పోలీసు శాఖలో కరోనా కలకలం: డీజీపీ కీలక ఆదేశాలు
హైదరాబాద్: తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. కరోనా కట్టడి కోసం అహర్నిశలు పనిచేస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది తోపాటు పలువురు పోలీసులు కూడా ఆ మహమ్మారి బారినపడుతున్నారు. ఇటీవల కాలంలో పోలీసు సిబ్బంది ఎక్కువగా కరోనా బారినపడుతుండటంతో ఆ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
కరోనా విలయానికితోడు 6 విపత్తులు.. భారత్కు ఇది టర్నింగ్ పాయింటన్న మోదీ.. 'ఆత్మనిర్భర్’తో సాగుదామంటూ
సెలవు తీసుకోండి..
కరోనా అనుమానిత లక్షణాలతో బాధపడుతున్న పోలీసు ఉన్నతాధికారులు, కిందిస్థాయి సిబ్బంది విశ్రాంతి తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు. అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు ఈ మేరకు ఆయన ఆదేశాలు జారీ చేశారు.
లాక్డౌన్ విధించిన నాటి నుంచి కరోనా కట్టడిలో పోలీసులు నిరంతరం శ్రమిస్తున్న విషయం తెలిసిందే. ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే వెంటనే సెలవు తీసుకోవాలని డీజీపీ సూచించారు. అంతేగాక, ఉన్నతాధికారులు పోలీసు సిబ్బందికి వెంటనే అనుమతివ్వాలని ఆదేశించారు.
పోలీసు శాఖలో కరోనా కలకలం.. తొలి మరణం కూడా
కాగా, తెలంగాణలో ఇప్పటి వరకు 84 మంది పోలీసులు కరోనా బారినపడ్డారు. తాజాగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఏడుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది. పోలీసు శాఖలో తొలి మరణం కూడా సంభవించింది. దయాకర్ రెడ్డి అనే పోలీసు కానిస్టేబుల్ కరోనా బారిన పడి మృతి చెందిన విషయం తెలిసిందే. మన్సూరాబాద్కు చెందిన దయాకర్ రెడ్డి, జియాగూడలో విధులు నిర్వహించేవారు.
కరోనా ప్రభావిత ప్రాంతాలోనూ విధులు..
కంటైన్మెంట్ జోన్లు, కరోనా చికిత్సా కేంద్రాల్లో విధుల నిర్వహణ వల్లే వీరికి కరోనా పాజిటివ్ వస్తున్నట్లు అనుమానిస్తున్నారు. పాజిటివ్ వచ్చిన అధికారులతోపాటు వారి కుటుంబసభ్యులను హోంక్వారంటైన్ చేస్తున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 4111కు చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 2138గా ఉంది. బుధవారం జీహెచ్ఎంసీ పరిధిలో 143 కేసులు నమోదు కాగా, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాలో 11 చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో కరోనాతో 156 మంది ప్రాణాలు కోల్పోయారు.