అమరావతి వార్త మాకెందుకు: మీడియాపై కెసిఆర్, బాబువల్లే: కవిత
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పైన కొన్ని పత్రికలు ఎలా వార్తలు ఇచ్చాయో తెలుసునని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు బుధవారం అన్నారు. ఇక్కడి వారికి అమరావతి వార్త అవసరమా? అని ప్రశ్నించారు.
అమరావతి కట్టుకోండి.. అక్కడి ప్రజలకు సేవ చేయండి.. హర్షిస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకు సూచించారు. రాజధాని కట్టుకోండి లేదా ఇంకోటి కట్టుకోండి కానీ హైదరాబాద్ జోలి రావొద్దని సూచించారు.
డీఎస్ నివాసానికి సీఎం కేసీఆర్
ముఖ్యమంత్రి కేసీఆర్ డి శ్రీనివాస్ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా బంగారు తెలంగాణ నిర్మాణంతో పాటు పలు అంశాలపై చర్చించనున్నారు. గత కొద్ది రోజుల క్రితం డీఎస్ టీఆర్ఎస్లో చేరిన విషయం విదితమే.
హైకోర్టుపై చంద్రబాబు కుట్రలు: కవిత
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రాజకీయ కుట్రల వల్లే హైకోర్టు విభజన జరగడం లేదని టీఆర్ఎస్ ఎంపీ కవిత ఆరోపించారు. గత సమావేశాల్లో న్యాయశాఖ మంత్రి హామీ ఇచ్చినా హైకోర్టు విభజనపై చంద్రబాబు లేఖ ఇవ్వకపోవడం వల్లే విభజన ఆగిందన్నారు.
లోకసభను స్తంభింపజేసి హైకోర్టు విభజన అంశాన్ని ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ప్రధాని మోడీ హామీ ఇచ్చే వరకు సభలో హైకోర్టు విభజనపై పోరాడుతామన్నారు. హైకోర్టు విభజన జరగకపోవడం వల్ల రాష్ట్రంలో న్యాయవాదులకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు.