బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష.. ఏడేళ్ల పాలనపై చర్చకు సిద్ధమా.. కేసీఆర్కు బీజేపీ బస్తీ మే సవాల్..
తెలంగాణలో రాజకీయాలు మరింత హీటెక్కాయి. కేసీఆర్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ప్రతిపక్షాలు పోరుబాట పట్టాయి. ఒక వైపు వడ్ల కొనుగోలు , మరోవైపు ఉద్యోగాల భర్తీల అంశాలపై టీఆర్ఎస్ సర్కార్ను ఇరుకున పెడుతున్నాయి. ఏడేళ్ల పాలనలో ఏం చేశావంటూ ప్రశ్నిస్తున్నాయి. తెలంగాణ ప్రజలను తన మాయ మాటలతో మోసం చేస్తున్నారంటూ కేసీఆర్పై ఆగ్రహంతో ఊగిపోతున్నాయి.
బండి సంజయ్ నిరుద్యోగ దీక్ష
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నిరుద్యోగ దీక్ష చేపట్టింది. తెలంగాణ స్టేట్ బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ దీక్షకు కూర్చున్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఈ దీక్ష కొనసాగనుంది. బండి సంజయ్తో పాటు బీజేపీ నేతలు ఈటల రాజేందర్, విజయశాంతి, జితేందర్ రెడ్డి , పొంగులేటి సుధాకర్ రెడ్డి, స్వామి గౌడ్ , ఇతర నేతలు దీక్షలో కూర్చున్నారు. తెలంగాణ ప్రభుత్వ విధానాలపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు.
ఏడేళ్ల పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమా ?
బండి సంజయ్ దీక్షను ప్రారంభించిన రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్ కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తెలంగాణ కోసం పోరాడిన యువతను సీఎం కేసీఆర్ మరిచిపోయారని మండిపడ్డారు. ఉద్యోగాలను భర్తీ చేస్తామని మాయమాటలు చెప్పి.. నిరుద్యోగులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణ వచ్చాక కేసీఆర్ ఇంట్లో మాత్రమే ఉద్యోగాలు వచ్చాయని ఆరోపించారు. ఈ ఏడేళ్ల పాలనలో మీరేం చేశారో..? బండి సంజయ్తో బహిరంగ చర్చకు సిద్ధమా ? అని తురుణ్ చుగ్ సవాల్ విసిరారు. మోదీ ఏడేళ్ల పాలన.. కేసీఆర్ ఏడేళ్ల పాలనపై చర్చకు రావాలని డిమాండ్ చేశారు.
ఉద్యమ ద్రోహులకు కేసీఆర్ పెద్దపీట..
తెలంగాణ ఉద్యమ ద్రోహులకు సీఎం కేసీఆర్ పెద్ద పీట వేస్తున్నారని తరుణ్ చుగ్ విమర్శించారు. ఉద్యోగాలు లేక అనేకమంది యువత బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.బంగారు తెలంగాణ చేస్తామన్న తన ఇంటిని మాత్రమే బంగారంగా మార్చుకున్నారని ఎద్దేవా చేశారు. ప్రతి ఇంటికి ఉద్యోగం కల్పిస్తామన్న ఆ హామీ ఏమైందని కేసీఆర్ను ప్రశ్నించారు.
తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న యువత పోరాటం ఫలితంగానే కేసీఆర్ అధికార ఫీఠం ఎక్కారన్నారు. పేదల జీవితాల్లో మార్పు తీసుకురావడానికి కేసీఆర్ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ ప్రభుత్వం దేశ ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చిందన్నారు. టీఆర్ఎస్కు కాంగ్రెస్ బీ టీంగా పనిచేస్తోందని ఆరోపించారు తరుణ్ చుగ్.
కేసీఆర్ సర్కార్పై ఎదురుతిరగండి..
పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో అనిశ్చితి ఏర్పడిందని మండిపడ్డారు బీజేపీ నేత విజయశాంతి. రాష్ట్రంలో దొరల పాలనకు సాగుతోందన్నారు. నిరుద్యోగులంతా తమ తల్లిదండ్రుల కలలను నిజం చేసేందుకు పోరాటం చేయాలన్నారు. తెలంగాణ కోసం ఆనాడు పోరాడిన యువత నేడు ఉద్యోగాల కోసం చనిపోవడం సరైంది కాదన్నారు.
పిరికితనంతో కాకుండా కేసీఆర్ ప్రభుత్వంపై ఎదురుతిరిగి పోరాడాలని విజయశాంతి పిలుపునిచ్చారు. నిరుద్యోగ భృతి , ఉద్యోగాలు ఇస్తామన్న కేసీఆర్ ఈ ఏడేళ్ల పాటు ఏం చేశారని ప్రశ్నించారు. నిరుద్యోగుల కోసం ప్రభుత్వ ఉద్యోగులు కూడా పోరాటం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాన్ని కూల్చే సత్తా యువతకే ఉందన్నారు .
ఎంపీ అర్వింద్ గృహనిర్బంధం
మరోవైపు పలు జిల్లాల నుంచి బండి సంజయ్ నిరుద్యోగ దీక్షకు తరలివస్తున్న బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ను పోలీసులు గృహనిర్భంధం చేశారు. మహాబూబ్ నగర్, రాజన్న సిరిసిల్ల జిల్లా, మెదక్ , ఆదిలాబాద్ జిల్లా నుంచి దీక్షకు బయలుదేరిన కమలం నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. పోలీసుల అరెస్ట్లను బీజేపీ నేతలు తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ నిరంకుశ పాలనకు రోజులు దగ్గరపడ్డాయని మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలదోల్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.