్డ్.
ప్రభుత్వ ఉద్యోగులకు సముచితరీతిలో వేతన సవరణ.
బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి చర్యలు
విశ్వనగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దడం కోసం మరింత ముమ్మర ప్రయత్నాలు.












Click it and Unblock the Notifications