ఉద్యోగుల విభజనపై కసరత్తు - కేడర్ల వారీగా కేటాయింపు : నెలాఖరులోగా పూర్తి..!!
రాష్ట్రంలో కొత్త జిల్లాల మధ్య ఉద్యోగుల పంపిణీపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. జిల్లా కేడర్ ఉద్యోగుల విభజన ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటంతో.. తొలుత కోడ్ లేని జిల్లాల్లో పోస్టులు, ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ చేపట్టనుంది. మిగతా జిల్లాల్లో ఈ నెల 16 తర్వాత ప్రక్రియ మొదలుపెట్టనుంది. ఉమ్మడి జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేసి.. కొత్త జిల్లాల మధ్య పోస్టులను విభజించనుంది.
ఉద్యోగ సంఘాలతో సీఎస్ సమావేశం
ఇదే అంశం పైన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ టీజీఓ..టీఎన్జీవో ఉద్యోగ సంఘాల నేతలతో సామవేశమయ్యారు. ఉద్యోగులందరికీ క్యాడర్ల వారిగా ఆప్షన్స్ ఇచ్చి కేటాయింపులు కల్పిస్తామని సీఎస్ హామీ ఇచ్చారు. సజావుగా పూర్తి చేసేందుకు రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన 33 జిల్లాలకు అనుగుణంగా ఏడు జోన్లు, రెండు మల్టీజోన్లతో కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల విభజన జరగాల్సి ఉంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏయే పోస్టులు ఏయే కేడర్ల కిందకు వస్తాయన్నది ఇప్పటికే ఖరారు చేసింది.
కొత్త జిల్లాల ప్రకారం కేడర్ ఉద్యోగుల విభజన
కొత్త జిల్లాల ప్రకారం కేడర్ ఉద్యోగుల విభజన ప్రక్రియలో.. ఉద్యోగుల స్థానికత, సీనియారిటీకి నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్, టీఎన్జీవోల అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ తెలిపారు. మరోవైపు జోనల్, మల్టీ జోనల్ కేడర్ పోస్టుల విభజనపై ఒకట్రెండు రోజుల్లో సీఎం కేసీఆర్తో సమావేశమై చర్చలు జరుపుతామని ఉద్యోగ నేతలు వెల్లడించారు. సీఎస్ సోమేశ్కుమార్ నేతృత్వంలో జీఎడీ ముఖ్యకార్యదర్శి వికాస్రాజ్, ఆర్థికశాఖ కన్సల్టెంట్ శివశంకర్లతో రాష్ట్రస్థాయిలో ఏర్పాటైన కమిటీ.. జోనల్, మల్టీ జోనల్ పోస్టుల విభజనను పర్యవేక్షించనుంది.
నెలాఖరులోగా ప్రక్రియ పూర్తి..
జిల్లా కేడర్ పోస్టులు, ఉద్యోగుల విభజనను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ఉమ్మడి జిల్లాల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయనుంది. వీటికి ఉమ్మడి జిల్లా కేంద్రం కలెక్టర్ నేతృత్వం వహిస్తారు, ఇతర జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల జిల్లా అధికారులు సభ్యులుగా ఉంటారు. ప్రతి ఉమ్మడి జిల్లా పరిధిలో సదరు కమిటీ పోస్టులు, ఉద్యోగుల విభజనను చేపడుతుంది. ఇక కొత్త జిల్లాల మధ్య ఉపాధ్యాయల విభజన, బదిలీలపై ప్రభుత్వం త్వరలో ప్రత్యేక సమావేశం నిర్వహించనుంది.
Recommended Video
ఉద్యోగ సంఘాల సూచనలతో
రాష్ట్ర విభజన, కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో గందరగోళంగా ఉద్యోగుల విభజన చేశారు. ఈసారి అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరారు. భార్యభర్తల్లో ఎవరు కోరుకుంటే వారిని తమ జీవిత భాగస్వామి పనిచేసే జిల్లాకు బదిలీ చేయాలని సూచించారు. పెద్ద, చిన్న జిల్లాలకు సమాన సంఖ్యలో పోస్టులు ఇస్తే ఉద్యోగులు నష్టపోతారు. జనాభా ప్రాతిపదికన పోస్టుల విభజన చేయాలంటూ ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించారు.