అసెంబ్లీలో సింగరేణిపై మాటల యుద్ధం; చిల్లరగాళ్ళు-మంత్రి ఆగ్రహం; దిగజారిన వ్యాఖ్యలు- కాంగ్రెస్ ఎమ్మెల్యే
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య విమర్శల పర్వం కొనసాగింది. తెలంగాణ అసెంబ్లీలో సింగరేణిపై ఈరోజు అధికార టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య వాడివేడి చర్చ కొనసాగింది. అసెంబ్లీ వేదికగా కాంగ్రెసు, బిజెపి లపై విరుచుకుపడ్డారు టిఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు. ఇక టిఆర్ఎస్ పార్టీ నాయకులకు నాలెడ్జ్ లేదని, ఎవరైనా చెబితే వినిపించుకోరు అంటూ మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి .

సింగరేణి ప్రైవేటీకరణ అడ్డుకుంటాం అన్న గులాబీ ఎమ్మెల్యేలు
సింగరేణి బొగ్గు గనులు ప్రైవేటుపరం చేయడానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను అడ్డుకుంటామని టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అన్నారు. బొగ్గు గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని వారంటున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ సింగరేణి కార్మికుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు రూపొందించారని వెల్లడించారు. కరోనా సంక్షోభ కాలంలో కూడా సింగరేణి కార్మికులకు 29 శాతం లాభాల వాటా చెల్లించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని చెప్పుకొచ్చారు. సింగరేణికి చెందిన నాలుగు బ్లాకులను వేలం వేయడాన్ని ఆపడం కోసం కేంద్రంలోని బిజెపి పై పోరాటం చేసి, సింగరేణిని కాపాడుకుంటామని అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు.

చిల్లర రాజకీయాలు చేసేవారు తయారయ్యారు: మంత్రి జగదీశ్ రెడ్డి
సింగరేణి ప్రైవేటీకరణను అడ్డుకుని తీరుతామని, సింగరేణిని కాపాడుకోవడానికి అవసరమైతే మరో ఉద్యమం కూడా చేస్తామని టిఆర్ఎస్ పార్టీ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు .కాంట్రాక్టుల కోసం కొంతమంది నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. రాజకీయాల పేరుతో బ్లాక్ మెయిల్ కు దిగుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాలను అడ్డం పెట్టుకొని మరో పక్క కాంట్రాక్టులు చేసేవారు ఆత్మవిమర్శ చేసుకోవాలని మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో చిల్లర గాళ్ళు తయారయ్యారని జగదీశ్ రెడ్డి మండిపడ్డారు.

మేం ఉద్యమకారులం , కాంగ్రెస్, బీజేపీ నాయకులు పెట్టుబడిదారులు
ఎమ్మెల్యే బాల్క సుమన్ సింగరేణి సంస్థ తెలంగాణకు కొంగు బంగారం అంటూ పేర్కొన్నారు. సింగరేణి సంస్థ ద్వారా సంపదను పెంచి ప్రజలకు పంచుతామని ఆయన వెల్లడించారు. సింగరేణి విషయంలో కేంద్రానికి సీఎం కేసీఆర్, కేటీఆర్ లేఖ రాసినా వేలానికి పెట్టడం దారుణం అంటూ బాల్క సుమన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. తాము ఉద్యమకారులమని, మీరంతా పెట్టుబడిదారులని బాల్క సుమన్ బిజెపి, కాంగ్రెస్ పార్టీలను టార్గెట్ చేశారు.

టీఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యలకు ఎమ్మెల్యే కోమటి రెడ్డి కౌంటర్ .. నాలెడ్జ్ లేదంటూ
ఇదిలా ఉంటే సింగరేణి విషయంలో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఎవరి కోసమో సింగరేణి టెండర్లు వేస్తున్నారని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. సంస్థకు 20 వేల కోట్ల నష్టం వచ్చే విధంగా ప్రభుత్వం టెండర్లు పిలుస్తోంది అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యే లకు నాలెడ్జి లేదని, ఎవరైనా చెబితే వినిపించుకోరని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎద్దేవా చేశారు.
Recommended Video

జగదీశ్ రెడ్డి దిగజారి మాట్లాడుతున్నారని ఆగ్రహం
ఇక ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నేతలనే హాఫ్ నాలెడ్జ్ అంటున్నారంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. మంత్రి జగదీశ్ రెడ్డి తన పేరు చెప్పకుండా చిల్లరగాళ్ళు, కాంట్రాక్టులు చేస్తారు అని మాట్లాడారని మండిపడ్డారు. కాంట్రాక్ట్ ల కోసం అయితే టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళేవాళ్ళం అని ఆయన పేర్కొన్నారు. జగదీశ్ రెడ్డి దిగజారి ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఇసుక దందాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారని, తెలంగాణా రాక ముందు జగదీశ్ రెడ్డి ఆస్తులు ఎంత ఇప్పుడు ఆయన ఆస్తులు ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణా ప్రజలు త్వరలోనే మీకు బుద్ధి చెప్తారని మండిపడ్డారు కోమటి రెడ్డి రాజ గోపాల్ రెడ్డి .












Click it and Unblock the Notifications