కడియం సీటు ఖాళీ: రేవంత్ ఇష్యూ తర్వాత టిడిపి పోటీ చేస్తుందా?
వరంగల్: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ఖాళీ చేసిన వరంగల్ లోకసభ స్థానానికి తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందా అనేది ఆసక్తిగా మారింది. అయితే, రేవంత్ రెడ్డి వ్యవహారం తర్వాత టిడిపి పోటీ చేయకపోవచ్చునని తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) నాయకుడు వరంగల్ జిల్లా టిఆర్ఎస్ ఇంచార్జీ పెద్ది సుదర్శన్ రెడ్డి అంటున్నారు.
ఉప ఎన్నికలంటేనే టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు బెంబేలెత్తిపోతున్నయని ఆయన అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణం ఎజెండాగా తమ పార్టీ ధైర్యంగా ఓట్లు అడుగుతుందని ఆయన అన్నారు. రేవంత్రెడ్డి ఎపిసోడ్ తర్వాత టీడీపీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని తాను అనుకోవడం లేదని, అయితే బిజెపి ముసుగులో టీడీపీ ఎన్నికల బరిలోకి దిగాలని చూస్తోందని ఆయన అన్నారు.
వరంగల్ లోకసభ స్థానంలో టీడీపీ, కాంగ్రెస్లకు డిపాజిట్లు సైతం దక్కవని, అందువల్ల తమ పార్టీ అభ్యర్థిని ఏకగ్రీవం చేయడం కోసం కాంగ్రెస్, టీడీపీలు ముందుకు రావాలని ఆయన అన్నారు. కడియం ఎంపీగా టెక్స్టైల్ పార్క్, వరంగల్ ఔటర్ రింగురోడ్డు, సైనిక్ స్కూల్, ఐఐఎం వంటివి సాధించారని ఆయన అన్నారు.

కాగా, ఉప ఎన్నికలపై మాట్లాడే నైతికత హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని టీఆర్ఎస్ అధికార ప్రతినిధి రాజయ్య యాదవ్ అన్నారు. కడియం శ్రీహరి ఎంపీ పదవి రాజీనామా సందర్భంగా జరగనున్న ఉప ఎన్నికపై విపక్ష నేతలు చేస్తున్న అనవసర ఆరోపణలపై ఆయన స్పందించారు. కాంగ్రెస్కు ఉప ఎన్నికల గురించి మాట్లాడే నైతికత లేదని అన్నారు.
ఎంపీగా ఉన్న కోట్ల విజయ్భాస్కర్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసిందీ, మధ్యంతర ఎన్నికలకు వెళ్లింది కాంగ్రెసు పార్టీ అనే విషయం గండ్ర వెంకటరమణారెడ్డికి తెలియదా అని ఆయన అడిగారు. ఉప ఎన్నికలు భారమని కాంగ్రెస్ భావిస్తే పోటీ పెట్టకుండా టీఆర్ఎస్ను ఏకగ్రీవం చేయాలని ఆయన అన్నారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు నిర్మాణంపై టీ టీడీపీ నేతల వ్యాఖ్యలపై ఆయన ప్రతిస్పందించారు. పచ్చకామెర్లు వచ్చినోడిలా ఎర్రబెల్లి మాట్లాడుతున్నారని, కృష్ణానదిలో మనకు వాటా ఉందా లేదా? ప్రాజెక్టు కట్టలా వద్దా అనేది ఎర్రబెల్లి స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications