టీఆర్ఎస్ ఓవర్ లోడ్..! అంతర్గత పోరు తప్పేట్టు లేదు..!!
హైదరాబాద్: తెలంగాణలో డెబ్బై శాతం నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ ఓవర్ లోడ్ అయి ఉంది. కనీసం అరడజను మంది నాయకులు టిక్కెట్ వేటలో ఉన్నారు. కాంగ్రెస్, టీడీపీలకు చెందిన చాలా మంది నియోజకవర్గ స్థాయి నాయకులు టీఆర్ఎస్ లో చేశారు. జడ్పీటీసీలు,ఎంపిపిలు పెద్ద సంఖ్యలో గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ ఎమ్మెల్యేలు అనేక మంది కేసీఆర్ పంచన చేరారు. వీరంతా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. కాంగ్రెస్,తెలుగుదేశం, సిపిఐ,వైసీపీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలే 25 మంది వరకు ఉన్నారు. ఈ నియోజకవర్గాల్లో మొదటి నుంచి టీఆర్ఎస్ ను నమ్ముకొని ఉన్న నాయకులు ఫిరాయింపు నేతలకు మద్దతునివ్వడం లేదు. వీరంతా ప్రత్యేక వర్గంలా తయారై టిక్కెట్ల వేటను కొనసాగిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఎమ్మెల్యేలకు మద్దతునిచ్చే ప్రశ్నే లేదని వీరు తేల్చి చెపుతున్నారు.
గులాబీ పార్టీలో భగ్గమంటున్న గ్రూపు తగాదాలు..! నివేదన సభకు తరలి వస్తారా..? రారా..?
ఒక వైపు ముందస్తు ఎన్నికలకు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చురుగ్గా పావులు కదుపుతున్నారు. ఇందుకోసం ఆయన ఇప్పటికే కసరత్తు తీవ్రతరం చేశారు. ప్రభుత్వ రద్దుకు కావాల్సిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరో వైపు ఎన్నికలకు పార్టీని కూడా కేసీఆర్ సిద్ధం చేస్తున్నారు.ఇందులో భాగంగా సెప్టెంబర్ 2ను అత్యంత భారీ బహిరంగ సభను నిర్వహించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.25లక్షల మందితో ప్రగతి నివేదన సభ ఉంటుందని చంద్రశేఖర్ రావు తేల్చి చెపుతున్నారు.జనాన్ని తరలించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీఆర్ఎస్ నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.ముఖ్యమంత్రి స్వయంగా ఎమ్మెల్యేలకు టార్గెట్లు పెట్టడంతో జనసమీకరణను వారు సవాల్ గా తీసుకున్నారు. అన్ని నియోజకవర్గాల్లో సన్నాహాక సమావేశాలు జరుగుతున్నాయి.
Recommended Video
కిక్కిరిపిపోయిన కారు..! ముందుకు కదులుతుందా..? మొరాయిస్తుందా..?
ఇంత వరకు బాగానే ఉంది కాని అసలు వివాదం అంతా ఇక్కడే మొదలౌతోంది. ఎన్నికలు ఖాయమని తేలిపోవడంతో ఆశావాహులంతా నిద్రలేశారు. ఎమ్మెల్యేలు, ఇంఛార్జులకు ధీటుగా కార్యక్రమాలను ప్రారంభించారు. ప్రధానంగా ప్రగతి నివేదన సభకు జన సమీకరణ చేయడం ద్వారా తమ సత్తా చాటడానికి గులాబీ నేతలు నడుం బిగించారు.తమ ఆధ్వర్యంలో భారీ ఎత్తున జనాన్ని సభకు తీసుకెళ్ళడం ద్వారా ముఖ్యమంత్రి ద్రుష్టిని ఆకర్షించాలన్నది వారి తాపత్రయం. ఇంటలిజెన్స్ నిఘా ఉన్న నేపథ్యంలో కచ్చితంగా లెక్కలన్ని సి.ఎం దగ్గరకు వెళ్తాయని నేతలు భావిస్తున్నారు.అందుకే ఒక్కొక్కొ నియోజకవర్గంలో రెండు మూడు సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి.
