కేసీఆర్ చలించి కంటతడి పెట్టారు: రైతు ఆత్మహత్యలపై రామలింగారెడ్డి
హైదరాబాద్: తెలంగాణలో రైతు ఆత్మహత్యలు బాధాకరమన్నారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రామలింగా రెడ్డి. వర్షాకాల సమావేశాల్లో భాగంగా రెండో రోజు రైతు సమస్యలపై చర్చ సాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతుల ఆత్మహత్యలపై సీఎం చలించి కంటతడి పెట్టారన్నారు.
రైతులకు రూ. 400 కోట్ల నష్టపరిహారాన్ని అందించారని వ్యాఖ్యానించారు. మిషన్ కాకతీయలో భాగంగా తెలంగాణలోని చెరువులను ఆధునీకరించిన ఘనత సీఎం కేసీఆర్దేనని అన్నారు. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని సీఎం కేసీఆర్ గతంలోనే నిర్ణయించారన్నారు.
స్వయంగా దుక్కిదున్ని, ఆధునిక వ్యవసాయాన్ని రైతులకు పరిచయం చేసిన సీఎం కేసీఆరేనని అన్నారు. ఎప్పుడూ వ్యవసాయం గురించే ఆలోచించే ఆయనకు రైతులపై పూర్తి అవగాహన ఉందన్నారు. కృష్ణా, గోదావరి నదుల్లో తెలంగాణ వాటా ఎంత అని చర్చకు తెరదీశారు.
కృష్ణా, గోదావరి నదుల్లోని నీరు తెలంగాణ ప్రాంతంలోని పొలాలకు వస్తే సస్యశ్యామలం అవుతుందని భావించిన నేత సీఎం కేసీఆరేనని అన్నారు. ధర్మపురి, బాసరలో గోదావరి పొంగి పొర్లుతుంటే మొక్కులు చెల్లించారని అన్నారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రతి రోజూ రైతాంగ సమస్యలపై చర్చించి, సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకొన్నందుకు అభినందిస్తున్నానన్నారు.
గతంలో ఎన్నో సార్లు పంట నష్టం జరిగిందని చెప్పిన ఆయన మనకొచ్చిన పంట నష్టపరిహారంరూపాయి పావలా, రూపాయి, తొంబై పైసలు ఉండేది. ఈ నష్టపరిహాన్ని తీసుకోవడానికి బ్యాంకులో వెయ్యి రూపాయులు పెట్టి ఖాతా తెరవాలి. కానీ ఇప్పుడు అలాంటివేమీ లేకుండా రైతులకు నష్టపరిహాన్ని అందిస్తున్నారన్నారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ఇప్పటి వరకు 17వేల కోట్లు పంట రుణాల కింద విడుదల చేశారన్నారు. నకిలీ విత్తనాలు అమ్మిన వ్యక్తులపై ప్రభుత్వ కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. ఇక కరెంట్ విషయానికి వస్తే రైతాంగానికి 7 గంటల కరెంట్ను అందిస్తున్నామన్నారు.
వచ్చే ఏడాది నుంచి 9 గంటలు పాటు కరెంట్ అందిస్తామని సీఎం స్వయంగా ప్రకటించారని దానికి తగిన చర్యలు తీసుకుంటున్నారన్నారు. పత్తి కొనుగోలు విషయానికి వస్తే గత 5 సంవత్సరాల్లో ఎంత కోనుగోలు చేశారో సీసీఐ ద్వారా 84 కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరతో కొనుగోలు చేసేలా ప్రభుత్వం చేసిందన్నారు.
పత్తి పంట వేరే పంటలకు పోలిస్తే మెరుగ్గా ఉంది కాబట్టి మరిన్ని కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. గతంలో ట్రాన్స్ ఫార్మర్ కాలిపోతే రూ. 10 వేలు వసూలు చేసేవారు. కానీ ఇప్పుడు ఒక్క రూపాయ కూడా లంచం ఇవ్వకుండా ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు చేస్తున్నారన్నారు.
సాధారణంగా ఏ కొత్త పథకం పెట్టినా మా పేరు ఉండాలని చూస్తారు. కానీ 800 సంవత్సరాల క్రితం కాకతీయ రాజులు చెరువులు తవ్వించారని చరిత్ర బెబుతోంది. అలాంటి కాకతీయ రాజుల పేరు మీద 'మిషన్ కాకతీయ' కింద చెరువుల మరమ్మత్తు కార్యక్రమం విజయవంతమైందన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 17 లక్షల మెట్రిక్ టన్నుల గోదాములను నిర్మించిన ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. కేసీఆర్ నాయకత్వంలోనే నిజామాబాద్ జిల్లాలో ఎర్ర జొన్నల రైతులకు నష్టపరిహారం ఇచ్చారు. రాష్ట్రంలోని చెరుకు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని అన్నారు.