గ్రేటర్ ఎన్నికల వేళ ఉద్రిక్తత... టీఆర్ఎస్ ఎమ్మెల్యేపై దాడి... కారు ధ్వంసం...
మరికొద్ది గంటల్లో గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమవుతుందనగా హైదరాబాద్ నగరంలో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కారుపై చంపాపేట డివిజన్ దుర్గా నగర్లో దాడి జరిగింది. బీజేపీ కార్యకర్తలే దాడి చేశారని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో సుధీర్ రెడ్డి కారు ధ్వంసమవగా.. ఆయనకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది.
Recommended Video
అంతకుముందు,సుధీర్ రెడ్డి వర్గీయులకు స్థానిక బీజేపీ అభ్యర్థి వంగా మధులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ వాగ్వాదం కాస్త ఘర్షణకు దారితీసినట్లు సమాచారం. దీంతో రాచకొండ సీపీ మహేష్ భగవత్ స్వయంగా రంగంలోకి దిగి ఇరు వర్గాలను అక్కడినుంచి చెదరగొట్టినట్లు తెలుస్తోంది. దాడి ఘటనకు సంబంధించిన వీడియో ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.
దాడి ఘటనపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ట్విట్టర్లో స్పందించారు. బీజేపీ అభ్యర్థి వంగా మధు డబ్బులు పంచుతున్నారని టీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారన్నారు. కానీ బీజేపీ కార్యకర్తలు తమ అభ్యర్థే డబ్బులు పంచుతున్నాడని రివర్స్లో తమపైనే దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపించారు. గతంలో ఎల్బీనగర్లో ఎన్ని ఎన్నికలు జరిగినా, ఎప్పుడూ గొడవలు జరగలేదన్నారు. ఇప్పుడు బీజేపీ శక్తుల కారణంగా ప్రశాంతత దెబ్బతింటోందని ఆరోపించారు. టీఆర్ఎస్ కార్యకర్తల మీద బీజేపీ కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్నారని... మహిళలు అని కూడా చూడకుండా అమానుషంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. అనుక్షణం బీజేపీ కార్యకర్తలు రెచ్చగొడితే ధోరణితో వ్యవహరిస్తున్నారని,ఎన్నికలు శాంతియుత వాతావరణంలో జరగాలని తాము కోరుకుంటున్నామని స్పష్టం చేశారు.
సుధీర్ రెడ్డి ట్వీట్ను మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేశారు.ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై జరిగిన దాడిపై మరో ఎమ్మెల్యే బాల్క సుమన్ ట్విట్టర్లో స్పందించారు. ఎన్నికల ముందు రోజు రాత్రి ఓటమి భయంతో బీజేపీ దాడులకు తెగబడుతోందని ఆరోపించారు.
కాగా,మంగళవారం(డిసెంబర్ 1) హైదరాబాద్లోని 150 డివిజన్లకు ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఉదయం 7గం. నుంచి సాయంత్రం 6గం. వరకు పోలింగ్ జరగనుంది. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 50వేల మంది పోలీసులను బందోబస్తులో మోహరించారు.
గతంలో ఎల్బీనగర్లో ఎన్ని ఎన్నికలు జరిగినా, ఎప్పుడూ గొడవలు జరగలే. ఇప్పుడు బీజేపీ వాళ్ళ దుర్మాగాలు, దౌర్జన్యాల వల్ల ప్రశాంతత దెబ్బతింటోంది. టీఆర్ఎస్ కార్యకర్తల మీద దాడులకు పాల్పడుతున్నారు. మహిళలు అని కూడా చూడకుండా అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. (1/2)@trspartyonline @KTRTRS pic.twitter.com/m1mq1G7Qdf
— Devireddy Sudheer Reddy (@D_SudheerReddy) November 30, 2020