ఏపీ అసిస్టెంట్ ప్రొఫెసర్పై జెఎన్టీయూ తెలంగాణ విద్యార్ధులు దాడి
అమరావతి: హైదరాబాద్ జెఎన్టీయూలో ఏపీకి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్పై దాడి జరగడం కలకలం సృష్టించింది. ఈ ఘటనపై బాధిత అసిస్టెంట్ ప్రొఫెసర్ గవర్నర్కు ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
ప్రకాశం జిల్లాకు చెందిన రాజశేఖర్ కూకట్ పల్లి ప్రగతినగర్లో ఉంటున్నారు. కొండాపూర్లోని 'నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్'లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం ఆయన జెఎన్టీయూలోని సన్నిహితులను కలవడానికి వెళ్లారు.
అదే సమయంలో సెక్షన్ 8 అమలను వ్యతిరేకిస్తూ విద్యార్ధులు నిరసన తెలియజేస్తున్నారు. చదువు కోకుండా ఇలాంటి గొడవలు చేస్తుంటే ఎలా చూస్తూ ఉన్నావంటూ అక్కడున్న వాచ్మెన్తో రాజశేఖర్తో చెప్పాడు. దీంతో వాచ్మెన్ ఫోన్లో ఈ విషయాన్ని విద్యార్ధి నాయకులకు చెప్పాడు.
ఆగ్రహానికి లోనైన విద్యార్ధులు అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజశేఖర్పై ఎదురుదాడికి దిగారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన తనను మరోసారి క్యాంపస్లో కనిపించవద్దంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో వెంటనే అసిస్టెంట్ ప్రొఫెసర్ రాజశేఖర్ సమీప పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
తెలంగాణ జాగృతి జెఎన్టీయూ క్యాంపస్ ఇన్చార్జి మధుతో పాటు పలువురు విద్యార్ధులు దాడి చేశారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తునట్లు తెలిపారు.