ప్రజల ప్రాణాలు విలువైనవా? ఎన్నికలా? ఎస్ఈసీపై హైకోర్టు ఆగ్రహం, తెలంగాణా ప్రభుత్వంపై ఫైర్
తెలంగాణ రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ జరిపింది. రాష్ట్రంలో దారుణ కరోనా పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై, రాష్ట్ర ఎన్నికల సంఘం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్రంలో గ్రేటర్ వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్, సిద్దిపేట, జడ్చర్ల, అచ్చంపేట, నకిరేకల్,కొత్తూరులలో ఎన్నికలు నిర్వహించనున్న సమయంలో రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని సూటిగా ప్రశ్నించింది తెలంగాణ హైకోర్టు.తెలంగాణా సర్కార్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది .
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోరు: కరోనా హోరు..ప్రచారాల జోరు..ప్రజలు బేజారు!!
యుద్ధం వచ్చినా,ఆకాశం విరిగి మీదపడినా ఎన్నికలు జరగాల్సిందేనా ?
రాష్ట్రంలో ప్రస్తుతం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రజల ప్రాణాలు విలువైనవా? ఎన్నికలా? అంటూ ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది హైకోర్టు ధర్మాసనం. యుద్ధం వచ్చినా,ఆకాశం విరిగి మీదపడినా ఎన్నికలు జరగాల్సిందేనా అంటూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది.కొన్ని మునిసిపాలిటీలలో ఎన్నికలకు ఇంకా సమయం ఉందని గుర్తు చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయంతోనే ఎన్నికలు నిర్వహిస్తున్నట్లుగా ఎన్నికల కమిషన్ కోర్టు దృష్టికి తీసుకు వెళ్ళింది.
కరోనా సమయంలో నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చారన్న హైకోర్టు
కరోనా రెండో దశ ప్రారంభం అయిన తరువాత నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చారని ప్రశ్నించిన కోర్టు, ఎన్నికలను వాయిదా వేసే అధికారం ఎన్నికల కమిషన్ కు లేదా అంటూ నిలదీసింది.ఎన్నికల ప్రక్రియపై అధికార యంత్రాంగం పని చేస్తున్న సమయంలో కరోనాపై దృష్టి పెట్టటం ఎలా? అని అడిగింది.ఎన్నికల ప్రచారాన్నికూడా కుదించలేదని అసహనం వ్యక్తం చేసింది. ఎస్ఈసి ఇచ్చిన వివరణ సరిగాలేదని మండిపడింది. ఇక దీనిపై వివరణ ఇవ్వడం కోసం అధికారులు విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
ఉద్యోగులకు చేస్తారా? చస్తారా? అనే పరిస్థితి కల్పించారని ఫైర్
అంతేకాదు ఎన్నికల నిర్వహణ పై ప్రభుత్వ అభిప్రాయం అడగాల్సిన అవసరం ఏమిటని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించింది హైకోర్టు. మున్సిపల్ ఎన్నికలు సజావుగా జాగ్రత్తగా నిర్వహించాలని ఆదేశించింది. మద్యం దుకాణాలు మూసేయాలని సూచించింది. ఎన్నికల సంఘం పనితీరు సరిగా లేదన్న కోర్టు ఎన్నికలు వాయిదా వేయకుండా ముందుకు వెళ్లడం బాధాకరమని వ్యాఖ్యానించింది. ఉద్యోగుల ప్రాణాలను పణంగా పెట్టి ఎన్నికలు నిర్వహించడం అవసరమా అని ప్రశ్నించింది. ఉద్యోగులకు చేస్తారా? చస్తారా? అనే పరిస్థితి కల్పించారని అభిప్రాయపడింది.
కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం
కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రభుత్వం ఎన్నికలకు సన్నద్ధత వ్యక్తం చేయడం ఆశ్చర్యకరమైన విషయం అని పేర్కొంది హైకోర్టు.ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు అక్షింతలు వేసింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది.రేపటితో రాత్రిపూట కర్ఫ్యూ ముగుస్తుందని,ఆ తర్వాత ఏం చేయబోతున్నారని ప్రశ్నించింది. పరిస్థితిని సమీక్షించి రేపు నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం సమాధానం ఇవ్వడంతో హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.చివరి నిమిషంలో నిర్ణయాలు తీసుకోవడం ఏమిటని ప్రశ్నించింది. కర్ఫ్యూ వంటి విషయాలపై ఒకరోజు ముందు నిర్ణయం తీసుకుంటే నష్టం ఏంటని ప్రశ్నించిన హైకోర్టు తెలంగాణ సర్కార్ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
Recommended Video