TS Govt : రేవంత్ రెడ్డి ప్రజాదర్బార్ కొత్త పేరు ఇదే ! ఇక ఆ రెండు రోజుల్లోనే..
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజలతో మమేకం కావాలని నిర్ణయించిన కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజా దర్బార్ రెగ్యులర్ గా నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత రోజు నుంచే ప్రజా దర్బార్ ప్రారంభించారు. దీంతో ఇన్నాళ్లూ ప్రగతి భవన్ పేరెత్తాలంటే భయపడే వారు నిత్యం అక్కడికి వచ్చి ముఖ్యమంత్రిని కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రభుత్వం ఇవాళ ఇందులో పలు మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
తొలుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలతో ముఖాముఖీ అయ్యే ఈ కార్యక్రమాన్ని ప్రజా దర్బార్ గా పేర్కొన్న ప్రభుత్వం.. దీన్ని ఇప్పుడు ప్రజా వాణిగా పేరు మార్చింది. ప్రజా దర్బార్ అంటే రాజరికపు పోకడలకు గుర్తుగా ఉందనో, లేక మరే ఇతర కారణంతోనో ప్రభుత్వం ఈ కార్యక్రమం పేరు మార్చినట్లు తెలుస్తోంది. అలాగే ప్రజా వాణి కార్యక్రమాన్ని వారమంతా కాకుండా కేవలం వారానికి రెండు రోజుల పాటు మాత్రమే నిర్వహించాలని నిర్ణయించింది.

తెలంగాణ ప్రభుత్వం తాజా నిర్ణయం ప్రకారం ఇకపై ప్రజా వాణిగా మారిన ప్రజా దర్బార్ కార్యక్రమం ఇకపై ప్రతీ మంగళవారం, శుక్రవారం మాత్రమే నిర్వహిస్తారు. ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొని ప్రజల ఫిర్యాదుల్ని స్వీకరిస్తారు. దీంతో ప్రజా దర్బార్ కార్యక్రమం పేరుతో పాటు సమయాల్ని కూడా మార్చినట్లయింది. అదే సమయంలో ఇప్పటివరకూ ప్రజా దర్బార్ కార్యక్రమానికి వచ్చిన స్పందన వివరాల్ని కూడా ప్రభుత్వం వెల్లడించింది.

గత శుక్రవారం ప్రజా దర్బార్ ప్రారంభమైన నాటి నుంచి సోమవారం వరకూ మొత్తం 4471 వినతులను ప్రజల నుంచి స్వీకరించినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులోనూ ఎక్కువ శాతం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, వాటి నిర్మాణం, పెన్షన్లకు సంబంధించినవే ఎక్కువగా ఉన్నాయని వారు తెలిపారు. కేవలం ఇవాళ ఒక్కరోజే 1143 వినతులు అందినట్లు అధికారులు ప్రకటించారు.












Click it and Unblock the Notifications