టీఆర్ఎస్ ప్లీనరీ 2021: గులాబీ ఫ్లెక్సీలు, కటౌట్ లపై బీజేపీ గురి .. కేటీఆర్ కు సూటి ప్రశ్న!!
తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీని అత్యంత ఘనంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లను చేసింది. హైదరాబాద్లోని హైటెక్ సిటీ టిఆర్ఎస్ ప్లీనరీకి ముస్తాబైంది. పార్టీ రూల్స్ ప్రకారం ప్రతి రెండేళ్లకోసారి ప్లీనరీ జరగాల్సి ఉన్నా 2020లో కరోనా మహమ్మారి కారణంగా ప్లీనరీని నిర్వహించలేదు. ఇక ఈ క్రమంలోనే టిఆర్ఎస్ పార్టీ ఏర్పాటు జరిగి 20 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దశాబ్ది ఉత్సవాలను నిర్వహిస్తూ అత్యంత గ్రాండ్ గా టీఆర్ఎస్ ప్లీనరీ నిర్వహించాలని గులాబీ నేతలు రెడీ అయితే గులాబీ నేతలకు షాక్ ఇవ్వటానికి బీజేపీ రంగం సిద్ధం చేసుకుంటుంది.
గులాబీ మయంగా హైదరాబాద్ సిటీ
ఈ క్రమంలో హైదరాబాద్ సిటీ అంతటా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలతో జెండాలతో గులాబీ మయంగా మారింది. ఈ ప్లీనరీకి రాష్ట్రవ్యాప్తంగా 6500 మంది ప్రజా ప్రతినిధులు హాజరు కాబోతున్నారు. ఈ ప్లీనరీ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాత్రమే కాకుండా కార్పొరేషన్ల చైర్మన్లు, జడ్పీ చైర్మన్ లతో పాటుగా మండల పరిషత్ అధ్యక్షులు, జడ్పిటిసి సభ్యులు, కార్పొరేటర్ల స్థాయి వరకు ఆహ్వానాలు పంపారు ఇక మాజీ మంత్రులకు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు పార్టీ సీనియర్ నేతలకు కూడా ప్రత్యేకమైన ఆహ్వానాలను పంపించారు. ఈ ప్లీనరీ వేదికగా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్ ఎన్నికైనట్టు ప్రకటిస్తారు.
టీఆర్ఎస్ ఫ్లెక్సీలు, కటౌట్ లపై బీజేపీ గురి
ఇదిలా ఉంటే టిఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సందర్భంగా సిటీలో ఎక్కడబడితే అక్కడ టిఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేయడంపై ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సిటీలో ఎక్కడపడితే అక్కడ టీఆర్ఎస్ ఫ్లెక్సీలను, కటౌట్లను ఏర్పాటు చేశారని, ఫ్లెక్సీలు, కటౌట్లు పై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించిన మంత్రి కేటీఆర్ ఇప్పుడు హైదరాబాద్లో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలపై , కటౌట్ లపై సమాధానం చెప్పాలని ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నిస్తుంది బీజేపీ.
ధర్నాకు బీజేపీ పిలుపు.. గతంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు గుర్తు చేస్తున్న బీజేపీ
హైదరాబాద్ నగరం అంతా టిఆర్ఎస్ పార్టీ నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకిస్తూ బుద్ధ భవన్ లోని జిహెచ్ఎంసి డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ ఆఫీస్ వద్ద బీజేపీ నేతలు ధర్నా చేయనున్నారు. నగరాన్ని గులాబీ ఫ్లెక్సీలతో నింపటానికి వ్యతిరేకిస్తున్న బీజేపీ మంత్రి కేటీఆర్ దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తోంది.
గతంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడాన్ని వ్యతిరేకించిన కేటీఆర్ రాజకీయ నాయకులు తమ ముఖాలను తామే చూసుకోవడానికి ఫ్లెక్సీలు పనికొస్తాయని, ఫ్లెక్సీలు పెట్టినంత మాత్రాన లీడర్లు కారని ప్లాస్టిక్ అనేది ఒక భూత మరి అది మనల్ని వెంటాడుతుంది దానిపై యుద్ధం చేయాలని కేటీఆర్ ప్రకటించారు.
ఫ్లెక్సీలు, కటౌట్ లు బ్యానర్లపై నిషేధం .. ఇప్పుడు వర్తించదా?
తాను ఫ్లెక్సీలు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని చెప్పిన కేటీఆర్ ఫ్లెక్సీలను టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పెట్టినా సరే వారికి ఫైన్ వేస్తామంటూ, గతంలో ఇల్లందు పర్యటన సందర్భంగా ఇల్లందు మున్సిపల్ చైర్మన్ కు లక్ష రూపాయల ఫైన్ వేసారు మంత్రి కేటీఆర్. అప్పుడు మాత్రమే కాదు ఆ తర్వాత అనేక సందర్భాలలో కేటీఆర్ ఫ్లెక్సీల సంస్కృతిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఇక జనవరి 1వ తేదీ నుండి ఫ్లెక్సీలు, కటౌట్లు, బ్యానర్లు కనిపిస్తే కఠినంగా వ్యవహరిస్తామని, ఎవరిని వదిలిపెట్టబోమని పేర్కొన్న కేటీఆర్ ఇప్పుడు హైదరాబాద్ నగరంలో టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా అడుగడుగునా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు బ్యానర్లపై సమాధానం చెప్పాలని బిజెపి నేతలు ప్రశ్నిస్తున్నారు.
కేటీఆర్ తన ముఖాన్ని తానే చూసుకోవటానికే ఫ్లెక్సీలు పెట్టారా?
అప్పుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు తన ముఖాన్ని చూసుకోవడానికే కేటీఆర్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయించుకున్నారా అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఇతర పార్టీల కోసమే నిబంధనల అంటూ ప్రశ్నిస్తున్న బీజేపీ నేతలు, టిఆర్ఎస్ పార్టీ కి నిషేధం వర్తించదు అంటూ నిలదీస్తున్నారు. నగరంలోని ప్రముఖుల విగ్రహాలను సైతం వదలకుండా తోరణాలు కట్టడంపై బిజెపి నాయకులు మండిపడుతున్నారు. మీ పార్టీకి ఓ న్యాయం ఇతర పార్టీలకు మరో న్యాయమా అంటూ దీనికి కేటీఆర్ సమాధానం చెప్పాలి అంటున్నారు.