మైనంపల్లి నివాసంలో అసంతృప్త ఎమ్మెల్యేల రహస్య భేటీ - ఏం జరుగుతోంది..!?
తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం. టీఆర్ఎస్ మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేల రహస్య మంతనాలు. మైనంపల్లి హానుమంతరావు నివాసంలో ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. వీరి భేటీ రహస్యంగా ఉంచటం పలు అనుమానాలకు తావిస్తోంది. దాదాపు మూడు గంటలుగా ఈ సమావేశం కొనసాగుతోంది. ఇటు పైలెట్ రోహిత్ రెడ్డి ఈడీ విచారణ వేళ..అటు ఈ ఎమ్మెల్యే సమావేశం హాట్ టాపిక్ గా మారుతోంది. అయితే, ఈ సమావేశం వెనుక రాజకీయ కారణాలు లేవని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. అయితే నగరానికి చెందిన ఒక మంత్రి టార్గెట్ గా ఈ సమావేశం జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నివాసంలో అయిదుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రహస్యంగా భేటీ అయ్యారు. కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఉప్పల్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద రెడ్డి, శేరి లింగం పల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ భేటీ అయ్యారు. ఎమ్మెల్యే మైనంపల్లి నివాసంలో జరిగిన శుభకార్యంలో తాము హాజరు కాలేదని..దీంతో, ఇప్పుడు తన నివాసం లో బ్రేక్ ఫాస్ట్ ఏర్పాటు చేసి ఆహ్వానిస్తే వచ్చామని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. అయితే, ఈ సమావేశం వెనుక అసలు అజెండా వేరే ఉందని సమాచారం. మేడ్చల్ జిల్లాకు చెందిన మంత్రి మల్లారెడ్డి తీరు పైన మైనంపల్లి అసంతృప్తి గా ఉన్నారు. అదే సమయంలో మంత్రి తీరుతో విభేదిస్తున్న ఎమ్మెల్యేలతో ఆయన ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
కొద్ది రోజులు మంత్రి మల్లారెడ్డి వర్సస్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు అన్నట్లుగా పరిస్థితులు కనిపిస్తున్నాయని చెబుతున్నారు. ఎమ్మెల్యేలు చెప్పిన పనులు చేయవద్దంటూ మంత్రి జిల్లా కలెక్టర్ తో పాటుగా ఇతర అధికారులకు చెప్పారని సమాచారం. దీనిని ఎమ్మెల్యేలు సీరియస్ గా తీసుకున్నారు. మంత్రి తమకు సహకరించాల్సిన సమయంలో.. ఎమ్మెల్యేలు చెబితే చేయద్దంటూ అధికారులు ఎలా చెబుతారని వీరంతా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. మైనంపల్లి హనుమంతరావును ఉద్దేశించి ఈ విధంగా సూచనలు చేయటం పైన ఆయన ఆగ్రహంతో ఉన్నారు. దీంతో, ఇతర ఎమ్మెల్యేలను కలుపుకొని మంత్రి వ్యవహార శైలి పైన సీఎం వద్దకు వెళ్లేందుకు వీరు సిద్దమైనట్లు సమాచారం. కానీ, ఎమ్మెల్యేలు మాత్రం తమ భేటీలో రాజకీయ అంశాలు లేవని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.