నిజమైన ఉద్యమకారులకు అవకాశం ఇవ్వాలి..! లేకపోతే సహించేది లేదంటున్న తెలంగాణ వాదులు..!
ఇక మరో నలభై నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నుంచి ముఖ్యమైన నాయకులు టీఆర్ఎస్ చేరి తమ సత్తా చాటే ప్రయత్నాల్లో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు,ఇంఛార్జులను పక్కకు నెట్టి టిక్కెట్ సంపాదించాలన్నది వీరి తాపత్రాయం.సిట్టింగ్ లకు సీట్లు గ్యారెంటీ అని ముఖ్యమంత్రి బల్లగుద్ది చెపుతున్నప్పటికి వీరు మాత్రం పట్టువదలని విక్రమార్కుల్లా రాజకీయం చేస్తూనే ఉన్నారు. ప్రగతి నివేదన సభ జరుగుతున్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోనే పార్టీలు రెండు మూడు వర్గాలుగా వీడిపోయి ఉండటం విశేషం. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఒక వైపు, పార్టీ ఇంఛార్జి కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి మరో వైపు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని కుత్భుల్లాపూర్ లో మూడు వర్గాలు, కూకట్ పల్లిలో నాలుగు వర్గాలు, జూబ్లీహిల్స్ లో మూడు వర్గాలు,ముషీరాబాద్ లో రెండు రెండు వర్గాలు,ఎల్.బి నగర్ లో మూడు వర్గాలు,ఉప్పల్ లో రెండు వర్గాలు, శేరిలింగంపల్లిలో నాలుగు వర్గాలు ఇలా దాదాపుగా అన్ని చోట్ల టీఆర్ఎస్ విడిపోయి జనసమీకరణ చేస్తోంది.
ప్రగతి నివేదనా..? ప్రతి తెలంగాణ వాది ఆవేదనా..?
ఇక ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నారాయణ్ పేట్, మక్తల్, కల్వకుర్తి,నాగర్ కర్నూల్, కొడంగల్ నియోజకవర్గాల్లో రెండు మూడు వర్గాలుగా టీఆర్ఎస్ చీలిపోయింది. నల్గొండ జిల్లాలో నల్గొండ,దేవరకొండ, మునుగోడు,భువనగిరి,మిర్యాలగూడ,హుజూర్ నగర్,నాగార్జున సాగర్,కోదాడ ల్లో ఒక్కొక్కొ నియోజకవర్గంలో రెండు నుంచి మూడు వర్గాలున్నాయి. వరంగల్,ఆదిలాబాద్ జిల్లాల్లో సగం నియోజకర్గాలు గ్రూపుల మయంగా మారాయి. మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో మాత్రం టీఆర్ఎస్ కు పెద్దగా వర్గాల గొడవ లేకపోవడం విశేషం. జిల్లాల్లో గ్రూపుల వ్యవహారాన్ని చక్కబెట్టే బాధ్యతను ముఖ్యమంత్రి కేసీఆర్ మంత్రులకు అప్పగించారు. మళ్ళీ టీఆర్ఎస్ పార్టీనే గెలవబోతుంది కాబట్టి మంచి పదవులు ఇస్తామన్న హామీతో వారిని సంత్రుప్తి పర్చాలని సి.ఎం వారికి సూచించారు. కాని టీఆర్ఎస్ ఆశావాహుల్లో మెజార్టీ నేతలు మాత్రం నామినేటేడ్ కంటే ఎమ్మెల్యే కావాలని క్రుతనిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. మరి ప్రగతి నివేదన జనసమీకరణతో వేడెక్కిన్న గ్రూపు రాజకీయం ఎన్నికల నాటికి ఇంకెంత ఉగ్రరూపం దాలుస్తుందో చూడాలి.