#ModiHatesTelangana: కేసీఆర్ చేతికి ప్రధాని కొత్త అస్త్రం-మునుగోడు బైపోల్ వేళ..!!
హైదరాబాద్: నల్లగొండ జిల్లా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి త్వరలో జరగబోయే ఉప ఎన్నిక వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. నోటిఫికేషన్ ఇంకా వెలువడక ముందే అక్కడ రాజకీయం వేడెక్కింది. అన్ని పార్టీల దృష్టీ మునుగోడు మీదే ఉంది. కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాట్ రెడ్డి రాజీనామా చేయడం వల్ల ఉప ఎన్నిక అవసరమైన ఈ నియోజకవర్గాన్ని అన్ని పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ఎవరికి వారు గెలుపు వ్యూహాలను రూపొందించుకుంటోన్నారు. ప్రచార కార్యక్రమాలపై దృష్టి సారించారు.
మోడీతో సీఎం అమీతుమీ - మిషన్ మిస్డ్ కాల్: ఆ మొబైల్ నంబర్తో చెక్
రేపే సభ..
ఈ క్రమంలో అధికార తెలంగాణ రాష్ట్ర సమితి ఓ అడుగు ముందు ఉంటోంది. శనివారం మునుగోడులో భారీ సభను ఏర్పాటు చేసింది. ప్రజా దీవెన సభ పేరుతో దీన్ని నిర్వహించబోతోంది. టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు సభ ఆరంభం కానుంది. కేసీఆర్తో పాటు మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డి, హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, ఎర్రబెల్లి దయాకర్, సబితా ఇంద్రారెడ్డి- దీనికి హాజరు కానున్నారు.
బీజేపీ సభకంటే ముందే..
ఆ మరుసటి రోజే భారతీయ జనతా పార్టీ కూడా బహిరంగ సభను నిర్వహించబోతోంది. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా దీనికి ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. ఈ సభలోనే అమిత్ షా చేతుల మీదుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాషాయ కండువా కప్పుకోనున్నారు. ఆయనతో పాటు కాంగ్రెస్కు చెందిన పలువురు మునుగోడు నాయకులు బీజేపీ తీర్థాన్ని పుచ్చుకోనున్నారు. ఈ సభ కోసం బీజేపీ నాయకులు ఏర్పాట్లు చేస్తోన్నారు.
కొత్త అస్త్రం..
ఈ పరిణామాల మధ్య- తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన ఓ ప్రకటన.. కేసీఆర్ చేతికి కొత్త అస్త్రాన్ని అందించినట్టయింది. దీన్ని ఖచ్చితంగా టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారాస్త్రంగా మలచుకుంటుందనడంలో సందేహాలు అక్కర్లేదు. ఇప్పటికే దీనిపై సోషల్ మీడియా వేదికగా ఉద్యమాన్ని సైతం మొదలు పెట్టింది. #ModiHatesTelangana అనే హ్యాష్ ట్యాగ్ను ట్రెండింగ్లోకి తీసుకొచ్చింది. తెలంగాణపై మోడీకి ఏ మాత్రం ప్రేమాభిమానాలు లేవని స్పష్టం చేస్తోంది.
గోవాను ప్రకటించడం పట్ల..
దీనికి కారణాలు లేకపోలేదు. హర్ ఘర్ జల్ ఉత్సవ్ తొలి రాష్ట్రంగా గోవాను ప్రకటించారు ప్రధాని మోడీ. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రం అది. అక్కడి ప్రభుత్వం ప్రతి ఇంటికీ నల్లాల ద్వారా మంచినీటి సౌకర్యాన్ని కల్పించిందని మోడీ ప్రశంసించారు. ఇంటింటికీ నల్లాల ద్వారా మంచినీటిని అందిస్తోన్న మొట్టమొదటి రాష్ట్రం గోవాగా అభివర్ణించారు. 100 శాతం ఈ ఘనతను సాధించిన రాష్ట్రంగా గోవాకు కితాబిచ్చారు. గోవా ప్రభుత్వాన్ని అభినందించారాయన.
మోడీకి సిగ్గు..
మోడీ చేసిన ఈ ప్రకటన పట్ల టీఆర్ఎస్ మండిపడింది. తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. తెలంగాణను మరిచిపోయినట్టున్నారని ధ్వజమెత్తింది. మిషన్ భగీరథ ప్రాజెక్ట్ కింద- రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ నల్లాల ద్వారా నీటిని సరఫరా చేస్తోన్నామని గుర్తు చేసింది. 100 శాతం నల్లాల ద్వారా నీటిని సరఫరా చేసిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణేనని స్పష్టం చేసింది. తెలంగాణను మోడీ అసహ్యించుకుంటోన్నారని, తమను గుర్తించడానికి ఆయన సిగ్గుపడుతున్నారని ధ్వజమెత్తింది. వందశాతం ఇంటింటికీ మంచి నీటిని అందించిన రాష్ట్రంగా తెలంగాణ పేరును ప్రకటించడానికి సిగ్గెందుకు అని ప్రశ్నించింది.