వెళ్లిపో, ఆలోచిస్తుంటే ఇలాగా: కొండా సురేఖ 'తీవ్రవ్యాఖ్యల'పై సుధారాణి
వరంగల్/హైదరాబాద్: టీఆర్ఎస్ పైన, పార్టీ అధినేత కేసీఆర్, కేటీఆర్ల పైన తీవ్ర వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ పైన ఆ పార్టీ నేత గుండు సుధారాణి శనివారం తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆమె వ్యక్తిగత అజెండాతో పార్టీ నుంచి వెళ్లిపోతే వెళ్లిపోవచ్చునని, కానీ తప్పుడు ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని సుధారాణి హెచ్చరించారు. ఆమె పార్టీ నుంచి వెళ్లిపోయినా వచ్చే నష్టమేమీ లేదన్నారు.
చదవండి: కూతురు కోసం పట్టు: 12న కాంగ్రెస్లోకి కొండా సురేఖ! అందుకే కేసీఆర్ తీవ్ర అగ్రహం
కొండా సురేఖ తమ కుటుంబానికి రెండు నుంచి మూడు సీట్లు అడిగారని, దాని గురించి పార్టీ ఆలోచన చేస్తోందని ఆమె చెప్పారు. అంతలోనే కొండా సురేఖ పార్టీ వీడాలని ఆలోచిస్తున్నారని విమర్శించారు. గత ఎన్నికల్లో ఆమెను పిలిచి టిక్కెట్ ఇవ్వలేదని తేల్చి చెప్పారు. రాజకీయ భిక్ష కావాలని కేసీఆర్కు దండం పెడితే స్థానికేతరురాలు అయిప్పటికీ వరంగల్ తూర్పును కేటాయించి, గెలిపించారన్నారు.
కేటీఆర్ తన సొంత కోటరీ కోసమే తనను టార్గెట్ చేశారని కొండా సురేఖ వ్యాఖ్యానించడం విడ్డూరమని సుధారాణి అన్నారు. తమ పార్టీలో కోటరీలు అంటూ ఏమీ ఉండవని చెప్పారు. అందరూ కేసీఆర్ నాయకత్వంలో పని చేస్తారన్నారు. కొండా దంపతులు మాత్రం తమ నియోజకవర్గాల్లో పెత్తనం చెలాయిస్తూ అందరినీ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. బీసీ మేయర్ను ఇబ్బంది పెట్టారని, భూపాలపల్లిలో మధుసూదనాచారి వంటి బీసీ నేతకు ఆటంకాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.
చదవండి: కేసీఆర్ తర్వాత తెలంగాణలో ఏపీ సీఎం రికార్డ్!: చంద్రబాబుకు ఉత్తమ్ 15 సీట్లు ఆఫర్
కాగా, అంతకుముందు కొండా సురేఖ తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ కల్వకుంట్ల వారి ఇల్లు కాదని, ప్రజలది అన్నారు. గత ఎన్నికల్లో తనను కాదని మధుసూదనా చారి కోసం తన భర్త ప్రచారం చేశారని చెప్పారు. తన నియోజకవర్గాన్ని అసలు హోల్డ్లో ఎందుకు పెట్టారో చెప్పాలన్నారు. మేం చేసిన తప్పేమిటన్నారు.
తనకు తెరాస నుంచి ఎలాంటి లబ్ధి చేకూరలేదన్నారు. తనకు టిక్కెట్ ఇవ్వకుంటే మహిళలను అవమానించినట్లే అన్నారు. తమ నియోజకవర్గంలో తమను ఇబ్బందులకు గురి చేస్తోంది, నియోజకవర్గంలో పలువురిని ఉసిగొల్పుతోంది కేటీఆరే అన్నారు. తనకు టిక్కెట్ రాకపోవడానికి ఆయనే కారణమన్నారు. ఆయన తన కోటరీ కోసం తమను పక్కన పెట్టారన్నారు.
చదవండి: తెలంగాణపై చంద్రబాబు 'బిగ్' ప్లాన్: కాంగ్రెస్ గెలిస్తే అధికారంలోను భాగస్వామ్యం
తాము పార్టీ నుంచి వెళ్తే చెప్పి వెళ్తామని, దొడ్డిదారి లేదన్నారు. మాకు టిక్కెట్ ఇవ్వకుంటే ఎవరికి ఇచ్చినా నష్టం లేదని, రెండు మూడు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. అవసరమైతే తాము వరంగల్ ఈస్ట్, పరకాల, భూపాలపల్లి నియోజకవర్గాలలో ఇండిపెండెంట్గా పోటీ చేస్తామన్నారు. 24 గంటల్లో తేల్చాలని అల్టిమేటం జారీ చేశారు. తనకు టిక్కెట్ ఇవ్వకుంటే తెరాసకే నష్టమన్నారు. అసలు ప్రకటించిన వారందరికీ బీఫారం ఇస్తారనే నమ్మకం లేదన్నారు. కేసీఆర్ ముందస్తుకు వెళ్లడం సరికాదన్నారు.