ఢిల్లీకి ఈటల రాజేందర్: బీజేలో చేరేందుకే! -ఆయన వెనకాలే బండి సైన్యం పయనం -హైకమాండ్ మాటిదే
తెలంగాణ రాజకీయాల్లో కొత్త రాజకీయ ఈక్వేషన్లకు తెరలేపుతూ, ఉద్యమనాయుడు, బహిష్కృత మంత్రి, టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అనూహ్య అడుగులు వేశారు. ఆదివారం సాయంత్రం ఆయన హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పయనమయ్యారు. ఆయన వెంట వెళ్లిన నేతలు, ఆ వెనకాలే ఢిల్లీకి పయనమైన నాయకుల జాబితా చూస్తే ఈటల తాను కచ్చితంగా బీజేపీలో చేరబోతున్నారనే స్పష్టమైన సంకేతాలిచ్చినట్లయింది. వివరాలివి..

వెంట ఏనుగు, గుమ్మడి..
మాజీ మంత్రి ఈటల రాజేందర్ శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఢిల్లీ బయల్దేరారు. ఈటల వెంట మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్రెడ్డి, మాజీ ఎంపీ గడ్డం వివేక్ వెంకటస్వామి ఉన్నారు. బీజేపీ నేతలతో వరుస భేటీలను స్వయంగా ఖరారు చేసిన ఈటల ఆ పార్టీలో చేరుతారన్న ప్రచారం నేపథ్యంలో ప్రస్తుత ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అదీగాక..

వెనకాలే బండి, కిషన్ రెడ్డి..
టీఆర్ఎస్ నేత ఈటల రాజేందర్ ఆదివారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరగా, ఇవాళ రాత్రికే తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తదితర కీలక నేతలు కూడా హస్తిన వెళ్తారనే ప్రచారం జరుగుతోంది. భూ కబ్జా ఆరోపణలపై సీఎం కేసీఆర్ ఈటలను బర్తరఫ్ చేసినప్పటి నుంచి ఆయన కోసం కాంగ్రెస్, బీజేపీ నేతలు పడిగాపులు కాయడం, చివరికి ఆయన కమలదళంలో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్లు వెల్లడికావడం తెలిసిందే. కిషన్రెడ్డి, బండి సంజయ్ లతో ఇప్పటికే కలిసి మాట్లాడినట్లు ఈటల స్వయంగా అంగీకరించారు. కాగా,
Recommended Video

ఈటల చేరికపై బీజేపీ హైకమాండ్
కేసీఆర్ కుటుంబీకులు కాకుండా టీఆర్ఎస్ లో నంబర్ 2 హోదా కలిగిన ఈటల రాజేందర్ లాంటి నేతను బీజేపీలో చేర్చుకునేందుకు పార్టీ జాతీయ నాయకత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతోపాటు మరో ఇద్దరు అగ్రనేతలతో బండి సంజయ్ ఈటల గురించి మాట్లాడారని, ఉద్యమకారులకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉండడం మంచిది కాదని, వారికి పూర్తిస్థాయిలో అండగా నిలువాలని అధిష్ఠానం హామీ ఇచ్చినట్లు కాషాయ వర్గాలు వెల్లడించాయి. దీంతోపాటు ఈటల వ్యక్తిత్వం, ప్రజాదరణకు సంబంధించిన నివేదికలు జాతీయ నాయకత్వం తెప్పించుకున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications