చంద్రబాబుపై తలసాని తీవ్ర వ్యాఖ్య, 'రేవంత్ రెడ్డికి కెసిఆర్ భయపడ్డాడా'
నల్గొండ: పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలిస్తోంది ఓ గజదొంగ అని, ఆ దోపిడీ దొంగ పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గురువారం, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పైన తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు.
అతడి ముఠా విద్వేషం ప్రదర్శిస్తోందన్నారు. అతని నుంచి జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. గురువారం యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు.
చంద్రబాబుకు పొరుగు రాష్ట్రంతో సత్సంబంధాలు నెరపాలన్న బుద్ధి కూడా లేదన్నారు. ఎప్పుడూ ఏదో వివాదం సృష్టించి తెలంగాణ ప్రజలు ప్రశాంతంగా లేకుండా చేస్తున్నారని ఆరోపించారు. కొన్ని పత్రికలు ఆయనకు సహకరిస్తున్నాయన్నారు.
అరవై ఏండ్ల పాపాలను మేము మోస్తున్నం. రైతులను, ప్రజలను అన్నింట్లో వంచనకు గురి చేస్తున్నాడని, ఎక్కడెక్కడో ఎమ్మెల్యేలుగా గెలిచి హైదరాబాద్లోకి వచ్చారని, సంపదను తన్నుకుపోయారన్నారు.

'రేవంత్ రెడ్డి ఓ సైకో'
టిడిపి ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఓ సైకో, పిట్టల దొర, దగుల్బాజీ అని టిఆర్ఎస్ పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్న అన్నారు. ఈ పోటుగాడు వస్తున్నడని ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడి చైనాకు పారిపోయిండా? బాగా బలిసిన మాటలివి అని ధ్వజమెత్తారు.
ఏరికోరి ఎకనామిక్ ఫోరం ఆహ్వానిస్తే వెళ్లిన వ్యక్తి, ఈ పోటుగాడికి భయపడ్డాడా? కరుడు గట్టిన సమైక్యాంధ్ర నేతలనే వణికించిన సీఎం కేసీఆర్ ఎవరికీ భయపడబోరన్నారు. టిడిపి, కాంగ్రెస్, బిజెపి పార్టీలు ఉద్యమంలో కలిసి రాలేదని, పునర్నిర్మాణంలోనూ కలిసిరావడం లేదన్నారు.
విద్యుత్, సాగు నీటిరంగాల్లో ఈ పార్టీలు తెలంగాణకు చేసిన ద్రోహం వల్లే వ్యవసాయరంగంపై ప్రభావం పడిందన్నారు. చలువ కళ్లద్దాలు తీయకుండా, ఇస్తిరి బట్టలు నలుగకుండా రైతు సమస్యలపై ధర్నాలు చేసినట్లు నటించి మొసలి కన్నీళ్లు కారుస్తున్నారన్నారు.
2019 ఎన్నికల్లో టీడీపీ శంకరగిరి మాన్యాలు పట్టడం ఖాయమన్నారు. అందుకే ఆ పార్టీ గురించి ఎంత తక్కువగా చెప్పుకుంటే అంత మంచిదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగాన్ని నిలబెట్టేందుకు దూరదృష్టితో దీర్ఘకాలిక ప్రణాళికలు రచిస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications