టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలను వణికిస్తున్న వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం; కాకరేపుతున్న రాజకీయం!!
వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల టిఆర్ఎస్ పార్టీ నాయకులకు టెన్షన్ పుట్టిస్తున్నారా? నియోజకవర్గాల వారీగా పర్యటిస్తున్న వైయస్ షర్మిల అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు చేసిన అవినీతి పాలనను ఏకరువు పెడుతున్నారా? సొంత నియోజకవర్గంలోనే అధికార పార్టీ మంత్రులను, ఎమ్మెల్యేలను కడిగిపారేస్తున్నారా? వైయస్ షర్మిల దాడిని తట్టుకోలేకనే ఆమె పై చర్యలు తీసుకోవాలని పాలమూరు ఎమ్మెల్యేలంతా మూకుమ్మడిగా స్పీకర్ కు ఫిర్యాదు చేశారా? అంటే అవుననే సమాధానమే వస్తోంది.
మంత్రులు, ఎమ్మెల్యేలను టార్గెట్ చేస్తూ సాగుతున్న వైఎస్ షర్మిల పాదయాత్ర
వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల రాజకీయం తెలంగాణ రాష్ట్రంలో కాక రేపుతుంది. ప్రజా ప్రస్థానం పాదయాత్ర ద్వారా ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్న వైఎస్ షర్మిల నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలను, మంత్రులను టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్న తీరు ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా పాలమూరు జిల్లాలో వైయస్ షర్మిల పాదయాత్ర మొదలయిన నాటి నుండి ఆమె అధికార పార్టీ మంత్రులపై, నేతల పై నిప్పులు చెరుగుతూనే ఉన్నారు. ఎవడ్రా నన్ను ప్రశ్నించేది అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిరంజన్ రెడ్డిపై తీవ్ర వ్యాఖ్యలతో మొదలైన దుమారం..
మంగళవారం మరదలు అన్నాడని నిరంజన్ రెడ్డిని వీధి కుక్కతో పోల్చి ఓ రేంజ్ లో తిట్టిపోశారు. సొంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి చేయలేని దద్దమ్మలని తిట్టిపోశారు. ఇక నిరంజన్ రెడ్డికి, వైయస్ షర్మిలకు మధ్య సవాళ్ల పర్వం కూడా కొనసాగింది. ఇక ఈ వ్యవహారం దుమారం రేపి వైయస్ షర్మిల పై స్పీకర్ కు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసే దాకా వెళ్లింది. అయినా ఏమాత్రం తగ్గని వైఎస్ షర్మిల ఆ తర్వాత మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను టార్గెట్ చేశారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు వైఎస్ షర్మిల షాక్ .. కబ్జాల ఆరోపణలు చేసిన షర్మిల
మంత్రి శ్రీనివాస్ గౌడ్ అవినీతి, కబ్జాల భాగోతం ఇది అంటూ ఆయన సొంత నియోజకవర్గంలోనే ఏకరువు పెట్టారు. లిక్కర్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బీసీలకు చేసింది సున్నా అంటూ మండిపడిన వైయస్ షర్మిల, ఆయన హయాంలో పాలమూరు జిల్లా ఏ మాత్రం అభివృద్ధి చెందలేదంటూ వ్యాఖ్యలు చేశారు. పాలమూరు యూనివర్సిటీని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. ఐటీ పార్కు లేదు. ఫుడ్ ఇండస్ట్రియల్ పార్క్ లేదు. భూములు మాత్రం ఏడికాడికి కబ్జా చేస్తున్నారంటూ ఆరోపించారు.ఐటీ ఇండస్ట్రియల్ పార్కు కోసం కేటాయించిన 480 ఎకరాల భూమిలో వంద ఎకరాలను ఎమ్మెల్యే కబ్జా చేశారని వైయస్ షర్మిల ఆరోపించారు.
షాద్ నగర్ ముగ్గురు ఎమ్మెల్యేలు దద్దమ్మలు అంటూ షర్మిల టార్గెట్
ఇక ప్రస్తుతం షాద్ నగర్ లో పర్యటిస్తున్న వైయస్ షర్మిల షాద్ నగర్ ఎమ్మెల్యేలను టార్గెట్ చేశారు. షాద్ నగర్ ఎమ్మెల్యే ఒక రబ్బర్ స్టాంప్ అని, ఇద్దరు కొడుకులదే అధికారమని విమర్శలు గుప్పించారు. ముగ్గురు ఎమ్మెల్యేలు ఉండి ఏం చేసినట్టు? డిగ్రీ కాలేజీ లేదు. ఇంటర్ కాలేజీ లేదు. పిల్లలు రోడ్ల మీదికొచ్చి ధర్నాలు చేస్తే కేసులు పెట్టారట.
ఇదేం దిక్కుమాలిన పాలన? అని వైయస్ షర్మిల తనదైన శైలిలో ముగ్గురు ఎమ్మెల్యేల పై మండిపడ్డారు. ఇక ఇదే సమయంలో పాలమూరు ఎమ్మెల్యేలను ప్రశ్నిస్తే సమాధానం చెప్పే దమ్ము లేదని, చేతగాని దద్దమ్మలు కుమ్మక్కై స్పీకర్ దగ్గర కంప్లైంట్ చేశారని, దమ్ముంటే చర్చ పెట్టడానికి రావాలని, తాను సిద్ధంగా ఉన్నానని మరోమారు సవాల్ విసిరారు.
అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వైఎస్ షర్మిల టెన్షన్
దీంతో వైయస్ షర్మిల వ్యవహారం అధికార టీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా తయారైంది. ఏ నియోజకవర్గమైనా సరే ఆ నియోజకవర్గంలో అక్కడ ఎమ్మెల్యేల అవినీతిని బాహాటంగా వైయస్ షర్మిల విమర్శిస్తున్న తీరు, ప్రజలతో చెబుతున్న విధానం వారికి మింగుడు పడడం లేదు.
ఆమె పై ఎదురుదాడి చేయడానికి అధికార టీఆర్ఎస్ పార్టీ దగ్గర సరైన ఆయుధం కూడా లేదు. ఈ క్రమంలోనే అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఫిర్యాదు చేస్తూ, వైయస్ షర్మిల పాదయాత్ర అడ్డుకోవాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు టిఆర్ఎస్ పార్టీ నేతలు. ఇక ఇదే విషయాన్ని వైయస్ షర్మిల సైతం స్పష్టం చేస్తున్నారు. దమ్ముంటే తనను అరెస్టు చేయాలని, ఎవరెన్ని కుట్రలు చేసినా పాదయాత్రను ఆపేది లేదని ముందుకు సాగుతున్నారు.