రాష్ట్రంలో గులాబీ వర్సెస్ కమలం.!మరి కాంగ్రెస్ ఎక్కడ.?తారాస్థాయిలో మైండ్ గేమ్.!రేవంత్ వెనకబడ్డట్టేనా.?
హైదరాబాద్ : తెలంగాణ రాజకీయాలు తీవ్రస్ధాయిలో వేడెక్కాయి. కమలం, గులాబీ పార్టీల మధ్య ప్రశ్చన్న యుద్దం కొనసాగుతున్న పరిణామాలు కనిపిస్తున్నాయి. టీఆర్ఎస్,బీజేపి పార్టీల మధ్య యుద్ద వాతావరణం నెలకొన్నప్పటికీ అది ఇరుపార్టీల పరస్పర అవగాహనలో భాగమేననే చర్చ కూడా జరుగుతోంది. ఈ రెండు పార్టీలు కలిసి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వకూడదనే ధోరణిలో వ్యవహరించడమే కాకుండా ప్రజల్లో కూడా కాంగ్రెస్ పార్టీ పట్ల అంతగా చర్చలేదనే భావనను ప్రజానికంలోకి తీసుకువెళ్లేందుకు ఈ రెండు పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయనే చర్చ కూడా జరుగుతోంది. మరి పీసిసి పగ్గాలు చేపట్టి యేడాది కాలం దిగ్విజయంగా పూర్తి చేసేకున్న ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి జరుగుతున్న పరిణామాల పట్ల ఎలాంటి వ్యూహంతో ముందడుగు వేస్తారనే అంశంపై వాడివేడి చర్చ జరుగుతోంది.
తెలంగాణలో బీజేపి, టీఆర్ఎస్ రాజకీయ క్రీడ.. కనపడని కాంగ్రెస్ చర్చ..
తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ పాత్ర నామమాత్రమే అనే అంశాన్ని ప్రజల్లో తీసుకెళ్లేందుకు అధికార గులాబీ పార్టీతో పాటు భారతీయ జనతా పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బండి సంజయ్ పాదయాత్రకు శాంతి భద్రతల సమస్యను సాకుగా చూపుతూ ప్రజా సంగ్రామ యాత్రను నిలువరించడం, కోర్టులో కూడా బండి సంజయ్ పాదయాత్రకు అనుమతి నిరాకరించాలని ప్రభుత్వ అడ్వకేట్ పిటీషన్ ధాఖలు చేయడం, బండి సంజయ్ పాద యాత్రలో అల్లరి మూకలు రాళ్లు రువ్వడం, బీజేపి శ్రేణులు ప్రతి దాడులు చేయడం, ఆతర్వాత రాష్ట్ర వ్యాప్తంగా నిరసన దీక్షలకు బండి సంజయ్ పిలుపునివ్వడం వంటి కార్యక్రమాలు వ్యూహాత్మకంగా జరిగిపోతున్నాయనే చర్చ జరుగుతోంది.
అంతా ఆ రెండు పార్టీలే.. తగ్గిన కాంగ్రెస్ ప్రభావం..
అంతకు ముందు హైదరాబాద్ లో మునావర్ ఫరూఖీ ప్రదర్శనకు తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇవ్వడం, ఈ అంశాన్ని బీజేపి పూర్తి స్ధాయిలో వ్యతిరేకించడం, ఈ పరంపరలోనే గోషామహల్ బీజేపి ఎమ్మెల్యే రాజాసింగ్ ను పార్టీ నుండి బీజేపి అధిష్టానం బహిష్కరించడం చకచకా జరిగిపోయాయి. అంతే కాకుండా రాజాసింగ్ అరెస్తు అంశం అనేక రాజకీయ మలుపులు కూడా తీసుకోవడం కొసమెరుపు. ఎమ్ఐఎమ్ నేతలతో పాటు ఇతర మైనారిటి నాయకులు రాజాసింగ్ అంశంలో జోక్యం చేసుకుని బీజేపి నుండి శాశ్వతంగా నిషేదించాలని డిమాండ్ చేయడం వంటి పరిణామాలు చకచకా జరిగిపోయాయి. దీంతో తెలంగాణ రాజకీయం మరింత రసకందాయంలో పడిపోయింది.
పరిస్ధితులను పార్టీకి అనుకూలంగా మారుస్తారా.? రేవంత్ రెడ్డిపై అనూహ్య అంచనాలు..
అంతే కాకుండా లిక్కర్ కుంభకోణంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రమేయం ఉందని ప్రచారం జరగడం, బీజేపి నేతలు కవిత ఇంటిని ముట్టడించడంతో పరిస్ధితి పూర్తిగా బీజేపి వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్టు పరిణమించింది. కవిత ఇంటిని ముట్టడించిన బీజేపి నేతలను గులాబీ కార్యకర్తలు తరిమికొట్టడం, ఎమ్మెల్సీ కవితకు గులాబీ నాయకత్వం మొత్తం సంఘీభావం తెలిపింది. ఈ అంశంలో బీజేపి వ్యవహారాన్ని టీఆర్ఎస్ నేతలు పూర్తి స్ధాయిలో తప్పుబట్టారు. అవసరం అనుకుంటే బలనిరూపణకు సైతం సిద్దమనే సంకేతాలిచ్చుకున్నాయి ఈ ఇరు పార్టీలు. గత రెండు వారాలుగా ఇదే వ్యవహారం తారాస్ధాయిలో కొనసాగుతుండడంతో కాంగ్రెస్ పార్టీ గురించి చర్చ గానీ ప్రస్థావన గానీ ఎక్కడా జరగని పరిణామాలు చోటుచేసుకున్నాయి.
కాంగ్రెస్ ను జనం మర్చిపోవాలి.. కమలం,గులాబీ వ్యూహాన్ని రేవంత్ తిప్పికొట్టగలరా.?
తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపి తప్ప ఇతర పార్టీ లేదన్నంతగా రాజకీయం జరగుతున్నా కాంగ్రెస్ పార్టీ మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరింస్తుందనే చర్చ జరగుతోంది. ఏదైనా అంశంపట్ల పూర్తి అవగాహనతో, ఆధారాలతో విలేఖరుల సమావేశం నిర్వహించే పీసిసి అద్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ వ్యవహారల్లో చురుకైన పాత్ర ఎందుకు పోషిండం లేదనే చర్చ జరుగుతోంది. మునుగోడు ఉప ఎన్నికపైన టీఆర్ఎస్, బీజేపి పార్టీలలో లోతైన చర్చజరగడంతో పాటు గెలుపుకోసం క్షేత్ర స్దాయిలో ఇరుపార్టీలు కసరత్తులు చేస్తున్న సందర్బాలు కనిపిస్తున్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది.?లిక్కర్ కుంభకోణం అంశంలో కల్వకుంట్ల కవితకు రేవంత్ స్ధాయిలో కౌంటర్ ఇవ్వలేకపోయారనే చర్చతో పాటు తాజా పరిణామాలను ఖండించడంలో, సంక్షోభంలో అవకాశాలను సృష్టించుకోవడంలో వెనకబడ్డారనే చర్చ జరుగుతోంది. జరుగుతున్న పరిణామాలను అధిగమించి అటు బీజేపికి, ఇటు గులాబీ పార్టీకి ధీటైన సమాధానం రేవంత్ రెడ్డి ఎప్పుడిస్తారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.