కవిత ఇష్యూ: రేవంత్పై కొండాసురేఖ ఒంటికాలిపై లేచారు
హైదరాబాద్: నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత పైన తెలంగాణ తెలుగుదేశం పార్టీ సభ్యుడు రేవంత్ రెడ్డి నిరాధార ఆరోపణలు చేశారని, అందుకు ఆయన బేషరతు క్షమాపణలు చెప్పాలని తెరాస మహిళా శాసన సభ్యులు కొండా సురేఖ, గొంగిడి సునీత తదితరులు బుధవారం అన్నారు. సభలో, మీడియా పాయింటు వద్ద వారు మాట్లాడారు. వారు రేవంత్ పైన మూకుమ్మడిగా మాటల దాడికి దిగారు. ఒంటి కాలి పైన లేచారు.
సభలో లేని వ్యక్తి గురించి వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు. కనీస అవగాహన లేని రేవంత్ రెడ్డి తన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకుని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నిత్యం ఏదో ఒక అంశంపై సభలో రాద్ధాంతం సృష్టిస్తున్న రేవంత్ రెడ్డిని నిలువరించాల్సిందేనని స్పీకర్ను కోరారు. రేవంత్ రెడ్డి ఆధారాలు చూపించాలన్నారు. లేదంటే కవితకు క్షమాపణ చెప్పాలన్నారు.
సభాపతి అనుమతి లేకుండా కవిత గురించి ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. ఆమె గురించి మాట్లాడటం ద్వారా అవమానించారన్నారు. సభకు రేవంత్ రెడ్డి తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు. ఉత్తుత్తి కాగితాలు చూపించారన్నారు. పత్రికల్లో వచ్చిన నిరాధార వార్తలను పట్టుకొని అడగడం ఏమిటన్నారు. రేవంత్ రెడ్డిని సభ నుండి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. రేవంత్ వ్యాఖ్యల పైన కాంగ్రెస్ సభ్యులు ఏం చెబుతారని ప్రశ్నించారు.

సభలో లేని వ్యక్తుల గురించి ప్రస్తావించడమేమిటని, రేవంత్ క్షమాపణ చెప్పాలని ఈటెల రాజేందర్ అన్నారు. సభా మర్యాదలు కాపాడాలన్నారు. రేవంత్ వ్యాఖ్యలను భట్టి విక్రమార్క సమర్థిస్తారా అని ప్రశ్నించారు. దీని పైన రేవంత్ స్పందిస్తూ.. పత్రికల్లో వచ్చిన వార్తలు తమ వద్ద ఉన్నాయన్నారు. దీని పైన ఈటెల మాట్లాడుతూ.. పత్రికల్లో వచ్చిన వాటి ద్వారా ఎలా చెబుతారని ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. తాను నిన్న కవిత పైన చెప్పినప్పుడు ప్రభుత్వం పారిపోయి, ఇప్పుడు రావడం ఏమిటని రేవంత్ ప్రశ్నించారు. నిన్న ఏం చేశారని అభిప్రాయపడ్డారు. సభ అయిపోయేలోగా తన వద్ద ఉన్న సమాచారం ఇస్తానని చెప్పారు.
సభలో గందరగోళం కనిపించడంతో భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. నిన్న అయిపోయిన విషయం గురించి ఇప్పుడు అడ్డుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. దీనిపై ఈటెల స్పందిస్తూ.. తమకు కూడా సభా సంప్రదాయాలు తెలుసునని చెప్పారు. కాగా, సమగ్ర సర్వేలో కవిత రెండు చోట్ల నమోదు చేయించుకున్నారని రేవంత్ రెడ్డి మంగళవారం సభలో అన్నారు.
సర్వే పైన నాయిని
సర్వే ఇంకా పూర్తి కాలేదని, సమాచారం సేకరిస్తున్నామని నాయిని నర్సింహా రెడ్డి అన్నారు. అమరుల కుటుంబాలకు సాయం అందిస్తామన్నారు.
విద్యుత్ పైన హరీష్ రావు
గత నాలుగు నెలల్లో విద్యుత్ కొనుగోలుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.2,500 కోట్లు ఖర్చు చేసినట్టు నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు శాసనమండలిలో తెలిపారు. విద్యుత్ మిగులు రాష్ట్రంగా మార్చేందుకు తమ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఈ నేపథ్యంలో అవసరమైతే విదేశీ బొగ్గును దిగుమతి చేసుకుంటామని తెలిపారు. గోదావరి బేసిన్ ప్రాంతం ప్రాంతంలో విద్యుదుత్పత్తి యూనిట్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండలికి వివరించారు.
విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కేందుకు రాష్ట్రంలో అఖిలపక్షం కేంద్రంపై ఒత్తిడి తెచ్చే విధంగానూ ప్రయత్నిస్తున్నామన్నారు. త్వరలో హైదరాబాదుకు నిరంత విద్యుత్ ఇస్తామన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ వద్ద మిగులు విద్యుత్ ఉంటుందన్నారు. ఎన్టీపీసీ నుండి చత్తీస్గఢ్కు సాంకేతికంగా ఇవ్వడం సాధ్యం కాదన్నారు. జెన్కోను బలోపేతం చేస్తామన్నారు. ఇందుకోసం రూ.1000 కోట్లు ఇస్తున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications