ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం.. అంచనాలు, ఖర్చుకు పొంతనేదీ ? సభలో భట్టి వర్సెస్ కేసీఆర్
హైదరాబాద్ : ద్రవ్య వినిమయ బిల్లును సీఎం కేసీఆర్ సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై సభా నాయకుడు కేసీఆర్, విపక్ష నేత భట్టి విక్రమార్క మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. మిషన్ భగీరథతో మొదలైన మాటల మంటలు సబ్ ప్లాన్, ప్రాజెక్టులు, భూ రికార్డుల అంశాల వారీగా జరిగింది. విపక్షాలు లేవనెత్తిన అంశాలకు సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు కేసీఆర్. ఆ తర్వాత ఓట్ ఆన్ అకౌంట్ ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అప్రొప్రియేషన్ బిల్లుకు ఆమోదం తెలిపాక సభను వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ద్రవ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీలో జరిగిన చర్చపై వన్ ఇండియా ప్రత్యేక కథనం.
అంచనాలకు ఖర్చుకు పొంతనలేదు ..
తొలుత ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చను ప్రారంభించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. బడ్జెట్ లో కేసీఆర్ ప్రతిపాదించిన అంచనాలను, ఖర్చులకు పొంతనలేదన్నారు విక్రమార్క. బడ్జెట్ కు కేటాయింపులకు 24 శాతం తేడా ఉందని ప్రస్తావించారు. రాష్ట్రాభిృద్ధి అన్ని రంగాల్లో బాగున్నా విద్య విషయంలో మాత్రం కేటాయింపులు సరిగా లేదని పేర్కొన్నారు. కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టుల మీద సందేహాలను లేవనెత్తారు. ఆదాయం పెంచుకునే మార్గాలను ప్రభుత్వం అన్వేషించాలని సూచించారు. భూ రికార్డుల ప్రక్షాళన పూర్తి చేయాలని కోరారు. చేయని మిగతా 4 శాతం ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారన్నారు. ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారో చెప్పాలని సభా నాయకుడు సీఎం కేసీఆర్ ను సమాధానం చెప్పాలన్నారు. పంట పడించిన రైతు మద్దతు ధర ఇవ్వాల్సిందే ప్రభుత్వాలేనని చెప్పారు. ఎర్రజొన్నకు మద్ధతు ధర కోసం ఆర్మూర్ లో రైతులు ఆందోళన చేపడుతున్నారన గుర్తుచేశారు. ఈ సమస్యను వీలైనంత త్వరగా చేపట్టాలని సభా దృష్టికి తీసుకొచ్చారు.
అంశాలవారీగా .. అంకెలతో సీఎం వివరణ
ప్రతిపక్ష నేత భట్టి మల్లు విక్రమార్క సహా మిగతా పక్షాల నేతలు లేవనెత్తిన అంశాలపై అంకెలతో సవివరంగా వివరణ ఇచ్చారు సీఎం కేసీఆర్. ప్రతిపక్షాల నుంచి ఆశించిన మేర నిర్మాణాత్మక సూచనలు రాలేదన్నారు. అసంబద్ధ వాదనలు తీసుకొచ్చారని చెప్తారు. యూపీఏ సర్కార్ నెలకొల్పిన మోడల్ స్కూళ్ల మాదిరిగా .. పకడ్బందీ ప్రణాళికతో పటిష్టంగా మోడల్ స్కూల్స్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మళ్లీ కేంద్రంలో ఏ ప్రభుత్వం వస్తుందో తెలియదని .. అందుకే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టినట్టు సభ్యులకు తెలిపారు. కేంద్రప్రభుత్వ ప్రాధాన్యాలు చూసి బడ్జెట్ ప్రవేశపెట్టడం అనవాయితీ అని చెప్పారు. బడ్జెట్ అంచనాలు సాధరణంగా 29 రాష్ట్రాల్లో అంచనాల్లో సవరణలు ఉంటాయని .. సప్లిమెంటరీ బడ్జెట్ పెడతామన్నారు. ఓట్ ఆన్ అకౌంట్ అంటే పరిమిత సమయానికి నిధుల కేటాయింపు అని పేర్కొన్నారు. ఇకపై పరిపాలనలో ప్రజల మేలు కోరి కఠినమైన చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.
లెక్క లేదు .. పత్రం లేదు ..
గతంలో కూడా భూ రికార్డుల ప్రక్షాళన చేశారని .. కానీ లెక్క లేదు పత్రం లేదన్నారు సీఎం. మేం అధికారంలోకి వచ్చాక నిర్మాణాత్మకంగా పనిచేస్తున్నామని .. మా పనితీరును యావత్ దేశం చూస్తోందన్నారు. గతంలో అరాచకం, దుర్మార్గం ఉండేదని .. ఓటర్ల జాబితా కూడా తప్పుల తడకేనని పేర్కొన్నారు. ఓటర్ల నమోదు ప్రక్రియను పర్యవేక్షించేది బ్యూరోక్రాట్లని గుర్తుచేశారు. ఐఏఎస్ అధికారుల నుంచి కూడా తప్పులు ఉత్పన్నమైతే పరిస్థితి ఏంటన్నారు. అందుకే కఠినంగా వ్యవహరించాలనే నిర్ణయానికి వచ్చినట్టు పేర్కొన్నారు. విద్య కోసం తక్కువ నిధులు కేటాయించారని భట్టి చెప్పారని .. వివిధ పద్దుల కోసం 19 వేల 487 కోట్లు కేటాయించినట్టు స్పష్టంచేశారు. ఎస్టీ, ఎస్టీ సబ్ ప్లాన్ కు కూడా గతంలో కన్నా మెరుగ్గా నిధులు కేటాయించామని తేల్చిచెప్పారు. అటవీ చట్టంలో లోపాలు ఇప్పటివీ కావని .. 1960లో నెహ్రూ జమానా నుంచి ఉందని ప్రత్యేకంగా ప్రస్తావించారు. గిరిజనుల పోడు భూముల సమస్య పరిష్కారం కోసం స్వయంగా తానే రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో అవలంభించాల్సిన విధానాలపై అధ్యయనం చేసి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు సీఎం.
మోడల్ గా తెలంగాణ
వివిధ పథకాలకు, పనులకు తెలంగాణ రాష్ట్రం మోడల్ గా నిలిచిందన్నారు సీఎం కేసీఆర్. అత్యంత పకడ్బందీ పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ చేపట్టామని పేర్కొన్నారు. భూ రికార్డుల ప్రక్షాలన ఏడాదిలోపు పూర్తిచేస్తామని తేల్చిచెప్పారు. పారదర్శకంగా ఈ ప్రక్రియ జరుగుతున్నదనే ఆలస్యమవుతోందన్నారు. సంవత్సరం లోపు రికార్డుుల ప్రక్రియ చేపట్టి .. ధరణి వెబ్ సైట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. రైతు బంధు ఆదర్శంగా తీసుకొని కిసాన్ సన్మాన్ పథకం రూపొందించారని గుర్తుచేశారు. బీడీ కార్మికులకు దేశంలో ఏ రాష్ట్రమైనా పింఛన్ ఇచ్చిందా అని ప్రశ్నించారు కేసీఆర్. నిరుద్యోగ భృతిపై పకడ్బందీ ప్రణాళికతో ముందుకెళ్తామన్నారు.