తెలంగాణలో గత ఏడాది కంటే 31 శాతం అధిక వర్షాలు నమోదు: భారత వాతావరణ శాఖ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది వర్షాకాలంలో అత్యధిక వానలు కురిసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ఆగస్టు చివర నుంచి సెప్టెంబర్ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. దీంతో రాష్ట్రంలోని చెరువులన్నీ నిండు కుండలా మారాయి. వాగులు, వంకలు ఉప్పొంగాయి. నదులకు కూడా భారీగా వరదనీరు వచ్చి చేరింది. రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
కాగా, ఈ ఏడాది తెలంగాణ రాష్ట్రంలో సాధారణం కంటే 31 శాతం అదనంగా వర్షాలు కురిశాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. దేశంలోని అన్ని ప్రాంతాల కంటే తెలంగాణలోనే ఎక్కువ వర్షాలు కురిశాయి. జూన్ ఒకటి నుంచి సెప్టెంబర్ 20 వరకు 920.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది.
సాధారణంగానైతే 701.2 వర్షపాతం నమోదవుతుంది. అంటే ఈసారి సుమారు సాధారణం కంటే 200 మిల్లీమీటర్ల వర్షపాతం అధికంగా నమోదైంది. వర్షాకాల సమయం దాటుతున్నప్పటికీ దేశంలోని ఎనిమిది ప్రాంతాల్లో అత్యధిక స్థాయిలో వర్షాలు పడ్డాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఇందులో అత్యధిక వర్షాలు పడిన రాష్ట్రంగా తెలంగాణ ముందు వరుసలో ఉంది.
తెలంగాణ తర్వాత మరఠ్వాడ, రాయలసీమ , ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక, హర్యానా, ఛండీగఢ్, పశ్చిమబెంగాల్, అండమాన్ నికోబార్ దీవుల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. గత కొన్ని సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున వర్షాలు పడటం ఇదే మొదటిసారని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తెలంగాణలో గత సంవత్సరం 48 శాతం సాధారణం కంటే అధిక వర్షాలు నమోదయ్యయాని వెల్లడించారు. 2020లో సౌరాష్ట్ర కుచ్ ప్రాంతంలో అత్యధికంగా 126 శాతం అధిక వర్షాలు నమోదయ్యాయి.
తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో జోరు వానలు కొసాగుతున్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మరో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తర ఒడిసా, పశ్చిమ బెంగాల్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తమిళనాడు తీరంలో మరో ఆవర్తనం ఉంది. వీటి ప్రభావంతో సోమవారం కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా ఒక మోస్తరు నుంచి భారీవర్షం కురిసింది. మంగళ, బుధవారాల్లో ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
ఇక తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని హైదరాబాద్తోపాటు పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు ముంచెత్తుతున్నాయి. సోమవారం రాత్రి తొమ్మిదింటి వరకు మెదక్ జిల్లా చిల్పిచేడు మండలం చిట్కుల్ అత్యధికంగా 14.08 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంగళవారం కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది.
తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా దక్షిణ తెలంగాణ వరకు ఉన్న ఉపరితల ద్రోణి సోమవారం దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక నుంచి ఇంటీరియర్ తమిళనాడు మీదుగా కోమరిన్ తీరం వరకు సముద్రమట్టం నుంచి 0.9 కిలో మీటర్ల ఎత్తువరకు కొనసాగుతున్నదని పేర్కొంది. వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం సోమవారం గ్యాంగ్టక్, పశ్చిమ బెంగాల్ పరిసర ప్రాంతాల్లో ఉండి, సముద్ర మట్టం నుంచి 5.8 కిలో మీటర్ల వరకు కొనసాగుతున్నదని తెలిపింది.
Recommended Video
దీని ప్రభావంతో మంగళవారం పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. సోమవారం రాష్ట్రంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్పేట మండలం అలియాబాద్లో 12.10 సెం.మీ., యాదాద్రి భువనగిరి జిల్లాకేంద్రంలో 10.03 సెం.మీ., పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం మల్యాలపల్లిలో 9.08 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టు టీఎస్డీపీఎస్ తెలిపింది. సోమవారం సాయంత్రం నుంచి కురిసిన భారీ వర్షంతో హైదరాబాద్ నగరంలోని రహదారులన్నీ జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లల్లోకి వరదనీరు చేరి ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు.